ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి చదరంగం ఆటంటే ఎంతో ఇష్టం. కానీ ఆ ఆట వ్యూహాన్ని పరిపాలనపరంగా విధాన నిర్ణయాలకు ఆపాదించకపోవడంతో ఎదురుదెబ్బలు తింటున్నారు. విధానపర నిర్ణయాల్లో పావులు కదిపేముందు పది ఎత్తుల తరువాత జరగబోయే పరిణామాలను ఊహించాలి. లేకపోతే సీఎంగా తీసుకున్న ఆ నిర్ణయాలు అమలు కాకపోతే అభాసుపాలు అవుతారు. రాజకీయంగా కూడా పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. శాసనసమండలి రద్దు విషయంలో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం అదే విధంగా బూమ్రాంగ్ అవుతోంది.
![]()
‘మండలి’ రద్దు బిల్లును అటకెక్కించిన కేంద్రం
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులను శాసనమండలిలో మెజార్టీ ఉన్న టీడీపీ అడ్డుకోవడంతో సీఎం వైఎస్ జగన్ అహం దెబ్బతింది. దాంతో ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించేశారు. కానీ శాసనమండలి రద్దు బిల్లును ఆమోదించే ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని తెలుసుకున్నారా…? ఇలాంటి బిల్లులే కొన్ని కేంద్రం వద్ద పెండింగులో ఉన్న విషయాన్ని గుర్తించారా …? అంటే సమాధానం లేదు. శాసనసభ ఆమోదించిన తరువాత ఆ బిల్లుకు పార్లమెంటు కూడా సమ్మతి తెలపాలన్నది నిబంధనే. కానీ నిబంధనలను రాజకీయాలు ప్రభావితం చేస్తాయని జగన్కు తెలియనిది కాదు కదా. ఊహించినట్టే ఏపీ శాసనమండలి రద్దు బిల్లులను ప్రధాని మోదీ కోల్డ్ స్టోరేజీలో పెట్టారు. ఏపీలో ఉన్న బలమైన పార్టీ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టడం ద్వారా దీర్ఘకాలంలో కాస్తో కూస్తో రాజకీయ ప్రయోజనం పొందాలన్నది బీజేపీ వ్యూహం. దాంతో రాజకీయంగా సీఎం జగన్ ఇమేజ్ కొంత దెబ్బతినడమే కాదు పార్టీకి కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వలేకపోవడంతో ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని జగన్ హామీ ఇచ్చిన దాదాపు 50మంది వరకు నేతలు నిరాశ చెందారు.
రాజ్యసభ ఆశావహుల్లో నిరాశ
ఇటీవల ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ సీట్లలో రెండు స్థానాలు పిల్లి సుభాశ్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు ఇవ్వాల్సి వచ్చింది. మండలి రద్దు అవుతుంది కాబట్టి ఎమ్మెల్సీలుగా ఉంటూ మంత్రులుగా వారిద్దరినీ రాజ్యసభకు పంపారు. ‘రిలయన్స్’ ముఖేశ్ అంబానీ కోరడంతో ఆయన సన్నిహితుడు పరిమళ్ నత్వానీకి ఒక ఎంపీ సీటు ఇవ్వాల్సి వచ్చింది. మిగిలిన ఒక్క సీటును పార్టీకి నిధులు సమకూర్చిన అయోథ్య రామిరెడ్డికి కేటాయించారు. దాంతో రాజ్యసభ సీట్లపై ఆశలు పెట్టుకున్న పార్టీ సీనియర్లకు మొండిచెయ్యే మిగిలింది. వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి సొంత మనుషులు మౌనంగా ఉండిపోయారు. కానీ పెనుమత్స సాంబశివరాజు (విజయనగరం జిల్లా), దాడి వీరభద్రరావు (విశాఖ జిల్లా), పండుల రవీంద్రబాబు (తూర్పుగోదావరి), దాసరి జై రమేశ్ (కృష్ణా జిల్లా) వంటి నేతలతోపాటు పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చిన తెరవెనుక బడా బాబులు చాలా మంది తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
ఎమ్మెల్సీ ఆశావహుల్లో మరింత అసంతృప్తి
ఉంటుందో ఊడుతుందో తెలియని శాసనమండలి కూడా వైఎస్సార్సీపీలో అసంతృప్తికి ఆజ్యం పోస్తోంది. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీల స్థానాలు, మోపిదేవి రాజీనామాతో ఖాళీ చేసిన స్థానం భర్తీ చేపట్టింది. (పిల్లి సుభాశ్ రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానం పదవీకాలం 9నెలలే ఉండటంతో దాన్ని భర్తీ చేయలేదు.) ఉన్న మూడు ఎమ్మెల్సీ పదవులపై దాదాపు 30మంది నేతలు ఆశలు పెట్టుకోవడంతో పార్టీ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది.
