దేశవ్యాప్తంగా కరోనాను ఖతం చేయడానికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు మోడీ. తెలుగు రాష్ట్రాలలో కూడా అట్టహాసంగా ప్రారంభమయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ ఒక మహిళ అందుకోవడం విశేషం. కరోనా విజృంభించిన సందర్భంలో తమ విధులను నిర్వహించిన పారిశుధ్య కార్మికుల గౌరవార్థం.. పారిశుధ్య కార్మికురాలు కిష్టమ్మను తొలి వ్యాక్సిన్ను అందించింది ప్రభుత్వం. తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్తో పాటు బిజెపి నేత కిషన్ రెడ్డి కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కంటికి కనిపించని శత్రువును అంతం చేసే కార్యక్రమం మొదలైందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించడమే లక్ష్యమని చెప్పారు. దశలవారిగా అన్నీ వర్గాల ప్రజలకు టీకా అందించడమే లక్ష్యమని చెప్పుకొచ్చారు.
ఏపీలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జగన్ స్వయంగా ప్రారంభించారు. సిఎం జగన్ ఆధ్వర్యంలో జిజిహెచ్లో వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ మొదలైంది. జగన్ సమక్షంలో తొలి వ్యాక్సిన్ను మహిళా హెల్త్ వర్కర్ పుష్పకుమారి వేయించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. వ్యాక్సిన్ కారణంగా ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే, వెంటనే స్పందిచడానికి ఆరోగ్య సిబ్బందిని సిద్ధంగా ఉంచింది ప్రభుత్వం. ప్రతి కేంద్రం పరిధిలో ఆంబులెన్స్, సత్వర వైద్యం అందించడానికి వైద్య బృందాన్ని సిద్దంగా ఉంచారు.











