జగన్ సర్కారు ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రగతిని తిరోగమనం పాలు చేసిన సంగతి తెలిసిందే. కానీ, తాము ఏపీని దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దామని వైసీపీ పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు. అందుకోసం వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని అడ్వర్టైజ్ మెంట్లకు ఖర్చు చేస్తుంటారు. అందులోనూ సొంత మీడియా సంస్థ సాక్షికి అధిక మొత్తంలో ప్రభుత్వ ప్రకటనలు దక్కుతుంటాయి. ఇలా వైసీపీ రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసం లేనివి ఉన్నట్లుగా చెబుతూ.. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రింట్, టీవీ, డిజిటల్ మీడియానే కాకుండా హోర్డింగుల ద్వారా భారీగా అడ్వర్టైజ్ మెంట్లు ఇస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
దీనిపై విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం ఇకపై జారీ చేసే ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకు లోబడి ఉండాల్సిందేనంటూ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఆ పిల్ లో ప్రతివాదిగా సీఎం జగన్ మోహన్ రెడ్డే ఉన్నారు. దీంతో ఆయనకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంకా సీఎస్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కాగ్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్, వైసీపీ ప్రధాన కార్యదర్శి, జగతి పబ్లికేషన్స్ ఎండీ, ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ ఎండీ, విశాఖలోని సీబీఐ ఎస్పీ, ఢిల్లీలోని సీసీఆర్జీఏ (ప్రభుత్వ ప్రకటనల్లో కంటెంట్ రెగ్యులేషన్ కమిటీ) కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ వేయాలని విచారణను మార్చి 6కి వాయిదా వేస్తూ.. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019 నాటి నుంచి దాదాపు ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో అడ్వర్టైజ్ మెంట్ల కోసం ఖర్చు పెడుతూ ఉంది. ఆ మొత్తమే రోజుకు రూ.కోట్లలో ఉంటుందని అంచనా. ఇలా మితిమీరి ప్రకటనలు ఇవ్వడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకం అంటూ బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం వేశారు. ప్రభుత్వం ఖర్చు చేసిన సొమ్మును వైసీపీ పార్టీ నుంచే తిరిగి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఇలా అడ్డగోలుగా అడ్వర్టైజ్ మెంట్లు జారీ చేయడంపై పూర్తి వివరాలు రాబట్టాలని.. అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలని కోర్టును అభ్యర్థించారు. ముఖ్యంగా జగన్ సొంత మీడియా జగతి పబ్లికేషన్స్కు ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోర్టును పిటిషనర్ కోరారు.
ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడంలో కూడా తాము ఏం చేశామో చెప్పుకోవడం ఓ పద్ధతి. అది కాకుండా.. ప్రతిపక్షం గతంలో అధికారం ఉన్నప్పుడు ఏం చేసిందో అది ప్రకటనల ద్వారా ఇవ్వొద్దని నిబంధనల్లో ఉంది. కానీ, వైసీపీ ప్రభుత్వం తాము ఏం చేశారో చెప్పకుండా.. విపక్షంపై దుమ్మెత్తిపోసే ప్రకటనలు ఇస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కోట్లలో ప్రజాధనం ఖర్చు చేసి గత ప్రభుత్వాన్ని మరింత దిగజార్చడానికి ప్రకటనలు ఇస్తుందని కోర్టుకు తెలిపారు. పైగా ఆ ప్రకటనలు ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠ పెంచేవిగా ఉంటున్నాయని పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ధర్మాసనం ప్రతివాదుల్లో ఒకరైన జగన్ కు కూడా నోటీసులు జారీ చేసింది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది