హైదారాబాద్ ను అంతర్జాతీయ సినిమా సిటీగా మార్చేందుకు సీఎం కె. చంద్రశేఖరరావు కృత నిశ్చయంతో ఉన్నారు. ఈరోజు ప్రగతి భవన్ లో తనను కలిసిన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునలతో ఆయన చాలా సేపు చర్చించారు.
సినిమా సిటీ నిర్మాణానికి అవసరమైన రెండు వేల ఎకరాలను ప్రభుత్వం కేటాయించేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులకు తగిన ఆదేశాలను కూడా వెంటనే కేసీఆర్ ఇచ్చారు. దీని మీద సమగ్రంగా ఓ నివేదికను తయారు చేయాల్సిందిగా కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఇతర దేశాల్లో ఇలాంటి సిటీల నిర్మాణం ఎలా ఉందో కూడా అధ్యయనం చేయాలని కూడా సూచించారు. తెలుగు సినిమా రంగం ఆంధ్రపద్రేశ్ తరలిపోతుందా అన్న అనుమానాలు తలెత్తిన ఈ తరుణంలో కేసీఆర్ వరాల మూటను అందించారు. ఇంతేకాదు ఇంకెంతో చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చేశారు.
విరాళాల చెక్కులు అందజేత
హైదరాబాద్ వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులంతా ముందుకొచ్చి విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. అలా వసూలు చేసిన మొత్తాన్ని మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున బృందం ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలిసి ఆ విరాళా చెక్కులను అందజేశారు. అలాగే సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ప్రగతిభవన్లో కేసీఆర్ను కలిసిన చిరంజీవి, నాగార్జున చాలా సేపు ఆయనతో వివిధ విషయాలను చర్చించారు.
సినిమా హాళ్ల ను ప్రారంభించడానికి అవసరమైన అనుమతులు కావాలని కూడా కోరారు. ఈ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. హైదరాబాద్లో వరద సాయానికి గాను తాము ప్రకటించిన విరాళాలతో పాటు తమకు అందిన చెక్కులను కూడా కేసీఆర్ కు అందజేశారు. మై హోమ్ గ్రూప్స్ తరఫున రూ.5 కోట్ల చెక్కును డైరెక్టర్ రామ్, రూ. కోటి చెక్కును చిరంజీవి, రూ. 50 లక్షల చెక్కును నాగార్జున సీఎం కేసీఆర్కు అందజేశారు.
థియేటర్ల ప్రారంభానికి అనుమతి
సినిమా షూటింగులు, థియేటర్ల ప్రారంభానికి సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చేశారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జునల వినతికి ఆయన స్పందించారు. ఈ సందర్భంగానే తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధిపైనా చర్చ సాగింది. హైదరాబాద్ శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినీ సిటీ నిర్మాణానికి అనుమతి ఇస్తామని , దీని కోసం 1500 -2000 ఎకరాల భూమి కేటాయిస్తామని కూడా సీఎం ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారులు బల్గేరియా వెళ్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలని కూడా ఆయన సూచించారు. దీనికి ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నందున కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే షూటింగు, థియేటర్లు ప్రారంభించుకోవచ్చని కేసీఆర్ అన్నారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి బతికేవారిని కష్టాల నుంచి బయటపడేయాలని కూడా సీఎం ఆకాంక్షించారు.హైదరాబాద్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి – విస్తరణకు పుష్కలంగా అవకాశాలున్నాయని, షూటింగులతో సహా సినిమాల నిర్మాణానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం కూడా సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆలోచనతోనే ఉందన్నారు.
రెండు వేల ఎకరాల దాకా ప్రభుత్వం కేటాయిస్తుందని, అందులో అధునాతన టెక్నాలజీతో అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోల నిర్మాణానికి సినిమా నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాలన్నిటీని ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, శేషాద్రి పాల్గొన్నారు.










