సినిమా నటుల్లో కరోనా ప్రకంపనాలు పుట్టిస్తోంది. ఒక్కొరొక్కరుగా తారలు కరోనా బారిన పడుతున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, నటి మీనా, మంచు లక్ష్మి, వరలక్ష్మీ శరత్ కుమార్.. ఇలా వరుసగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. గతంలో కరోనా బారిన పడిన వారు కూడా మళ్లీ కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే షూటింగులు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. తనకు కరోనా వచ్చినట్టు మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
స్పల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని, వైరస్ ఉన్నట్టు తేలిందని వెల్లడించారు. ఈ మధ్య కాలంలో తనను ఎవరైతే కలిశారో అందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అందరూ టీకా వేయించుకోవాలని కూడా సూచించాను. హీరో నితిన్ భార్య షాలిని కూడా కరోనా బారిన పడ్డారు. అలాగే మంచు లక్ష్మి కూడా తనకు కరోనా సోకిందని వెల్లడించారు. ‘రెండేళ్లుగా వైరస్ బారిన పడకుండా తప్పించుకుంటున్నా.. చివరికి దొరికిపోయా’ అని పేర్కొన్నారు.
హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కరోనా బారిన పడినట్టు వెల్లడించారు. ఒకనాటి హీరోయిన్ మీనా కుటుంబాన్ని కరోనా వదలలేదు. ఆమె కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడ్డారు. లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. కారోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ ఏడాది తన ఇంట్లో అడుగుపెట్టిన తొలి అతిథి కరోనా అన్నారు. దాన్ని తన ఇంట్లో ఉండటానికి అనుమతించనని చెప్పారు. ఆమె కూడా ఇన్ స్టాలో ఈ విషయాన్ని వెల్లడించారు. హీరో నితిన్ భార్య షాలినికి ఆమె పుట్టిన రోజు నాడే కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు.
నితిన్ కూడా ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘కరోనాకు హద్దులు ఉండవచ్చేమో కానీ ప్రేమకు ఎలాంటి అడ్డంకులూ ఉండవు. లైఫ్ లో ఫస్ట్ టైమ్ నువ్వు నెగిటివ్ కావాలని కోరుకుంటున్నా’ అని కామెంట్ చేశాడు. ఆమె గదిలో ఉంటే కింద నుంచి కేకు కట్ చేసి ఆమెకు చూపిస్తూ పుట్టిన రోజు సెలబ్రేట్ చేశారు. ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక బాలీవుడ్ లోనూ కరోనా దూకుడును ప్రదర్శిస్తోంది. కరీనా కపూర్, అర్జున్ కపూర్, అన్షుల్ కపూర్, జాన్ అబ్రహాం, ఏక్తా కపూర్ లకు కరోనా సోకింది. తాజాగా స్వర భాస్కర్ అనే నటికి కూడా కరోనా వచ్చింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించింది.