గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, లోకల్బాడీ ఎలక్షన్లలో కాంగ్రెసుకు గట్టి ఎదురు దెబ్బనే తగిలింది. అదీ ఇదీ అని లేకుండా జరిగిన అన్ని ఎలక్షన్లలో పరాజయమే మూటగట్టుకుంది. అయినా కానీ ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు తమ వైఖరిని, పంథాను, రాజకీయ వ్యూహాలను మార్చుకోవడం లేదనే చెప్పుకోవాలి. జిహెచ్ఎంసి మున్సిపల్ ఎన్నికలకు ఇంకా దాదాపు మూడు నాలుగు నెలల సమయమే ఉంది. ఈ ఎన్నికలలో అవలంబించే రాజకీయ వ్యూహాలు, ప్రణాళికలు, క్యాడర్ను సన్నద్ధం చేసే పనిలో కాంగ్రెస్ వెనుకబడే ఉంది.
ఇప్పటి వరకు మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ ఆలస్యంగా నిద్రలేచి ఇప్పడు హడావుడి చేస్తోంది. డివిజన్ల కమిటీలలని, అనుబంధ కమిటీలను నియమించేందుకు సమావేశాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ అన్ని ప్రణాళికలు రచించుకొని ఎన్నికలకు వెళ్లేందుకు సంసిద్ధంగా ఉంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు సభలు, సమావేశాలను ఏర్పాటు చేసుకుంటుంది.
నగర డివిజన్ కమిటీలు, అనుబంధ కమిటీల నియామకం, జిహెచ్ఎంసి ఎన్నికలు, అలాగే దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల అంశాలపైన ఈనెల 11 న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దుబ్బాకలోని ఏడు మండలాల నాయకులు, గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, ఎంపిలు హాజరు కావాలని ఆదేశాలు జారీచేశారు. దీనికి ఎఐసిసి తెలంగాణ ఇంఛార్జ్ కుంతియా కూడా ముఖ్యఅతిధిగా హాజరవుతున్నట్లు తెలిసింది.
పాఠాలు నేర్వని కాంగ్రెస్….
కాంగ్రెస్ జాతీయ ఒక పార్టీ. దశాబ్దాలుగా దేశాన్ని పరిపాలించిన చరిత్ర దానికుంది. అలాంటిది టిఆర్ఎస్ పార్టీకు ఎదురు నిలబడలేకపోతోంది. రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు అధికారాన్ని పోగొట్టుకుంది. ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ డీలా పడిపోయింది. ఇక లోకల్ బాడీ ఎలక్షన్లలోనూ అంతే సంగతి. వంద సంవత్సరాలు చరిత్రగల పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ చేతిలో వరుసగా ఓటమిని చవిచూస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది. రాజకీయ కుమ్ములాటలు, గ్రూపుతగాదాలు, సొంత పార్టీ వారే ఒకరినొకరు విమర్శించుకోవడం లాంటి కారణాలు అనేకం ఉన్నాయి. అలాగే ప్రజా వ్యతిరేక విధానాలపై, ప్రజా సమస్యలపై పెద్దగా పోరాటం చేసిన దాఖలాలు కూడా అంతగా లేవు. ప్రజా ఉద్యమాలు చేయడంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. టిఆర్ఎస్ పార్టీ జరిగిన అన్నిఎన్నికల్లో విజయం సాధిస్తూ దూసుకుపోతుంటే కాంగ్రెస్ మాత్రం ఇంకా పాఠాలు నేర్వడలేదు.
గతంలో వైఎస్ రాజశేఖరెడ్డి లాగా పార్టీలో ఉన్న నాయకులందరినీ కలుపుకొనిపోయి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ధోరణి ప్రస్తుతం ఉన్న నాయకత్వానికి లేదనే విమర్శ ఉంది. ఎవరి సీటు వారు కాపాడుకునేలా కాంగ్రెస్ రాష్ట్ర కమిటీలోని నాయకులు వ్యవహరిస్తున్నారనే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకరినొకరు విమర్శించుకోవడం పక్కన పెట్టేసి పార్టీ బలపడే విధంగా రాష్ట్ర నాయకత్వం అందరినీ ముందుకు కలుపుకొని పోవాలని సొంత పార్టీ కార్యకర్తలు పేర్కొంటున్నారు.