Dilip Kumar’s Mughal E-Azam Movie :
భారీ విజయాలన్నీ ప్రేమ కథలకే దక్కాయి. సలీమ్, అనార్కలి ప్రేమను అజరామరంగా మలిచిన ‘మొఘల్-ఏ- ఆజమ్’ సినిమాను ఎవరూ మరచిపోలేరు. ఈ సినిమా నిర్మించి 60 ఏళ్లు పూర్తయింది. యూకేలో నిర్వహించిన ఓ సర్వేలో ఈ సినిమా ఆల్ టైమ్ గ్రేటెస్ట్ గానూ నిలిచింది. దిలీప్ కుమార్, మధుబాల ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ డిసెంబరు 11వ తేదీ ఆ మహానటుడి పుట్టిన రోజు. 1960లో కె. ఆసిఫ్ ఈ సినిమాని రూపొందించారు. ఇప్పటికీ ఈ సినిమాకి అంతటి ఆదరణ ఉంది.
మొఘల్ సామ్రాజ్యానికి చెందిన యువరాజు సలీం, నర్తకి అనార్కలి మధ్య అంకురించిన ప్రేమ పర్యవసానాలు ఏమిటన్నదే ఈ చిత్ర కథాంశం. నలుపు తెలుపులో రూపొందిన ఈ సినిమాకి రంగుల హంగులు కూడా తోడయ్యాయి. అప్పట్లో భారీ కలెక్షన్లు సాధించిన ఏకైక హిందీ చిత్రం ఇదే. ఆ తర్వాత ‘షోలే’, ‘దిల్ వాలే దుల్హనియా లేజాయెంగే’, ‘కుచ్ కుచ్ హోతాహై’ లాంటి మరికొన్ని చిత్రాలు కూడా చేరాయి.
ఎక్కడిదీ మొఘలుల ప్రణయగాథ?
ఈ కథకు ఓ నాటకం ప్రేరణ. 1922లో ఇంతియాజ్ అలీ తాజ్ ‘అనార్కలి’ పేరుతో ఈ నాటకాన్ని రాశారు. ఈ నాటకమే కాలక్రమేణా సినిమాలగానూ తెరకెక్కింది. మూకీలు, టాకీలు వచ్చాక కూడా అనేక రూపాల్లో సినిమాగా మారింది. దీన్ని సినిమాగా రూపొందించాలన్న ఆలోచన మరాఠీ నిర్మాత, సినీ లేబరేటరీ యజమాని సేర్ సిరాజ్ అలీ హకీమ్ కు వచ్చింది. కె.అసిఫ్ దర్శకుడిగా ఎంచుకుని 1944లో ఆ ప్రయత్నం చేశారు. అక్బర్ గా హిందీ నటుడు చంద్రమోహన్ ను ఎన్నుకున్నారు. సలీంగా సప్రూ, అనార్కలిగా నర్గీస్ ప్రధాన పాత్రధారులుగా 1946లో ‘మొఘల్-ఏ-అజమ్’ ప్రారంభమైంది. ఈలోగా దేశవిభజన జరిగింది.
దాంతో సేర్ సిరాజ్ దర్శకుడు ఆసిఫ్ ను మరో వ్యాపారవేత్త షాపూర్ణి పెస్తోంజీకి పరిచయం చేసి లాహోర్ కు వెళ్లిపోయారు. ఈ సినిమాని ఏ ముహూర్తాన ప్రారంభించారోగానీ అనేక ఆటాంకాలు ఏర్పడ్డాయి. ఆక్బర్ పాత్రధారి చంద్రమోహన్ 1952లో అకస్మాత్తుగా చనిపోయారు. సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆసిఫ్ తనే నిర్మాతగా మారి 1951లో దిలీప్ కుమార్, నర్గిస్ లతో ‘హల్ చల్’ నిర్మించారు. దీనికి ఎస్ కె ఓఝూ దర్శకత్వం వహించారు. చంద్రమోహన్ మరణించాక ‘మొఘల్ ఏ ఆజమ్’ ప్రాజెక్టు తాత్కాలికంగా వాయిదా పడింది. ఆ స్థానంలోకి పృథ్వీరాజ్ కపూర్ ను తీసుకుని మళ్లీ ప్రారంభించారు. సలీం పాత్రకు దిలీప్ కుమార్ ను, అనార్కలి పాత్రకు మధుబాలను తీసుకున్నారు.

