Is The Era of Movie Theaters Coming To An End? :
ఎంత ఓటీటీ వచ్చినా థియేటర్లకు ఏమీ కాదు.. థియేటర్లో సినిమా చూసిన అనుభూతిని ఓటీటీ భర్తీ చేయలేదు.. కరోనా పోయాక థియేటర్లు తెరవక తప్పదు- ఇలాంటి మాటలన్నీ నిన్నటి దాకా విన్నవే. కరోనా మొదటి వేవ్, కరోనా రెండో వేవ్ ముగిశాయి. ఇక మూడో వేవ్ రావడమే తరువాయి.
థియేటర్ల వ్యవస్థను ఓటీటీ కన్నా కరోనానే బాగా దెబ్బ తీసిందన్నది మాత్రం వాస్తవం. జనం ఓటీటీ వైపు చూడటానికి కారణం కూడా కరోనానే. సినిమాలను విడుదల చేసుకోవడానికి ఇప్పుడు ఓటీటీ తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఒకవేళ థియేటర్లు ప్రారంభమైనా మునుపటిలా జనం థియేటర్లకు వస్తారా అన్నది కూడా అనుమానమే. అసలు థియేటర్లు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి అన్నది మరో ప్రశ్న. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కాలమే చెప్పాలి. ఎవరి చేతిలోనూ దీనికి జవాబు లేదు.
థియేటర్లో కాకుండా సినిమాలను ఓటీటీలో విడుదల చేయడానికి పెద్ద హీరోల అభిమానులు ఎవరూ ఒప్పుకోవడం లేదు. ఇది అభిమానుల మాట అనడం కన్నా ఆ హీరోల మాట అనడమే సబబు. ఇటీవల వెంకటేష్ సినిమా ‘నారప్ప’ను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వార్తలు రావడంతో వెంకీ అభిమానుల నుంచి నిరసనలు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా థియేటర్ల వ్యవస్థకు ముప్పు వాటిల్లుతోంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లకు అనుమతి ఇచ్చి మరో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా సినిమాల విడుదల సాధ్యం కాదు. కరోనా నిబంధనలు పాటిస్తూనే థియేటర్లు ప్రారంభించాల్సి ఉంటుంది.
ఈ నెల 8వ తేదీ నుంచి థియేటర్లు ప్రారంభమవుతున్నాయని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అయితే సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు ఇంకా సిద్ధంగా లేరని తెలుస్తోంది. బహుశా ఈ నెలాఖరు నుంచి పెద్ద సినిమాల విడుదల ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జులై 30 నుంచి పెద్ద సినిమాల విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఎంతకాలం కొనసాగుతుందన్నది మాత్రం ప్రశ్నార్థకమే.
థియేటర్ల శకం ముగిసినట్టేనా?
థియేటర్ల మనుగడ అనేది ఎంతో కాలం కొనసాగే అవకాశం కనిపించడం లేదు. సినిమా చూడటానికి అయ్యే ఖర్చు పెరిగిపోవడం, దూరాభారం, కరోనా లాంటి కారణాలు కనిపిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే కొత్త సినిమా మన ముందుకు వస్తున్నప్పుడు థియేటర్లకు వెళ్లి చూడాల్సిన అవసరమేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పైగా జనం కూడా ప్రత్యామ్నాయ వినోదం వైపు తమ దృష్టిని మళ్లించుకోడానికి అలవాటు పడ్డారు. కరోనా మూడో వేవ్ వార్తలతో దేశవ్యాప్తంగానూ థియేటర్లు మూతపడక తప్పడం లేదు.
దాంతో కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసుకోడానికి వీలుగా తామే ఓటీటీ లాంటి ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ విషయంలో కేరళ ప్రభుత్వం త్వరగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతోంది. దీంతో థియేటర్ వ్యవస్థ మూతపడే కొత్త శకం ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తున్న భావన కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్ నిర్వహణ పెనుభారంగా మారింది. వాటిని కమర్షియల్ కాంప్లెక్సులుగా మారిస్తే లాభమన్న ఆలోచన ఎగ్జిబిటర్లకు వస్తోంది.
చాలామంది తమ థియేటర్లను అమ్మివేస్తున్నారు కూడా. కొంత మంది తక్కువ ధరకే థియేటర్లను అమ్మేస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. ఈ గండం నుంచి మల్టీప్లెక్సులకు అంత ఇబ్బందికరంగా ఏమీ లేదు. నిర్మాతలకూ, థియేటర్ల యజమానులకూ మధ్య గ్యాప్ పెరిగింది. థియేటర్ వ్యవస్థ మనుగడ సాగించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. పన్ను రాయితీలు ఇవ్వాలి.
నిర్మాతలకూ, ఎగ్జిబిటర్లకూ మధ్య ఉన్న గ్యాప్ ను భర్తీ చేసే ప్రయత్నం జరగాలి. ఓటీటీ, డిజిటల్ రైట్స్ నియమ నిబంధనావళిలోనూ మార్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇలాంటి సంస్కరణలు వస్తే తప్ప థియేటర్ వ్యవస్థ బతికి బట్టకట్టడం కష్టం. లేకుండా భవిష్యత్తు అంతా ఓటీటీ మయమే. థియేటర్లు కళ్యాణమండపాలగానూ, షాపింగ్ కాంప్లెక్స్ లగానూ మారిపోక తప్పదు.
– హేమసుందర్
Must Read ;- ఓటీటీ లో దళారులు.. తప్పని పైరవీలు











