ఆగస్టు 15 భారతీయులందరికీ పండుగరోజు. భారతజాతి దాస్య శృంఖలాలు తెగిపోయిన రోజు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినరోజు. మన దేశపు సిరిసంపదలను దీర్ఘకాలంగా దోచుకున్న, ఇక్కడి ప్రజలను ఆకలిదప్పులతో అలమటింపజేసిన బ్రిటీష్ వారు మనదేశాన్ని వదలిపోయిన రోజు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ భారత ప్రధానిగా నియమితులై ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రోజు. ‘‘స్వతంత్ర భారత్ కీ జై, భారత్ మాతాకీ జై, మహాత్మాగాంధీకీ జై’’ అంటూ దేశ ప్రజలు ముక్తకంఠంతో, దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన రోజు. మరపురాని, మరచిపోటానికి వీలులేని మధురమైన రోజు ఆగస్టు 15.
ఇదే ఆగస్టు 15న తెలుగు గడ్డపై చరిత్రలో నిలిచిన బిడ్డలు కొందరు జన్మించారు. వారి గురించి తెలుసుకొందాము, స్మరించుకుందాము.
![]()
జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి :
1852 ఆగస్టు 15న జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కారంచే
డులో జన్మించారు. ప్రస్తుతం కారంచేడు ప్రకాశం జిల్లాలో వున్నప్పటికీ అప్పటికి నెల్లూరు జిల్లాలో వుండేది. జాగర్లమూడి వంశం దాన ధర్మాలకు ప్రసిద్ధి చెందింది. కొన్ని తరాలుగా ఆ కుటుంబం నిరతాన్నదాన కుటుంబంగా కీర్తింపబడివుంది. వీరి తల్లి రంగమ్మగారు ‘అన్నపూర్ణ’కు ప్రతిరూపమని ప్రశంసించేవారు. ప్రతిరోజూ ఉదయం ముక్కాలిపీట పైన కూర్చుని ఇంటికి వచ్చే ఆర్తులు వడ్లు, బియ్యం అన్నంలలో ఏది కోరితే అది ఇచ్చి పంపేవారట. ఏడాదిలో రెండుసార్లు బీద సాదలకు బట్టలు కూడా పంచిపెట్టే ఆదర్శం ఆ కుటుంబానిది. వారి ఇంటిముందుగా బండ్లుతోలుకుని వెళ్లేవారికి, వారి ఎద్దులకవరసమైన మేతకూడా అందించేవారట. గ్రామస్థులకు ఆయుర్వేద మందులు కూడా ఉచితంగా సరఫరా చేసేవారట. 1925లో ఒంగోలు ప్రాంతం కరువుకు గురైంది. నీళ్లు లేక, పంటలు లేక పొలాలు బీటలువారాయి. ఆ సమయంలో కొన్ని వందల కుటుంబాలను ఆదుకొన్నది జాగర్లమూడి కుటుంబం. 1936 లో పెనుతుఫాను వల్ల భారీగా నష్టపోయింది. వారినీ ఆదుకొందీ కుటుంబం. కవులు, పండితులు వారివద్దకు వచ్చి సాయం అర్థించేవారు. వారిలోని పాండిత్య ప్రతిభను స్వయంగా పరిశీలించి, వారికి సహాయం అందించేవారు. 1920 నుంచి 1937 వరకు సుమారు 17 సంవత్సరాలు కౌన్సిల్ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించిన జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి 1960 డిసెంబరు 12న కన్నుమూశారు.
బి.వి.నరసింహారావు :
1913 ఆగస్టు 15న బి.వి.నరసింహ్మారావు జన్మించారు. కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా కేంద్రం వీరి జన్మస్థలం. ‘‘మాట, పాట, ఆట’’ మూడింటి అవినాభావ సంబంధాన్ని సమపాళ్లలో రంగరించి పసిడి ముద్దలుగా బాలలకు అందించిన బాలసాహితీ రచయిత బి.వి.నరసింహారావు.
‘‘చింతచెట్టు తొర్రలోన చిలక వున్నదీ.. తాత బోడి బుర్రమీద పిలక వున్నదీ’’ అంటూ నిత్యం వాడుకునే అతిచిన్న పదాలతో కవితలల్లి, బాలలకు వాటిపట్ల మక్కువ, మమకారం కలిగించారు. ఆయనను ‘బాలబంధు’ సత్కారంతో 1978లో బాలల అకాడమీ సత్కరించింది. ఆయన రాసిన ‘‘పాలబడి పాటలు’’ పుస్తకాన్ని ఉన్నత పురస్కారానికి ఎంపిక చేసి, భారత ప్రభుత్వం సత్కరించింది. బడిపంతులుగా జీవితాన్ని ప్రారంభించిన బి.వి.నరసింహారావు బాలలకోసం అనేక పుస్తకాలు రాశారు. ప్రారంభవిద్య, ఆంధ్ర మహిళ, బాలజ్యోతి, కృష్ణా పత్రికలు వీరి రచనలు ప్రచురించాయి. ‘‘మల్లెలు-మందారాలు’’ పేరుతో బాల గేయాల సంకలనం చేసిన నరసింహారావు 1994 జనవరి 7న కన్నుమూశారు.