మధుబాల ఎంపిక ఎలా జరిగింది?
హీరోయిన్ కోసం ఆసిఫ్ పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. గాన్ విత్ ది విండ్ తరహా ప్రయత్నాలివి. ఈ ప్రయత్నాలు ఇలా జరుగుతుండగా మరో ‘అనార్కలి’ సినిమా విడుదలైంది. ఇందులో ప్రదీప్ కుమార్, బీనారాయ్ జంటగా నటించారు. ఓ మంచి కథ ఉందంటే దాన్ని తస్కరించి వెంటనే సినిమాలు తీసే దొంగ సంస్కృతి అప్పట్లో కూడా ఉంది. ఆసిఫ్ వద్ద స్క్రిప్టుకు సహకారం అందిస్తున్న కమల్ ఆమ్రోహి లో కొత్త ఆలోచన వచ్చింది. కమల్ కపూర్, మధుబాలతో ‘అనార్కలి’ సినిమా ప్రకటించారు. అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. మొత్తానికి మధుబాలకు మాత్రం మొఘల్ ఏ ఆజమ్ లో హీరోయిన్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ విషయం ఇలా ఉంటే 1953లోనే మరో అనార్కలికి తెరలేచింది. ఇందులో అజిత్, మీనాకుమారి హీరోహీరోయిన్లు. ఇది కూడా కమల్ ఆమ్రోహి ఘనకార్యమే. ఆసిఫ్ ఊరుకోలేదు. గట్టిగా పట్టుబట్టడంతో ఆ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది.
ఎనిమిదేళ్ల పాటు నిర్మాణం
మొఘల్ ఏ ఆజమ్ సినిమా నిర్మాణానికి ఎనిమిదేళ్లు పట్టిందంటే ఎవరైనా నమ్మగలరా? ఎన్నో అవాంతరాల నడుమ ఎనిమిదేళ్లకు గానీ ఆ సినిమా విడుదల కాలేదు. ఆగస్టు 5వ తేదీ 1960లో విడుదలైంది. ముంబయిలోని మరాఠా మందిర్ ని ఆగ్రా కోట మాదిరిగా ముస్తాబు చేసి మరీ ఈ సినిమాని అందులో విడుదల చేశారు. ఈ సినిమా ప్రివ్యూ ఇందులోనే వేశారు. అయితే హీరోహీరోయిన్లు దిలీప్ కుమార్, మధుబాల హాజరుకాలేదట. దానికి ఆసిఫ్ తో ఉన్న వ్యక్తిగత విభేదాలు కారణమయ్యాయి.
రాజ్ కపూర్, షమ్మీ కపూర్ లు మాత్రం ప్రివ్యూకు వచ్చారు. ఆసిఫ్ తో దిలీప్ వివాదానికి కారణం ఆయన చెల్లెల్ని ఆసిఫ్ దొంగతనంగా పెళ్లి చేసుకోవడమే. ఆ సినిమా ఘన విజయం సాధించినా దిలీప్ కుమార్ కూ, ఆసిఫ్ కూ కొన్నేళ్లుగా మాటలు లేవు. మధుబాల రాకపోవడానికి కూడా ఆమెకు సంబంధించిన వ్యక్తిగత అంశమే కారణం. ఇంతకీ ప్రివ్యూలో వచ్చిన టాక్ ఏమిటో తెలుసా? సినిమా ఫ్లాప్. దీని నిర్మాణానికి దాదాపు కోటి 25 లక్షల ఖర్చయింది. ఆ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరుగా భావించారు. అలా అందరూ అనుకున్న దానికి భిన్నంగా ఫలితం వచ్చింది. అదే మరాఠా మందిర్ లో మూడేళ్లు ఆడింది.
మన తెలుగులో పరిస్థితి ఏమిటి?
