ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాంలో, ప్రస్తుత వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఉన్న పాత్ర ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ స్కాంలో అసలు నిందితులను తప్పించడానికి గుమ్మనూరు జయరాం.. చాలా పెద్ద కానుకలు స్వీకరించినట్టుగా ఆధారాలు దొరుకుతున్నాయి. ది లియోన్యూస్ డాట్ కామ్ కు దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా లభించాయి. ఈఎస్ఐ స్కాంలో ఒక కీలక నిందితుడు అయిన తెలుకపల్లి కార్తీక్ తో గుమ్మనూరు జయరాంకు సంబంధాలు ఉన్నట్టు, ఆయన కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్ వాడుతున్న బెంజి కారును కార్తీక్ కానుకగా ఇచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి.
మొత్తంగా గమనించినప్పుడు.. ఇప్పటి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్.. ఈఎస్ఐ స్కామ్ నిందితుడు, ఏ14 అయిన తెలుకపల్లి కార్తీక్ తో లాలూచీ వ్యవహారం నడిపినట్లుగా వ్యవహారం కనిపిస్తోందని పలువురు భావిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..
తెలుకపల్లి కార్తీక్ అనే వ్యక్తి ఈఎస్ఐ స్కామ్ లో ఎ 14 గా ఉన్నాడు. ఇతని పేరుతో నానేష్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు బెంజి కారు కొనుక్కోడానికి 45 లక్షల రూపాయల రుణం ఇచ్చారు. డిసెంబరు 12న ఆ రుణంతో కారు తీసుకోవడం జరిగింది. అయితే ఆ కారును షోరూంనుంచి పుచ్చుకున్నది మాత్రం మంత్రి గుమ్మనూరు జయరాం కొడుకు గుమ్మనూరు ఈశ్వర్. అదే తమాషా!
అది తన సొంత కారు లాగా.. స్వార్జితం అయినట్టుగా గుమ్మనూరు ఈశ్వర్ ఎంచక్కా ఫోటోలు దిగి ఫేస్ బుక్ లో పెట్టుకున్నాడు. ఈ ఏడాది జులైలో జరిగిన తన పెళ్లి వేడుకలో కూడా అదే కారును చాలా ప్రముఖంగా వాడుకున్నాడు. ఇంతా కలిపి ఈఎస్ఐ స్కాంలో ఎ 14 నుంచి కానుకగా తీసుకున్న కారే అనేది తాజాగా వెల్లడవుతోంది. జూన్ 10 వ తేదీన తెలుకపల్లి కార్తీక్ మీద ఏసీబీ కేసు నమోదు అయింది. జులైలో అరెస్టు కూడా చేశారు.
కార్తీక్ కొన్న బెంజ్ కారునే , గుమ్మనూరు ఈశ్వర్ వాడుకుంటున్నాడనే రుజువులు అన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ప్రెస్ మీట్ కూడా పెట్టింది. విశాఖలో అయ్యన్నపాత్రుడు ప్రెస్ మీట్ పెట్టి.. ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడును అరెస్టుచేసి వేధించారని, నిజానికి ప్రస్తుత మంత్రికి కేసులోని నిందితుడు బినామీ అని.. అందుకే మంత్రి కొడుక్కి బెంజి కారు లంచంగా ఇచ్చారని ఆరోపించారు.
ఏసబీ అధికార్లకు ఫోను ద్వారా కూడా సమాచారం అందించారు. ఎప్పుడు ఎలాంటి విచారణకు పిలిచినా పూర్తి ఆధారాలు సమర్పిస్తానని కూడా అన్నారు. ఈ విషయంలో జుడిషియల్ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి జయరామ్ కు ఈఎస్ఐ స్కాంలో ఉన్న పాత్రను మరుగు పరచడానికే అచ్చెన్నాయుడును అరెస్టు చేశారని కూడా ఆరోపించారు.
మంత్రి ఖండన
తన కుమారుడు బెంజికారు లంచంగా తీసుకున్నట్టు అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను మంత్రి జయరాం ఖండించారు. తన కుమారుడికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారని.. వారి కోరిక మేరకు.. వారికోసం కారు డెలివరీ స్వయంగా తీసుకుని ఉండచ్చునని మంత్రి పేర్కొన్నారు.