మల్లెమాల సుందర రామిరెడ్డి :
‘మల్లెమాల’గా తెలుగు సినీ ప్రేక్షకులకు చిరపరిచితులైన మల్లెమాల సుందర రామిరెడ్డి 1924 ఆగస్టు 15న జన్మించారు. తల్లి రంగమ్మ, తండ్రి రామస్వామి రెడ్డి. నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలోని అలిమిలి గ్రామం వీరి జన్మస్థలం. 1941లో నెలకు పది రూపాయల జీతానికి ఉద్యోగం చేశారు. సంఘసంస్కర్తగా గుర్తింపు పొందారు. సినీ వ్యాపారం మొదలుపెట్టి కవిగా మారారు. పలు చిత్రాలు నిర్మించారు. ముక్కుసూటి మనిషిగా ప్రశంసలనందుకున్నారు. ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. మరపురాని గీతాలు అందించిన యం.యస్.రెడ్డి 2011 డిసెంబరు 11న స్వర్గస్తులయ్యారు.
నాగభైరవ కోటేశ్వరరావు :
‘‘సూర్యుడు నా చిరునామా, తూర్పు నా వీలునామా, చైతన్యం నా చేవ్రాలు’’ అంటూ నర్మగర్భంగా కవిత్వం చెప్పిన నాగభైరవ కోటేశ్వరరావు 1931 ఆగస్టు 15న జన్మించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న రావినూతల వారి జన్మస్థలం. తల్లి రాఘవమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. అక్షరాన్ని శ్వాసించి, అభ్యుదయాన్ని కాంక్షించిన కవి. స్వయం కృషితో, స్వీయ క్రమశిక్షణతో చైతన్యవంతులై, పల్లె వాతావరణంలో విరబూసిన ఇంద్రధనుస్సును గుర్తుకు తెచ్చే కవి పుంగవుడు. ‘నాదేశంలో మనుషులు రెండే రెండు రకాలు. చెమటోడ్చి బతికేవాళ్లు, చెమట ఊడ్చి గతికేవాళ్లు’ అంటూ నిబ్బరంగా నిర్భయంగా తన మనసులోని భావాలను కవితగా వెలువరించిన కవి పుంగవుడు. 1960లో ‘‘రంగాజమ్మ’’ గేయకావ్యంతో మొదలైన వారి రచనా ప్రక్రియ సినిమా రచయితగా కూడా గుర్తింపు తెచ్చి, అనేక గ్రంధాలు ఆయన కలంనుంచి వెలువరించటానికి నాంది పలికింది. 2008 జూలై 4న నాగభైరవ స్వర్గస్తులయ్యారు.
రఘుముద్ర శ్రీహరి :
విలన్ గా, హీరోగా, కామెడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొద్ది కాలంలోనే 97 సినిమాల్లో నటించిన రఘుముద్ర శ్రీహరి 1964 ఆగస్టు 15న జన్మించారు. తల్లి లక్ష్మి, తండ్రి సత్యనారాయణ. కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా యలమర్తి వీరి జన్మస్థలం. మగధీర చిత్రంలో ఆయన నటించిన షేర్ ఖాన్ పాత్ర తెలుగు తెర షేర్ ఖాన్ గా ముద్రవేసింది. 2013 అక్టోబరు 10న ఆయన కన్నుమూశారు.
పావులూరి శ్రీనివాస రావు :
ఉత్తమ గ్రంథపాలకుడు, తల్లిదండ్రుల పోషణ కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్న వ్యక్తి, ముని పావులూరి శ్రీనివాసరావు. 1957 ఆగస్టు 15న జన్మించారు. తల్లి సరోజిని, తండ్రి బాపయ్య చౌదరి. గుంటూరు జిల్లా తెనాలి వీరి జన్మస్థలం. విద్యార్థి దశనుంచే సేవాకార్యక్రమాలు ప్రారంభించారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య అవినాభావ సంబంధం పెంపొందటానికి పలు కార్యక్రమాలు చేపట్టారు.
డాక్టర్ ఉదయగిరి ప్రసాదరావు :
పలు వరి వంగడాలు రూపొందించే పనిలో ఆరితేరి, 46 ఏళ్లుగా వ్యవసాయ శాస్త్రవేత్తగా కొనసాగుతున్న ఉదయగిరి ప్రసాదరావు 1941 ఆగస్టు 15న జన్మించారు. తల్లి రామలక్ష్మి, తండ్రి తిలకం. విశాఖపట్నం సమీపంలోని కరకవలస గ్రామం వీరి జన్మస్థలం. వ్యవసాయ శాస్త్రవేత్తగా కొనసాగుతూ జాతీయ, అంతర్జాతీయ జర్నల్సులో 120 పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురించారు.
కీ.శే. కొండా వెంకటప్పయ్య :
స్వాతంత్ర్య సమరంలో 1921, 1930, 1932, 1942 ల్లో జైలుకెళ్లి, శిక్ష అనుభవించిన కొండా వెంకటప్పయ్య 1949 ఆగస్టు 15న మృతిచెందారు. వీరు 1866 ఫిబ్రవరి 22న గుంటూరులో జన్మించారు. వెంకటప్పయ్య తెలుగు, ఆంగ్ల భాషల్లో గొప్ప వక్త. గొప్ప నటుడు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం తన సర్వస్వం త్యాగం చేసిన దానశీలి. ‘‘దేశభక్త’’ బిరుదుతో సత్కరించబడ్డారు.
.. దాసరి ఆళ్వార్ స్వామి.











