ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలే రాలేదు.ఇంకా, పోలింగ్ ఊసే లేని సమయంలో వైసీపీ నేతలు కొత్త డ్రామాకు తెరలేపారు. వైసీపీ నేతల తీరు చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు. అసలు ఎన్నికల ప్రకటన రాకముందే కేంద్ర బలగాలు మోహరించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించి కొత్త నాటకానికి తెరలేపారు ఫ్యాన్ పార్టీ పెద్దలు. ఎన్నికల్లో గెలవలేమని ముందే పసిగట్టిన వైసీపీ నేతలు, ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవల్లో పార్టీ పరిస్థితి దారుణంగా దిగజారిపోవడంతో, ఎలాగైనా ఎన్నికల నుంచి తప్పించుకోవడానికి ఇదొక సాకుగా మలుచుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది.
అసలు మ్యాటర్ ఏంటంటే.. పులివెందుల ZPTC ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి గొడవలు లేకుండా అత్యంత ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ముగిసినప్పటికీ, అక్కడ ఏదో మహాప్రళయం జరిగిపోయినట్లు, ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయినట్లు కలరింగ్ ఇస్తూ SECకి వైసీపీ విజ్ఞప్తులు చేయడం కొసమెరుపు. రాష్ట్రంలో వేలాది పంచాయతీలు, స్థానిక సంస్థల స్థానాలకు జరిగే ఎన్నికలకు ఊరూవాడా కేంద్ర బలగాలను దింపడం ఆచరణలో ఏమాత్రం సాధ్యం కాదనే కనీస జ్ఞానం వైసీపీ నేతలకు లేదు. కేవలం ఓటమి భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి, లేనిపోని అభద్రతాభావాన్ని సృష్టించి ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఈ కుట్రపూరిత వినతి పత్రాల పర్వానికి తెరలేపింది వైసీపీ.
గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా, రాష్ట్రవ్యాప్తంగా ఎంత హింస చెలరేగిందో ప్రజలు ఇంకా మరిచిపోలేదు. అప్పట్లో విపక్షాల గొంతు నొక్కుతున్నప్పుడు ఈ కేంద్ర బలగాల జ్ఞాపకాలు ఏమాత్రం గుర్తుకురాని వైసీపీ పెద్దలకు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత సడన్గా పారామిలటరీ ఫోర్సెస్ పై అమితమైన ప్రేమ పుట్టుకొచ్చింది. అప్పట్లో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడే ద్వంద్వ ప్రమాణాలను ప్రజలు గమనిస్తున్నారనే స్పృహ కూడా లేకుండా ఆ పార్టీ నేతలు చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే నవాబుల కాలం నాటి నాటకాలను గుర్తుకు వస్తున్నాయి.
ఇదంతా చూస్తుంటే అసలు సినిమా ముందే ఉందని, తెరవెనుక జరుగుతున్న రాజకీయ కుట్రలు ఇట్టే అర్థమవుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత, కేంద్ర బలగాలను కేటాయించలేరనే విషయం తెలిసి కూడా వైసీపీ ఈ డ్రామా నడుపుతోంది. ఇదే సాకుగా మాకు రక్షణ కల్పించలేదు, అందుకే మేము ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చేందుకు వైఎస్సార్సీపీ ముందస్తుగా వేస్తున్న పక్కా రూట్ మ్యాప్ ఇదేనని స్పష్టమవుతోంది. స్థానిక పోల్స్ను ఎదుర్కొనే దమ్ములేక, ముందుగానే ఈ బహిష్కరణ అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటూ పారిపోయే మార్గాలను వెతుక్కుంటున్నారన్నమాట.











