భారతీయ శిక్షాస్మృతిలో 300వ సెక్షన్ ‘హత్య’ను మూడు రకాలుగా నిర్వచిస్తుంది. ఒకటి- మరణం సంభవించాలనే ఉద్దేశంతో చేసిన పని. రెండు- మరణానికి కారణం కావచ్చునని తెలిసి కూడా, ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా గాయపరచడం. మూడు- తను చేసే పని ప్రమాదకరమైనదని, దాని వలన మరణం గానీ, తీవ్రమైన గాయం గానీ సంభవించవచ్చునని తెలిసినప్పటికీ ఆ పని చేయడం. వీటన్నింటినీ హత్యగా పరిగణిస్తారు.
ఇది పీనల్ కోడ్ నిర్వచనం అయితే.. మన మాటల్లో అయితే కావాలని చేస్తే తప్ప హత్య కూడా నేరం కాదు! ఈ ఒక్క పాయింట్ని పట్టుకుని, క్షణికావేశంలో చేసిన హత్యలని, తెలియక చేసిన పనివల్ల మరణించాడని లీగల్ పాయింట్లు వెతికి చట్టం చేతుల్లోంచి తప్పించుకుంటున్న వారు కొల్లలుగా ఉంటారు. అంటే.. క్షణికావేశంలో చేస్తే హత్య కూడా తప్పు కాదని అంటుంది న్యాయం. మరి క్షణికమైన ఆవేదనలో చేసే తప్పును ఎలా పరిగణించాలి. ఆవేశానికి రూపం ఉంటుంది.. ఆవేదనకు రూపం- అన్ని సందర్భాల్లోనూ ఉండదేమో!
క్షణికమైన ఆవేదనలో నోరు జారి అన్న మాటలను నేరం కింద పరిగణించాల్సిందేనా? కోర్టు ధిక్కకరణ కింద శిక్షించి తీరాల్సిందేనా? తమిళ- తెలుగు నటుడు సూర్య చేసిన ట్వీట్.. అది సృష్టిస్తున్న ప్రకంపనల నేపథ్యంలో ఇలాంటి సందేహాలు కలుగుతున్నాయి. సాక్షాత్తూ హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహించడం భిన్నమైన చర్చకు బీజం అవుతోంది.
పూర్వరంగంలో ఏం జరిగింది..
కొవిడ్ నేపథ్యంలో నీట్, జెఇఇ పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా విద్యార్థుల తరఫున సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 11 రాష్ట్రాల నుంచి 11 మంది విద్యార్థులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఇలా వాయిదా కుదరదని తగు జాగ్రత్తలతో పరీక్ష నిర్వహించవచ్చునని కోర్టు ఆదేశించింది. ఆగస్టు 17న ఈ తీర్పు వెలువడింది.
‘‘విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిందే. కోవిడ్ అనేది మరో ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉంది. మరో ఏడాదివరకు మీరు వేచి ఉంటారా? దానివల్ల దేశానికి, విద్యార్థుల కెరీర్ కు వాటిల్లే నష్టం ఏమిటో మీకు తెలుస్తోందా?’’ అంటూ సుప్రీం త్రిసభ్య న్యాయమూర్తుల బెంచ్ కు సారథ్యం వహించిన జస్టిస్ అరుణ్ మిశ్రా తీర్పు సమయంలో వ్యాఖ్యానించారు. కొవిడ్ వ్యాపించకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని సంబంధిత సంస్థలు హామీ ఇచ్చాకే ఈ తీర్పు వెలువరించారు.
సుప్రీం ఆదేశాల మేరకు ఇప్పటికే జెఇఇ పూర్తయింది. ఈ ఆదివారం (13 సెప్టెంబరు) నీట్ పరీక్ష కూడా జరిగింది. ఆ సందర్భంగానే- పరీక్ష భయంతో కొన్ని ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి.
ఇంతకూ హీరో సూర్య ఏం చేశాడు..