– గవర్నర్ కోటాలో పశ్చిమ గోదావరి జిల్లా దళిత నేత మోసెన్ రాజు పేరును ఎమ్మెల్సీగా దాదాపుగా ఖరారు చేశారు. కానీ టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉంటూ 2019 ఎన్నికల ముందు పార్టీలో చేరిన పండుల రవీంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇస్తామని తనకు కనీసం ఎమ్మెల్సీ అయినా ఇవ్వరా అని ఆయన అడిగారు. దాంతో మోసెన్ రాజు స్థానంలో చివరి నిముషంలో పండుల రవీంద్రబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. 2010లో జగన్ వెంట నిలిచిన మొదటి డీసీసీ అధ్యక్షుడు మోసెన్రాజు తీవ్ర నిరాశకు గురయ్యారు.
– గవర్నర్ కోటాలో మరో ఎమ్మెల్సీ స్థానాన్ని వైఎస్సార్ కడప జిల్లాలో మైనార్టీ వర్గానికి చెందిన జకియా ఖాన్కు ఇచ్చారు. దాంతో అదే జిల్లాలో సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి నిరాశకు గురయ్యారు.
– గుంటూరు జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ 2019 ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వనందున ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కూడా ఇస్తానని వైఎస్ జగన్ ఎన్నికల బహిరంగ సభలో ప్రకటించారు. ఎన్నికలు అయిన వెంటనే 2019లో వచ్చిన రెండు ఎమ్మెల్సీలలో ఆయనకు అవకాశం ఇవ్వలేదు. తాజాగా మోపిదేవి వెంటకరమణ
రాజ్యసభ సభ్యుడు కావడంతో ఖాళీ అయిన స్థానాన్ని తనకు ఇస్తారని ఆయన ఆశించారు. ఆయన పేరే ఖరారు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆయనకు సమాచారం కూడా ఇచ్చారు. కానీ విజయనగరం జిల్లాలో సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు హఠాన్మరణంతో సమీకరణలు మారిపోయాయి. సాంబశివరాజు కుమారుడు పెనుమత్స సూర్యనారాయణరాజు (సురేశ్)కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో మర్రి రాజశేఖర్కు మరోసారి నిరాశే మిగిలింది. రాజధాని తరలింపు నిర్ణయంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న కమ్మ సామాజికవర్గం ఈ అవకాశాన్ని వాడుకుని ప్రభుత్వంపై విమర్శల జోరు పెంచింది.
– రాజ్యసభ హామీ నెరవేరకపోవడంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని విశాఖపట్నం జిల్లాలోని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కోరారు. గవర సామాజికవర్గం నుంచి శాసనసభలోగానీ శాసనమండలిలోగానీ తొలిసారి ప్రాతినిధ్యం లేకుండాపోయిన విషయాన్ని గుర్తుచేసినా ఫలితం లేకపోయిందని ఆయన ఆయన వాపోతున్నారు.
– శ్రీకాకుళం జిల్లాలో రిజర్వుడు నియోజకవర్గాలు పాలకొండ, రాజాంలో కింగ్మేకర్గా ఉన్న పాలవలస రాజశేఖరం కుటుంబం, విశాఖపట్నం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో పార్టీకి పెద్దదిక్కు అనంత ఉదయ్భాస్కర్, పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, కృష్ణా జిల్లాలో వైఎస్ కుటుంబ సన్నిహితుడు దుట్టా రామచంద్రరావు, ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి భరత్, హనుమారెడ్డి, కర్నూలు జిల్లాలో సిద్ధారెడ్డి తదితరులు తమను పార్టీ గుర్తించ లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మండలి రద్దు అయితే ప్రస్తుతం వెయిటింగ్ లిస్టులో ఉన్న నేతలు చట్టసభలకు వెళ్లాలన్న తమ ఆశలను వదులుకోవాల్సిందే. ప్రస్తుతానికి చాపకింద నీరులా ఉన్న ఈ అసమ్మతి పరిణామాలు ఎలా ఉండనున్నాయ్నది చెప్పలేమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.











