శునకంబును తోడ్కొని కనకంబు సింహాసనంబుపై కూర్చోంబపెట్టిన... అనేది ఇప్పుడు బాగా గుర్తొస్తోంది. రాష్ట్రమంతా దేవాలయాలపై దాడులు జరుగుతుంటే.. వాటిని తేల్చాల్సిన పని వదిలేసి.. అడిగేవారిపైనే మొరగటమే పనిగా దేవాదాయశాఖా మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఈయన కంటే ముందే విజయసాయిరెడ్డి రామతీర్ధం వెళ్లిపోయి అంతా హైజాక్ చేసి కంపు కంపు చేసేశాడు. ఇక ఆ తర్వాత పై నుంచి వచ్చిన ఆదేశాలను ఫాలో అవ్వాలని రెడీ అయితే.. ఈ లోపు ఇంకో రాజ్యాంగేతర శక్తి విశాఖ శారదాపీఠం నుంచి ఫోన్ చేసి మరో ఆదేశం ఇచ్చాడు. దీంతో కన్ఫ్యూజ్ అయిపోయిన పెద్దమనిషి.. మైకు ముందు రెచ్చిపోయాడు. మనసులో మంత్రి పదవి పోతుందనే భీతి పెరిగిపోవడంతో.. ఏం మాట్లాడుతున్నాడో సృహ కూడా లేకుండా.. మాట్లాడేశాడు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును పట్టుకుని పనికిమాలినోడు.. వెధవ అంటూ కూతలు కూశాడు. అది విన్నదేవాదాయ శాఖ అధికారులే అవాక్కయ్యారు.
మంత్రికి బాధ్యత లేదా..
అశోక్ గజపతిరాజు మంత్రి పదవుల్లో ఉన్నారు.. సీనియర్ రాజకీయ నాయకుడు.. ఇవన్నీ పక్కన పెట్టేయొచ్చు. అసలు వెల్లంపల్లి తిట్టిన సందర్భం ఏంటంటే.. రామతీర్ధం గుడికి ఛైర్మన్గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించినప్పుడు.. ఎందుకు అని విలేకరులు అడిగితే ఇలా రెచ్చిపోయాడు. పైగా అశోక్ గజపతిరాజే రాముడి తల నరికినట్లు.. ఈయనకు తెలిసిపోయినట్లు వాగాడు. ఇప్పటివరకు అశోక్ గజపతిరాజు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఛైర్మన్గా ఉన్న మనిషి అంత బాధ్యత వహించాల్సి వస్తే.. మంత్రిగా ఉండి.. ఇన్ని ఘటనలు జరుగుతుంటే ఏం బాధ్యత తీసుకున్నట్లు. ఎన్ని మాటలు మనం అనాలి.. ఆయన పడాలి.
ఆ రామతీర్ధం గుడికి ఛైర్మన్గా అశోక్ గజపతిరాజు ఉన్నది.. ఆయనేదో రాజకీయ నాయకుడనో.. లేక పెద్ద పెద్ద మంత్రి పదవులు నిర్వహించాడనో కాదు.. పూసపాటి వంశంలో వారసుడిగానే. ఆ గుడిని కట్టిందే ఆయన ముత్తాతలు. అప్పటి నుంచి ఆ వంశం వారే ఆ దేవస్థానాన్ని చూసుకుంటున్నారు. ఆ ప్రాంతంలో పూసపాటి వంశీయులను వ్యక్తిగత విషయాలన్నీ పక్కనపెట్టి చాలా గౌరవిస్తారు. అలాంటి అశోక్ గజపతిరాజును వెల్లంపల్లి అంత దారుణంగా దూషించటంతో.. క్షత్రియ వంశం వారంతా భగ్గుమన్నారు. ఇంత దారుణంగా అవమానం చేస్తారా.. తామంటే అసలు విలువే లేదా అని నిలదీస్తున్నారు.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ..
ఈ ఆగ్రహం ఏదో విజయనగరం జిల్లాకు పరిమితం అనుకుంటే పొరపాటు.. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్న క్షత్రియులు మొత్తం ముక్తకంఠంతో ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ సైతం ఇదే డిమాండ్ను పదిసార్లు అయినా వినిపించి ఉంటుంది. ఇప్పుడు మరింత గట్టిగా వినిపిస్తోంది. దీంతో వెల్లంపల్లి పదవి గండంలో ఉన్నట్లే అనిపిస్తోంది. మరోవైపు బాస్కి లోకల్గా కూడా మంచి పేరు లేదు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి.. చిన్నా చితకా వ్యవహారాలన్నిటిలోనూ చీప్గా కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్న వ్యవహారాలు ఇప్పటికే వైసీపీ అధిష్టానం దృష్టికి వెళ్లాయి. ప్రతి దేవాలయంలోనూ పెత్తనం చేయాలని చూస్తూ.. ఉత్తరాంధ్రలో మాత్రం విజయసాయిరెడ్డికి భయపడి వెనక్కి తగ్గాడంతే. మిగతా అన్నిచోట్ల ఈయనదే పెత్తనం. ప్రతి చిన్నపోస్టుకు కూడా కమర్షియల్ కక్కుర్తి పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక ఇంత జరిగాక కూడా జగన్మోహన్రెడ్డి వెల్లంపల్లిని తన మంత్రివర్గంలో ఉంచుకుంటే.. నష్టం మామూలుగా ఉండదు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు.. కొడాలి నాని లాంటి ఘనులు ఇంకా ఉన్నా… ఇక్కడ వెల్లంపల్లి వ్యవహారం సెంటిమెంటు, దైవభక్తుల మనోభావాలతో ముడిపడి ఉంది. అందుకే ఈయన మీద వేటు మాత్రం తథ్యమనే చెప్పుకుంటున్నారు.