దేశస్థాయిలో మెడికల్ ఎంట్రెన్సు పరీక్ష ‘నీట్’ ఆదివారం జరిగింది. సహజంగానే.. ఈ ఎంట్రెన్సు పరీక్ష విద్యార్థుల మీద తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తుంటుంది. అవాంఛనీయ ఘటనలు కూడా జరుగుతుంటాయి. తమిళనాడులో పరీక్ష కలిగించే ఒత్తిడి తట్టుకోలేక.. వేర్వేరు ఘటనల్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు ఎవ్వరినైనా కలిచివేస్తాయి.
సామాజిక పరిణామాల మీద సోషల్ మీడియాలో స్పందించే అలవాటు కూడా ఉన్న సినీ హీరో సూర్య కూడా స్పందించాడు. నీట్ పరీక్ష నిర్వహించడానికి అనుమతిస్తూ తీర్పు ఇచ్చిన న్యాయవ్యవస్థ తీరును విమర్శించాడు.
‘‘కరోనా నేపథ్యంలో న్యాయమూర్తులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే కేసులు విచారిస్తున్నారని, పిల్లలను మాత్రం నిర్భీతిగా వెళ్లి పరీక్ష రాయమని ఆదేశించడంలో నైతికత లేదని’’ సూర్య తన ట్వీట్లో వ్యాఖ్యానించినట్లుగా ప్రచారంలోకి వచ్చింది. నీట్ పరీక్షకుముందుగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో సూర్య తమిళ భాషలో.. ఒక ట్వీట్ చేశారు. తాజా సంచలనానికి అదే కారణం.
సూర్యపై రభస ఏంటి?
నటుడు సూర్య చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందికి వస్తాయని, ఆయనపై ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు న్యాయమూర్తి సుబ్రమణ్యం, చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. ‘నైతికత లేదు’ అనే ట్వీట్ లోని వ్యాఖ్యాలను జస్టిస్ సుబ్రమణ్యం ప్రత్యేకంగా ఉదాహరించారు.
దీనిచుట్టూతానే రభస జరుగుతోంది. సూర్య తమిళంలో చేసిన ట్వీట్ ను, ఆంగ్లంలోకి అనువదించి అర్థం చేసుకోవడంలో చిన్న పొరబాటు జ రిగిందని- ‘నైతికత లేదు’ అనే పదాలు సూర్య వాడలేదని ఆయనను సమర్థించే వారు అంటున్నారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలకు అండగా నిలిచే, అనేక మంది పేద విద్యార్థుల చదువులకు కూడా అండగా నిలిచే హీరో సూర్య ను ఇంత చిన్న కారణానికి శిక్షించడం తగదనే వారు కూడా ఉన్నారు. ఆత్మహత్యల దుర్ఘటనలపై ఒక కళాకారుడి స్పందనను తీవ్రమైన నేరంగా పరిగణించవద్దని కోరుతూ ఆరుగురు మాజీ న్యాయమూర్తులు, కొందరు న్యాయవాదులు కూడా చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు.
సూర్య ట్వీట్ లో నిజంగానే తప్పుందా?
నీట్ పరీక్ష నేపథ్యంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నది నిజం. అయితే వారు కొవిడ్ భయంతో ఆత్మహత్య చేసుకున్నారా? నీట్ పరీక్ష భయంతో, ర్యాంకు రాదనే ఒత్తిడిలోనా? అనేది చర్చనీయాంశం. ఆ స్పష్టత లేకుండానే.. హీరో సూర్య స్పందించారు. కొవిడ్ భయమే అయితే గనుక.. ఆ విద్యార్థులు పరీక్ష రాయకుండా ఆగిపోవచ్చు. వారు కోరుకునేట్లే.. వచ్చే ఏడాది రాసుకోవచ్చు. తమ సహచర విద్యార్థుల కంటె ఒక ఏడాది వెనుకబడడం తప్ప వారు కోల్పోయేది ఏమీ ఉండదు. ఆ ఆప్షన్ వారికి ఉండనే ఉంటుంది.