ఈ సినిమాలో మన తెలుగుదనం కూడా ఉంది. ఇందులోని దుర్జన్ సింగ్ పాత్రను పోషించిన అజిత్ హైదరాబాద్ నివాసే. అలాగే జహార్ పాత్ర పోషించిన నిగర్ సుల్తానా కూడా తెలుగువాడే. ఈ సినిమాలో రుమ్రీలు ఆలపించిన గులాం అలీఖాన్ సాబ్ లు కూడా హైదరాబాద్ వారే. ఇక్కడి ప్యారడైజ్, ప్యాలెస్ లలతో ఈ సినిమా విడుదలైంది. మరో విశేషమేమిటంటే ఇందులో వినియోగించిన ఆభరణాలను తయారు చేసిన వారు కూడా మన హైదరాబాదీలే. సినిమా నిడివి కూడా చాలా ఎక్కువ. లతామంగేష్కర్ పాడిన రెండు పాటల్ని సినిమా విడుదలైన కొంతకాలం తర్వాత సినిమాలో చేర్చారు. ఇలాంటి విశేషాలు ఎన్నో ఈ సినిమా గురించి చెప్పుకోవచ్చు.
మనకు తెలియని విషయాలెన్నో..
ఈ సినిమాపై ఓ ఐఆర్ఎస్ మాజీ అధికారి రవి పాడి పరిశోధన చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఓ పాటకు వేణుగాన విద్వాంసుడు పన్నాలాల్ ఘోష్ వేణుగానాన్ని అందించారు. ఓ ఔట్ డోర్ షూటింగుకు రానని హీరోయిన్ మధుబాల మొండికేసిందట. దాంతో ఆమె స్థానంలోకి వైజయంతీమాలను తీసుకుని షూటింగు చేశారట. చివరికి ఈ విషయం కోర్టు దాకా వెళ్లింది. మధుబాలకు వ్యతిరేకంగా దిలీప్ కుమార్ సాక్ష్యం చెప్పడంతో వారి ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టిందని కూడా చెబుతుంటారు. అయినా సరే ఈ పాత్రల్లోని రొమాన్స్ ను బాగా పండించారు.
ఇంకా దిలీప్ కుమార్ గురించి చెప్పాలంటే తన సొంత సినిమా గంగాజమునతోపాటు దేవాదాస్ కు కూడా కాల్షీట్లు ఇచ్చేశారు. ఇలా వేర్వేరు పాత్రల స్వభావాలను ఒకే సమయంలో చేస్తూ పండించడం గొప్ప విషయం. ఇక దర్శకుడు ఆసిఫ్.. ఓ టైలర్ గా తన జీవితాన్ని ప్రారంభించారు. దర్శకుడిగా, నిర్మాతగా 16 ఏళ్ల పాటు తను కన్న కలల కోసం అహర్నిశలు శ్రమించారు. ఈ సినిమాలో శీష్ మహల్ సెట్ కు చాలా ప్రత్యేకత ఉంది. అప్పటి ప్రధాని నెహ్రూ కోరిక మేరకు డాక్యుమెంటరీల చిత్రీకరణకు ఇటలీ నుంచి వచ్చిన రాబెర్టో రొజిలిని ఈ సెట్ కు రూపకల్పన చేశారు. ముంబయిలోని మోహన్ స్టూడియోలో ఈ సెట్ వేశారు.
మరో విశేషమేమిటంటే ఈ సెట్ ను విడగొట్టి తన సోదరి పెళ్లిని అందులో జరిపించారు హాస్యనటుడు మహమూద్. ఇంతటి ప్రత్యేకతలున్న ఈ సినిమాలో నటించే అవకాశం రావడం దిలీప్ కుమార్ అదృష్టం. ఆయనకు ఇప్పుడు 98 ఏళ్లు. ఈ సినిమా 60 ఏళ్ల ఉత్సవాన్ని పూర్తిచేసుకుంది. ఈ డిసెంబరు 11వ తేదీ ఆ మహానటుడి పుట్టిన రోజు సందర్భంగా ‘మొఘల్ ఏ ఆజమ్’ సినిమా గురించి, ఈ సినిమా ప్రత్యేకత గురించి తెలుసుకోవడం కంటే మనకు ఏం కావాలి. నటన అనే కీర్తి కిరీటంలో మకుటాయమానం వెలిగిపోయే సినిమా ఇది.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- దేవదాసు.. ఇది క్లాసిక్ మాత్రమే కాదు, ఓ చరిత్ర











