( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి… అన్నట్టుంది ప్రభుత్వం తీరు. ప్రభుత్వం ఏం చేసినా దానికి గొప్ప కలరింగ్ ఇవ్వడం అలవాటుగా మారింది. లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలు తెరిచిన రాష్ట్ర ప్రభుత్వం, ఊహించని రీతిలో మద్యం ధరలను అనతికాలంలోనే పెంచేసింది. సుమారు 75 శాతం ధరలు పెరగడంతో మందు బాబులు లబోదిబోమంటూ.. ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ.. వచ్చిన సంపాదనలో సింహభాగం తాగుడికే తగలేసుకున్నారు. ఆదాయం కోసమే ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచింది అన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా… ప్రభుత్వం మాత్రం మరో వాదన వినిపించింది.
సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా..
అమాంతం ధరలు పెంచేసిన ప్రభుత్వం తమపై వ్యతిరేకత రాకుండా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసేందుకే మద్యం ధరలను విపరీతంగా పెంచామని, దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని కలరింగ్ ఇచ్చింది. మద్యం ధరలు అధికంగా ఉండడం వల్ల క్రమంగా తాగుడుకు బానిసలు కాకుండా చేయడమే తమ ముందున్న లక్ష్యమని ప్రెస్ మీట్లు పెట్టి మరీ మంత్రులు ఎమ్మెల్యేలు, ఎక్సైజ్ శాఖ అధికారులు సెలవిచ్చారు. అది నిజమే అని నమ్మిన మహిళలు కూడా ఉన్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి..
ఏపీలో మద్యం ధరలు చుక్కలను అంటడంతో మద్యం ప్రియులంతా పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకునే మార్గాలను ఎంచుకున్నారు. దీంతో రాష్ట్రానికి ఆదాయం భారీగా పడిపోయింది. మరోవైపు తనిఖీల్లో కోట్లాది రూపాయల విలువైన పొరుగు రాష్ట్రం మద్యం బాటిళ్లు పట్టుబడుతుండడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో గత నెలలో మద్యం ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సుప్రీం కోర్టు అనుమతితో..
ఈ తరుణంలో సుప్రీం కోర్టు నుంచి వెలువడిన ఉత్తర్వులతో మందు బాబులకు మరింత ఊరట లభించింది. మూడు మద్యం బాటిల్లు ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చని సుప్రీం స్పష్టం చేయడంతో ఆ తరహా దిగుమతి విపరీతంగా మొదలైంది. దానిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. తాజాగా నవంబర్ ఒకటో తేదీ నుంచి ధరలు మరో పాతిక శాతం తగ్గిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆదాయం పెంచుకునేందుకు, పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి పడుతున్న మద్యాన్ని నియంత్రించేందుకు ధరలు తగ్గించినట్టు అధికారులు చెబుతున్నారు.
మరి మద్యపాన నిషేధం మాటేంటి?
మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేసేందుకే ధరలు అనూహ్యంగా పెంచామని చెప్పుకొచ్చిన ప్రభుత్వం ధరలు తగ్గించడం వల్ల మద్యపాన నిషేధానికి తిలోదకాలు ఇస్తున్నట్టు సంకేతమని భావించాలా ? మరి ఈ నిర్ణయాన్ని పెద్దలు ఏవిధంగా సమర్థించుకుంటారో చూడాల్సిందే.