నిజ ఆశ్వీజ మాసం ప్రారంభమైంది. నవరాత్రి సంరంభం కూడా ఆరంభమైంది. ఈ నెల 17 వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. పదో రోజున ఆయుధ పూజతో ముగియడం సర్వసాధారణంగా జరుగుతుంది.
ఈ తొమ్మిది రోజులూ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజిస్తారు. రకరకాల నైవేద్యాలు సమర్పించి భక్తులు అమ్మవారి అనుగ్రహం పొందుతారు. అశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మవారిని తొమ్మిది రూపాలలో అలంకరించి కొలుస్తారు. ఈ నవరాత్రి వైశిష్ట్యానికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలంటే మన పురాణాలలోకి వెళ్లాల్సిందే. మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి అమ్మవారు అశ్వీయుజ శుక్ల పాడ్యమి నుంచి ఒక్కో రూపంలో యుద్ధం చేసినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి. దేవీ భాగవతంలో కూడా అమ్మవారి వైశిష్ట్యం ఉంది.
బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులైన త్రిమూర్తులను కన్న తల్లిగా ఆమెకు స్థానం కల్పించారు. వైదిక సంప్రదాయం ప్రకారం అమ్మవారిని త్రిమూర్తుల శక్తిగా చెబుతారు. మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతీలుగా అమ్మవారు కొలువై ఉంటారు. మహాకాళిని శత్రు నిర్మూలనకు, మహాలక్ష్మీని సకల సంపదలకు, సరస్వతిని విద్య, విజ్ణానానికి అధిష్టాన దేవతలుగా భావించి ఆరాధిస్తారు. అలాగే సప్తశతీ, లలితా త్రిశతి, సహస్ర నామాల్లోనూ అమ్మవారు కనిపిస్తారు.
పురాణ కథలోకి వెళితే..
ఇది మనందరికీ తెలిసిన కథే. పూర్వం మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. అతను ప్రజలనే కాక దేవుళ్లను కూడా ఇబ్బందులకు గురిచేసేవాడు. అతను తనకున్న శక్తులతో దేవతలకు వ్యతిరేకంగా యుద్ధం చేశాడట. అందుకే అతన్ని సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది రకాల అవతారమెత్తారని చెబుతుంటారు. అతడిని సంహరించేందుకు దుర్గాదేవి తన వాహనమైన సింహంపై బయలుదేరింది. భయంకరంగా సాగిన యుద్ధంలో ఆమె మహిషాసురుడిని హతమార్చింది.
దీన్ని చెడుపై మంచి సాధించిన విజయంగా చెబుతారు. పశ్చిమ బెంగాల్లో ఈ నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. నవరాత్రుల సమయంలో దేశంలోనే అత్యంత ప్రముఖంగా జరిగే ప్రదేశంలో కోల్ కత్తా ముందు వరుసలో ఉంటుంది. ఈ సమయంలో అక్కడ అమ్మవారి రూపాలను అత్యంత తొమ్మిదిరోజుల పాటు భక్తులు ఉపవాసం ఉంటారు. మాంసాహారం జోలికి వెళ్లరు. కూరగాయలు, పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటారు.
అమ్మవారి అవతారాలివి..
ఈ తొమ్మిది రోజులూ తొమ్మిది అవతారాలలో అమ్మవారిని అలంకరిస్తారు. తొలి రోజున శైల పుత్రిగా ఆరాధిస్తారు. అలంకరణ కూడా అలాగే చేస్తారు. రెండో రోజు బ్రహ్మచారిణి (త్రిపుర సుందరి), మూడో రోజు గాయత్రీదేవి (చంద్రఘంట), నాలుగో రోజు అన్నపూర్ణ దేవి, ఐదోరోజు లలితా దేవిగా, ఆరో రోజు మహాలక్ష్మీ,ఏడో రోజు సరస్వతి, ఎనిమిదో రోజు దుర్గా దేవి, తొమ్మిదో రోజు మహిషాసుర మర్దిని, పదో రోజు మహా రాజరాజేశ్వరీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. అమ్మవారి అలంకరణలు కూడా అలానే ఉంటాయి. మనిషికి విజయం దక్కాలంటే ఆ ఆదిపరాశక్తిని ఆరాధించడం తప్పనిసరి.
త్రిపురారహస్యంలోని మహాత్మ్యఖండం శక్తి ఉపాసన వైశిష్ట్యం ఎలాంటిదో వివరించింది. త్రిపురకు వర్తించే సర్వమంగళ నామం ‘సప్తశతీ, ‘లలితాత్రిశతి ‘, లలితా సహస్రనామం లాంటి గ్రంథాలలోనూ కనిపిస్తుంది. తల్లిని దేవతగా గుర్తించి పూజించడమే ఈ శక్తి ఆరాధాన. నీవే సరస్వతివి, నీవే మహాలక్ష్మివి, నీవే శాకంబరివి, నీవే పార్వతివి అని త్రిశక్తుల ఏకీకరణ కోసం శ్రీ శంకరాచార్యులు అమ్మవారిని కనకధారా స్తోత్రంలో కీర్తించారు. వైదిక సంప్రదాయంలో దేవిని త్రిమూర్తుల శక్తులుగా వర్ణించారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా అమ్మవారు కొలువుదీరి ఉంటుంది. మహాకాళిని శత్రునిర్మూలనానికు, ఐశ్వర్య-సౌభాగ్య సంపదలకు మహాలక్ష్మి, విద్య విజ్ఞానానికి మహా సరస్వతి అధిష్ఠాన దేవతలుగా పేర్కొన్నారు.