అదే సమయంలో నీట్ ర్యాంక్ వస్తుందో రాదో అనే భయమే వారి ఆత్మహత్యలకు కారణం అయి ఉంటే గనుక.. కోర్టులు ఇచ్చిన తీర్పును తప్పుపట్టడంలో అర్థం లేదు. ర్యాంకు కోసం విద్యార్థుల మీద ఒత్తిడిపెంచే విద్యా సంస్థలు, వారి తల్లిదండ్రుల తీరును సూర్య తప్పు పట్టాలి. పరీక్ష నిర్వహణకు అనుమతించిన సుప్రీం కోర్టు మీదనో, ఫిజిక్స్ పేపర్ కష్టంగా సెట్ చేసిన ఎగ్జామినర్ల మీదనో ఆయన ఆగ్రహించడంలో అర్థం లేదు. కానీ విద్యార్థులు చనిపోగానే.. అసలు ఎగ్జామ్ జరగకుండా ఉంటే ఈ బాధే రాదు కదా.. అని తక్షణం కలిగే స్పందనతోనే సూర్య ఆ ట్వీట్ చేసినట్టుగా భావించాలి.
దీన్ని ‘ధిక్కరణ’ అనడం ధర్మమేనా?
న్యాయం- ధర్మం- చట్టం ఇవన్నీ వేర్వేరుగా ఉంటాయి. చట్టం నిర్దిష్టంగా ఉన్నా.. మిగిలిన వాటి నిర్వచనం మన దృక్కోణాల్ని బట్టి మారిపోతుంటుంది. ప్రారంభంలో ఇండియన్ పీనల్ కోడ్ 300 సెక్షన్ ను ప్రస్తావించినది అందుకే..
తెలిసి చేస్తేనే- హత్య తప్పు అంటుంది చట్టం.
తెలియక చేస్తే, ఆవేశంలో చేస్తే.. హత్య కూడా తప్పు కాదు అంటుంది.. చట్టాన్ని అన్వయించుకుని శిక్షలను నిగ్గుతేల్చే న్యాయం.
‘ధర్మం’ ఒక్కోసారి ఈ రెండింటికీ కూడా భిన్నంగా ఉండవచ్చు. తెలిసి చేసినా కూడా, హత్యకు దారితీసిన పరిణామాలు తీవ్రమైనవైతే తప్పు కాదంటుంది ధర్మం.
ఇప్పుడు సూర్య చేసిన ట్వీట్ను ఎలా అర్థం చేసుకోవాలి? అర్థంతరంగా కడతేరిపోయిన విద్యార్థుల చావులు చూసిన ఆవేదనలో ఆయన చేసిన ట్వీట్.. కోర్టు ధిక్కరణ అవుతుందా? దానిని అంత తీవ్రంగా జస్టిస్ సుబ్రమణ్యం తీసుకోవడం కరక్టేనా?
ధర్మం కాదు అనిపిస్తోంది.
సూర్య హీరోయిజం పెరిగింది..
సామాజిక అంశాలపై అనేక మంది హీరోలు తరచూ స్పందిస్తూనే ఉంటారు. వారి స్పందనల్ని సమాజం కూడా గమనిస్తూనే, గౌరవిస్తూనే ఉంటుంది. సూర్య ట్వీట్ అక్కడితో ఆగి ఉంటే.. ఆయన స్పందన మాత్రమే ప్రజలకు తెలిసేది. కానీ న్యాయమూర్తి దీనిని కోర్టు ధిక్కరణగా పరిగణించడం.. అనేక మంది న్యాయనిపుణులు ఈవిషయంలో సూర్యకు అండగా నిలవడం.. ఇలాంటి నేపథ్యంలో సూర్య హీరోయిజం మరికాస్త పెరుగుతోంది. కొనసాగుతున్న చర్చ.. ఆయనకు అదనపు కీర్తిని కట్టబెడుతోంది.
ఈ వివాదం ఇక్కడితో సమసిపోతే ఎంతో మంచిది. లేదా.. తన వ్యాఖ్యలు ఒక్క న్యాయమూర్తినైనా నొప్పించినందుకు, చావులకు కోర్టు తీర్పు హేతువు కాకపోయినప్పటికీ.. ఆ ఆవేదనలో- న్యాయవ్యవస్థ పాత్రను ప్రస్తావించినందుకు.. సూర్య ఒక మన్నింపు కోరుకుంటే.. ఆయన సహృదయశీలత, ఉదాత్తత ఇంకా పెరిగి.. హీరోయిజం మరింతగా ఎలివేట్ అవుతుంది.
.. సురేష్ పిళ్లె











