ధనుంజయ రెడ్డి..ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్టయిన ఈ ఐఏఎస్ అధికారికి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్కు అన్నీ తానై వ్యవహరించారు. ఐదేళ్లూ డిఫాక్టో సీఎం ధనుంజయ రెడ్డే. సీఎం ఆఫీసులోనే కాదు..మొత్తం అధికార యంత్రాంగానికి ఆయన మాటే శాసనం. ఐదేళ్లూ వైసీపీ ప్రభుత్వం మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచింది. సాధారణంగా ఎవరికీ కేటాయించని శాఖలన్నీ సీఎం చూస్తుంటారు. కానీ సీఎం దగ్గరున్న శాఖలతో పాటు, అన్ని శాఖలపై ధనుంజయరెడ్డి పెత్తనం కొనసాగింది. జూనియర్ ఐఏఎస్ అధికారి నుంచి CS వరకు, ఎస్పీ నుంచి డీజీపీ వరకు..చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఆయనకు సలాం కొట్టాల్సిందే. గడిచిన ఐదేళ్లూ జగన్కు అంతరాత్మలా వ్యవహరిస్తూ, కనీవినీ ఎరుగని రీతిలో అధికారం వెలగబెట్టారు.
బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ మంత్రులకు కూడా..ఏ విషయమైనా ‘ధనుంజయ్ అన్న’ను కలిసి, మాట్లాడండని జగన్ చెప్పేవారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ విధాన నిర్ణయాలైనా, కార్యక్రమాలైనా, చివరకు అధికారుల బదిలీలైనా ధనుంజయ్ రెడ్డికి చెప్పి చేయాల్సిందే. అన్ని వ్యవస్థల్నీ గుప్పిట్లో పెట్టుకున్న ధనుంజయరెడ్డి CMO కేంద్రంగా భారీ ఎత్తున అక్రమాలకు, అవినీతికి, అరాచకాలకు పాల్పడ్డారని, వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక కుంభకోణాలకు ఆయనే కింగ్పిన్గా వ్యవహరించారని, రూ.వందల కోట్లు మూటగట్టుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
2019లో ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే ధనుంజయరెడ్డి జగన్ పక్కన ప్రత్యక్షమయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందే జగన్ ఆయనను తన అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. ఆ తర్వాత కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఐదేళ్లూ జగనే సీఎం అయినా…ఆయన తరఫున అన్ని వ్యవహారాలూ ధనుంజయరెడ్డే చక్కబెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు అప్పటి సీఎం జగన్ అరుదుగా అందుబాటులో ఉండేవారు కాబట్టి వారంతా ధనుంజయరెడ్డినే ఆశ్రయించేవారు. ఆయనకు చెబితే జగన్కు చెప్పినట్టేనని భావించేవారు. అప్పట్లో సీఎంవోలో చక్రం తిప్పిన ప్రవీణ్ ప్రకాష్, ముత్యాలరాజు వంటి అధికారులు కూడా ఏ పనైనా ధనుంజయరెడ్డికి చెప్పి చేయాల్సిందే. ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల హోదాలో ఉన్న IAS అధికారులు కూడా ఆయన పిలిచే వరకు ఎదురుచూడాల్సిందే. మంచి పోస్టింగ్లు, ఇతర పనుల కోసం ధనుంజయరెడ్డిని కలిసేందుకు ఆరు నెలలపాటు తిరిగిన అధికారులూ ఉన్నారు.
వైఎస్ అండతో IAS
వైఎస్ కుటుంబానికి ధనుంజయరెడ్డి నమ్మినబంటు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లెకు చెందిన ఆయన 1988లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో ఆ పంచాయతీకి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచిగా పనిచేస్తూనే డానిక్స్ (ఢిల్లీ, అండమాన్, నికోబార్, లక్షద్వీప్, దమన్ దీవ్, దాద్రానగర్ హవేలి) సర్వీసుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఉన్నా వైఎస్తో సంబంధాలు కొనసాగించారు. ఆయన ఆర్థిక లావాదేవీల్ని కూడా ధనుంజయరెడ్డి చక్కబెట్టేవారని చెబుతారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చి, దాదాపు ఎనిమిదేళ్లపాటు జీహెచ్ఎంసీలో డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. తర్వాత ఆయనను రాష్ట్ర సర్వీసులో విలీనం చేసుకున్నారు.
