భారత క్రికెట్ జట్టు కెప్టెన్ల లో ఎవరికి వారిదే ప్రత్యేకమైన స్థానం. ఒక్కొక్కరిది ఒక్కొ శైలి. మిస్టర్ కూల్ ధోని కెప్టెన్సీ రిటైర్ మెంట్ తరువాత జట్టు పగ్గాలు చేజిక్కించుకొని తన వ్యూహలతో ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ జట్టు స్థానాన్ని ముందుకు తీసుకుని వెళ్లడంలో కోహ్లిది ఓ ప్రత్యేకమైన శైలి.
ఈ రోజు విరాట్ కోహ్లి పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. సాక్షాత్తు క్రికెట్ దేవుడు సచిన్ తెందూల్కర్ నే నా తరువాత అంతటి గొప్ప ఆటగాడు విరాట్ కోహ్లినే అన్నాడు అంటే కోహ్లి ఆట తీరు ఎలాంటిదో మనం తెలుసుకోవచ్చు. బరిలోకి దిగితే కనీసం 50 పరుగులు గ్యారంటీ బాదేస్తాడు. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆలవోకగా రికార్డులు బద్ధులు కొట్టేస్తాడు.
కోహ్లి ఇప్పటి వరకు భారత్ తరఫున 86 టెస్టులు, 248 వన్డేలు, 82 టీ20 లు ఆడాడు. అందులో ఎక్కువగా కోహ్లి ప్రాతినిధ్యం వహించినవే ఉన్నాయి. ఇందులో టెస్టుల్లో 7,240 , వన్డేల్లో 11,867 , టీ20లలో 2,749 పరుగులు చేసి రికార్డులు సృష్టించాడు.
తండ్రి మరణం..బ్యాటింగ్..
క్రికెట్ లోనికి వచ్చిన కొత్తలోనే కోహ్లి తండ్రి మరణించాడు. అయినప్పటికీ కోహ్లి జట్టుకు తన అవసరం ఉందని గుర్తించి బ్యాటింగ్ చేసి 90 పరుగులు సాధించాడు. అప్పుడే క్రికెట్ ప్రపంచంలో కోహ్లి పేరు మారుమ్రోగింది.
ఆస్ట్రేలియాలో జరిగిన 2009 ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్ లో ఇండియా విజయం సాధించటానికి కోహ్లినే కారకుడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కోహ్లి సెంచరీ కొట్టాడు. కేవలం 17 పరుగుల తేడాతో ఇండియా ఆ ఆటలో గెలుపొందింది. రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో సహా ఏడు మ్యాచ్ లలో మొత్తం 398 పరుగులతో కోహ్లి ఆ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు సాధించినవాడు అయ్యాడు.
కోహ్లి 2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడాడు. 2008 లో ఐపీఎల్ మొదటి సీజన్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ కోహ్లిని కొనుగోలు చేసింది. ఐపీఎల్ మొదటి సీజన్ లో కోహ్లి ప్రతిభ అసలు ఏమాత్రం బాగోలేదు. చాలా తక్కువ పరుగులు చేశాడు. కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. కానీ ఆనతి కాలంలోనే తన ప్రతిభకు మెరుగులు దిద్ది జట్టును ముందుకు పరుగులు పెట్టించాడు.
2008 లో ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్ లో వంద పరుగులు సాధించిన తర్వాతనే కోహ్లి జట్టుకు ఎంపికయ్యాడు. సచిన్, సెహ్వాగ్ ఇద్దరూ గాయపడిన తరువాత 2008 లో శ్రీలంకకతో ఆడిన ఐడియా కప్ లో కోహ్లి మొదటిసారి వన్ డే ఇంటర్ నేషనల్ లో అడుగుపెట్టాడు. మొదట తడబడినప్పటికీ, రెండో మ్యాచ్ లో కొంచెం మెరుగు పడి జట్టు విజయం సాధించడానికి కారణమయ్యాడు. కానీ జట్టులోకి సచిన్, సెహ్వాగ్, యువరాజ్ వంటి ఆటగాళ్లు తిరిగి ప్రవేశించడంతో కోహ్లికి ఆడే అవకాశం రాలేదు.
ప్రపంచ కప్ లో ఆట..
2011 ప్రపంచ కప్ భారత దేశానికి ఎంతో మధురమైనది అని తెలిసిందే. 1983 తరువాత మళ్లీ భారత్ ప్రపంచ కప్ ను సాధించలేక పోయింది. ఈ ప్రపంచ కప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో ఆడిన ప్రారంభ మ్యాచ్ లో కోహ్లి వంద పరుగులు చేసాడు. తన సహచరుడు వీరేందర్ సెహ్వగ్ తో కలిసి 203 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
అంతే కాకుండా ప్రపంచ్ కప్ లో ఆడిన మొదటి సారే వంద పరుగులు చేసిన మొదటి భారతీయుడు అయ్యాడు కోహ్లి. కానీ అదే ప్రపంచ కప్ లో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో ఇండియా ఆడిన ముఖ్యమైన మ్యాచ్ లలో కోహ్లి ఎక్కువ పరుగులు సాధించలేకపోయాడు.
వ్యక్తిగత జీవితం..
చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టంగా ఉండేవాడు. చదువుకునే రోజుల్లో ఒకసారి రాహుల్ ద్రవిడ్ తో కలిసే అవకాశం వచ్చినప్పుడు ఆయనతో ఫొటో దిగే సమయంలో ద్రవిడ్ వైపే చూస్తు ఉండిపోయాడు అంటే కోహ్లికి క్రికెట్ అంటే ఎంత పిచ్చో ఆ ఒక్క చిత్రంతోనే అర్థం అయిపోతుంది. అటువంటి కోహ్లి అనతి కాలంలోనే రాహుల్ తో కలిసి క్రికెట్ ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
ప్రేమాయణం..పెళ్లి..
కోహ్లి బాలీవుడ్ సినీ నటి అనుష్క శర్మను 2017లో ప్రేమ వివామం చేసుకున్నాడు. మరి కొద్ది రోజుల్లో కోహ్లి తండ్రి కాబోతున్నాడు. అన్ని విధాలుగా శుభాకాంక్షలు తెలుపుతూ మరోసారి కోహ్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.











