యుద్ధానికి కవ్విస్తున్న చైనాను గట్టి దెబ్బ కొట్టేందుకు భారత్ సిద్ధమవుతోంది. గుట్టుచప్పుడు కాకుండానే వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద క్షిపణులను మోహరించేస్తున్న డ్రాగన్ దేశం ఆట కట్టించేందుకు సూపర్సానిక్ క్రూయిజ్ మిస్సైల్ నిర్భయ్తోపాటు మరిన్ని క్షిపణులను సరిహద్దులకు పంపిస్తోంది. గడ్డ కట్టే చలి కాలంలోనైనా పోరుకు సై అని ఇప్పటికే ప్రకటించిన భారత్ అందుకు అనుగుణంగానే అత్యాధునిక యుద్ధ ట్యాంకులను వాస్తవాధీన రేఖ వద్దకు తీసుకెళ్లింది. మైనస్ 40 డిగ్రీల చలిలోనూ సమర్థవంతంగా పనిచేయగలిగే యుద్ధ సామగ్రిని సరిహద్దులకు పంపిన భారత్.. ఇప్పుడు అత్యాధునికి క్షిపణులను కూడా పంపిస్తోంది.
గుట్టుచప్పుడు కాకుండా చైనా..
వాస్తవాధీన రేఖ వెంబడి దాదాపు 13 చోట్ల సైనిక స్థావరాలను ఏర్పాటు చేసిన చైనా.. సుఖోయ్, జే 11 వంటి యుద్ధ విమానాలను మోహరిస్తోంది. భారత్ భూభాగంలోని సిక్కిమ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లను టార్గెట్ చేసి క్షిపణులను మోహరించింది. హోటన్, లాసా, నైయింగ్చీ ప్రాంతాల్లో అత్యాధునిక ఆయుధాలను సిద్ధంగా ఉంచింది. చైనా కదలికలను ఉపగ్రహాల ద్వారా గమనిస్తున్న భారత్.. యుద్ధానికి సన్నద్ధమవుతోంది.
గట్టి సంకేతాలు పంపిన భారత్..
డ్రాగన్ దేశం దొంగ దెబ్బ తీయకముందే భారత్ సైనిక, వైమానిక దళాలతో సిద్ధమైంది. ఇందుకోసం బ్రహ్మోస్, ఆకాశ్, నిర్భయ్ లాంటి క్షిపణులను సరిహద్దుల్లోని వ్యూహాత్మక స్థావరాలకు తరలించింది. అత్యాధునిక నిర్భయ్ క్షిపణితోపాటు బలమైన బ్రహ్మోస్, ఆకాశ్ మిస్సైళ్లను ఎల్ఏసీ వద్ద మోహరించింది. చైనా కుయుక్తలను ఎదుర్కొనేందుకు భారత్ కూడా సరిహద్దుల్లో క్షిపణులను మోహరిస్తున్న నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.
ఇదీ నిర్భయ్ ప్రత్యేకత..
సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భయ్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసింది. ఏడు సంవత్సరాలు పరీక్షించిన తరువాత ఎల్ఏసీ వద్ద మోహరించింది సైన్యం. ఇప్పటికి ఆరు సార్లు నిర్భయ్ని పరీక్షించగా నాలుగు సార్లు విజయవంతమైంది. పూర్తి స్థాయి క్లియరెన్స్ రాకపోయినా ఇటీవల నిర్వహించిన చివరి పరీక్షలో లక్ష్యాన్ని పర్ఫెక్ట్గా ఛేదించడంతో వాస్తవాధీన రేఖ వద్ద మోహరించారు. ఈ నిర్భయ్ క్షిపణి.. 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 100 మీటర్ల నుంచి 4 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఎగురగలదు. సహజంగా 100 మీటర్ల ఎత్తులో ఎగిరే క్షిపణులను ప్రత్యర్థి రాడార్లు గుర్తించలేవు. అతి తక్కువ శబ్దంతో ప్రయాణించడం ఈ మిస్సైల్ ప్లస్ పాయింట్. పూర్తిస్థాయి క్లియరెన్స్ వస్తే మరిన్ని నిర్భయ్లను సరిహద్దులకు పంపించనున్నట్టు తెలిసింది.
ఆకాశ్, బ్రహ్మోస్ క్షిపణులు కూడా..
నిర్భయ్తోపాటు ఆకాశ్, బ్రహ్మోస్ క్షిపణులను కూడా భారత్.. సరిహద్దుల్లోని స్థావరాల్లో మోహరించింది. రాడార్ సహాయంతో ఏకకాలంలో 12 లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్న ఆకాశ్.. యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను సమర్థంగా ఎదుర్కోగలదు. ఇక.. గగనతలం నుంచి గగనతలం, భూతలాల్లోని 500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలిగే బ్రహ్మోస్.. 300 కిలోల వార్ హెడ్ను సైత మోసుకుపోగలదు. మరోవైపు.. రూ.2,290 కోట్లు విలువ చేసే ఆయుధాలను అమెరికా నుంచి కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. మరో 5 రాఫెల్ విమానాలను వచ్చే నెలలో ఫ్రాన్స్ అప్పగించే అవకాశం ఉందని తెలిసింది.