ఎనిమిదేళ్లు డిప్యూటీ డైరెక్టర్ హోదా పోస్టులో పనిచేస్తే ఐఏఎస్కు ఎంపిక చేయవచ్చన్న క్లాజ్తో ఆయన పదోన్నతి పొందారు. ధనుంజయరెడ్డి డానిక్స్లో ఉంటే ఎప్పటికీ ఐఏఎస్ కాలేకపోయేవారు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం ఆయనకు గోదావరి పుష్కరాలకు ప్రత్యేకాధికారి, వ్యవసాయశాఖ కమిషనర్, విపత్తుల నిర్వహణశాఖ డైరెక్టర్, ఎన్టీఆర్ వైద్యసేవ సీఈఓ, శ్రీకాకుళం కలెక్టర్, ఏపీటీడీసీ ఎండీ వంటి కీలక పదవులు కట్టబెట్టింది. ధనుంజయరెడ్డి తెదేపా హయాంలో కీలక పోస్టుల్లో కొనసాగుతూనే, తెర వెనుక వైసీపీ కోసం పనిచేసేవారన్న విమర్శలున్నాయి.
వైసీపీ హయాంలో ఫిఫో నిబంధనను తుంగలో తొక్కి, అప్పటి ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన గుత్తేదారులకు ఇష్టానుసారం బిల్లులు చెల్లించడంలో ధనుంజయరెడ్డిదే కీలకపాత్ర అన్న ఆరోపణలున్నాయి.
ప్రభుత్వం రోజువారీ చెల్లించే బిల్లుల్లో ఎవరికి ఎంత చెల్లించాలో ఆర్థికశాఖ అధికారులకు ఆయనే వాట్సప్లో మెసేజ్ పంపేవారని సమాచారం. అధికారుల పోస్టింగుల్లోనూ ధనుంజయరెడ్డి హవానే నడిచేదని, ప్రాధాన్య స్థానాల్లో పోస్టింగ్ కోసం అధికారులు ఆయన చుట్టూ తిరిగేవారని చెబుతారు.ధనుంజయరెడ్డి అక్రమ వ్యవహారాలన్నీ తనకు ఓఎస్డీగా పనిచేసిన ఓ అధికారి ద్వారా చక్కబెట్టేవారని సమాచారం. ఆయన సేవలకు నజరానాగా అడ్డదారిలో ఐఏఎస్గా కూడా ప్రమోట్ చేయించారని ఆరోపణలున్నాయి.
జగన్ రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం, అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించడంలో ధనుంజయరెడ్డిదే కీరోల్. పట్టాభిరామ్ వంటి టీడీపీ నాయకుల్ని అరెస్ట్ చేసి, వివిధ స్టేషన్లకు తిప్పడం, కస్టడీలో చిత్రహింసలు పెట్టడం వంటి వ్యవహారాల్ని ఆయన సీఎంవో నుంచి స్వయంగా పర్యవేక్షించేవారని సమాచారం. గంట గంటకూ పోలీసులకు ఫోన్ చేసి ఏం జరుగుతోందని ఆరా తీసి, ఆదేశాలు జారీ చేసేవారని చెబుతారు. అప్పట్లో నిఘా విభాగాధిపతిగా ఉన్న PSR ఆంజనేయులుతో కలసి రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించేవారని ఆరోపణలున్నాయి. హక్కుల కోసం పోరాడిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులపై అణచివేత చర్యలూ ధనుంజయరెడ్డి మార్గదర్శకత్వంలోనే జరిగాయన్న ఆరోపణలున్నాయి.
MLA అభ్యర్థుల ఎంపికలోనూ ఆయనే!
2019-24 మధ్య జగన్ తరఫున రాజకీయ వ్యవహారాలూ ధనుంజయరెడ్డే చక్కబెట్టేవారు. ఎమ్మెల్యేల పనితీరునూ ఆయనే సమీక్షించేవారు. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఎంత పెద్ద నాయకులైనా జగన్ను కలవాలంటే ముందు ధనుంజయరెడ్డి దగ్గరకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సిందే. పార్టీ నేతల మధ్య పంచాయితీలూ ఆయనే చేసేవారు. ఈ వ్యవహారంపై అప్పట్లో వైసీపీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. 2024 ఎన్నికల సమయంలో జగన్ బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా నేరుగా జగన్ను కలిసే అవకాశం దక్కకపోతే, ధనుంజయరెడ్డిని కలిసి మాట్లాడి వెళ్లిపోయారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపికలోనూ ధనుంజయరెడ్డే కీలకంగా వ్యవహరించారు. సర్వేలు చేయించడం నుంచి అభ్యర్థుల వడపోత వరకు ఆయనే పర్యవేక్షించారు.











