
తిరుపతిలోని రుయా హాస్పిటల్ వైద్యాధికారుల నిర్లక్ష్యంతో సత్యవేడుకు చెందిన జర్నలిస్ట్ తిరుపాల్ మృతి చెందారు. ఆయన మరణం వెనుక హాస్పిటల్ నిర్లక్ష్యం దాగిఉందనడంలో ఎలాంటి సందేహం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్-29న శ్వాస ఆడక ఆయనను రుయా హాస్పిటల్ లో చేర్చారు. తిరుపాల్ పనిచేస్తున్న AP24x7 ప్రతినిధి వచ్చి రుయా అధికారులను కోరగా హాస్పిటల్ చేర్చుకుని సాధారణ వార్డులో ఉంచేశారు. అప్పటి నుండి కరోనా టెస్టింగ్ కిట్ లు లేవని, డాక్టర్లు లేరని కాలం వెళ్ళదీశారు. మూడు రోజులుగా రుయా హాస్పిటల్ లో తిరుపాల్ భార్య,భావమరిది వైద్యం చేయండి మహా ప్రభో అంటూ వాళ్ళు పడిన వేదన మరేవరికి రాకూడదు. ఆగష్టు-2 వతేది ఆదివారం వైద్యానికి శరీరం సహకరించలేదని ఆయన మరణించినట్లు హాస్పిటల్ సిబ్బంది ప్రకటించింది. మరణించిన తరువాత కరోనా టెస్ట్ నిర్వహించి నెగిటివ్ అని చెప్పి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. వైద్యం అందించడంలో కొంచెం శ్రద్ధ చూపించి ఉంటే బ్రతికిఉండే వారని,ఇది ముమ్మాటికి రుయా హాస్పిటల్ నిర్లక్ష్యం మాత్రమే అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
హాస్పిటల్ కు వచ్చిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఏంటి అని పట్టించుకుని వైద్యం అందించి ఉంటే ప్రాణాలు బ్రతికిఉండే వారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఒక జర్నలిస్ట్ అని తెలిసినా పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా వైద్యం అందించడం లో నిర్లక్ష్యం వహించారు. కనీసం వెంటిలేటర్ కూడా ఏర్పాటు చేయకుండా ఒకసాధారణ వార్డులో ఉంచేశారంటే ఊహించండి తిరుపతి రుయా లో వైద్య సేవలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమౌతుంది. ప్రజలకు సేవకులుగా ,అన్ని సమయాల్లో సమాఛారాన్ని అందిస్తూ ప్రజాహిత సేతువులుగా నిలబడే జర్నలిస్ట్ ల పరిస్థితియే ఇలా ఉంటే ఇక సాధారణ ప్రజలు పరిస్థితి వర్ణనాతీతం. గత 12సంవత్సరాలుగా సత్యవేడు నియోజకవర్గ స్థాయి జర్నలిస్ట్ గా కె.తిరుపాల్ సమాజహిత సేవలను అందిస్తూ వృత్తిరిత్యా మంచిపేరును సంపాదించుకున్నారు. మధ్యతరగతి జర్నలిస్ట్ కుటుంబానికి చెందిన ఆయన ఒక చిన్న ఫోటో స్టూడియో నిర్వహించుకుంటూ కుటుంబ భాద్యతలను నిర్వర్తించేవాడు. ఆ కుటుంబం పెద్ధదిక్కును కోల్పోవడం చాలా భాధాకరమని తోటి జర్నలిస్ట్ మిత్రులు కన్నీటి పర్యాంతమవుతున్నారు.

కరోనా సమయంలోనూ తమ ప్రాణాలకు తెగించి విధులను నిర్వర్తించే కరోనా పోరాట యోధులకు వైద్యం అందించాల్సింది మానేసి భయాందోళనకు గురిచేస్తూ సగం ప్రాణాలు భలిగొంటున్నారు. ధైర్యాన్ని కల్పించి వైద్యం చేయాల్సిన హాస్పిటళ్ళు , వైద్యాధికారులు నిర్లక్ష్యం కారణంగానే సామాన్యులు,అసమాన్యులు సైతం ప్రాణాలు కోల్పోవాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడుతున్నది. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నవారు,మధ్యతరగతి జీవనాన్ని సాగించే పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారు.కరోనా ప్రాణాలు తీసేస్తుందో లేదో కానీ ఇక్కడి వైద్యాధికారులు వైద్యం అందిచకనే భయానికి గురి చేసి మరీ ప్రాణాలు తీసేస్తున్నారనేది నమ్మలేని నిజం.
ఇకనైనా రుయా వైద్యుల వ్యవహార శైలిలో మార్పు తీసుకుని వచ్చి అమాయక ప్రజల ప్రాణాలు కాపాడాలని తిరుపాల్ కుటుంబ సభ్యులు విషణ్ణ హృదయాలతో ప్రార్ధిస్తున్నారు. అనారోగ్యం కారణంగా మరణించిన తిరుపాల్ కు ఒక కుమార్తే,ఒక కుమారుడు ,భార్య ఉన్నారు. తిరుపాల్ ఓ చిన్న ఫోటో స్టూడియో నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు.ఇప్పుడు ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది.ప్రభుత్వమే ఆకుటుంబాన్ని ఆదుకొని ఆర్ధిక భరోషా కల్పించి అండగా నిలవాలని సాటి జర్నలిస్ట్ లు ,గ్రామస్తులు కోరుతున్నారు.