ఈ ఏడాది ఐపీఎల్లో కూడా పంజాబ్ దశ మారలేదు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఒక్క దానిలో మాత్రమే గెలిచింది. వరుస పరాజయాలతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. పంజాబ్ ప్లే ఆఫ్స్కు చేరుకోవాలంటే ఇంకా మిగిలిన 9 మ్యాచ్ల్లో కనీసం ఏడు గెలవాలి. ఈ నేపథ్యంలో రాహుల్ సేన గురువారం జరగబోయే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడుతోంది.
హైదరాబాద్ టీమ్ ఈ సీజన్లో నిలకడ లేమితో బాధపడుతోంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో రెండింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇక, కీలక ఆటగాళ్లు గాయల బారిన పడడం హైదరాబాద్ టీమ్ను బాగా ఇబ్బందిపెడుతోంది. పంజాబ్తో జరుగబోయే మ్యాచ్లో విజయం సాధిస్తే హైదరాబాద్ టీమ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకుతుంది. మరి, గురవారం సాయంత్రం 7:30 గంటలకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగబోయే ఈ మ్యాచ్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
హైదరాబాద్ టీమ్ బలాలు
ఆరంభంలో తడబడిన హైదరాబాద్ టీమ్ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. వరుసగా రెండు విజయాలు సాధించింది. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా మెరుగైన ప్రదర్శనే చేసింది. వార్నర్, బెయిర్ స్టో, మనీష్ పాండే, విలియమ్సన్తో కూడిన టాపార్డర్ బలంగా కనబడుతోంది. బౌలింగ్లో రషీద్ ఖాన్, సందీప్ శర్మ ఆకట్టుకుంటున్నారు. కెప్టెన్ వార్నర్ హైదరాబాద్ టీమ్కు ప్రధాన ఆయుధం. అతను పూర్తి టచ్లోకి రావడం హైదరాబాద్కు కొండంత బలాన్నిస్తోంది. యువ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ ఆకట్టుకుంటున్నాడు.
బలహీనతలు
నిలకడ లేమి హైదరాబాద్ ప్రధాన సమస్యగా మారింది. ఆటగాళ్లు స్థిరంగా రాణించలేకపోతున్నారు. విలియమ్సన్ తర్వాత బ్యాటింగ్లో బాధ్యత తీసుకునేవారు కరువయ్యారు. మిడిలార్డర్ చాలా బలహీనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మెరుగైన ఆల్ రౌండర్లు లేకపోవడం హైదరాబాద్ను వేధిస్తోంది. స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా గత మ్యాచ్కు దూరమయ్యాడు. భువి లేకపోవడంతో హైదరాబాద్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనబడుతోంది. ఈ మ్యాచ్కు కూడా భువి అందుబాటులో ఉండే అవకాశాలు కనబడడం లేదు.
హైదరాబాద్ జట్టు (అంచనా)
డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, నటరాజన్.
పంజాబ్ జట్టు బలాలు
పంజాబ్ టీమ్ను ఈ సీజన్లో దురదృష్టం వెంటాడుతోంది. గెలవాల్సిన మ్యాచ్ల్లో కూడా ఓడిపోతోంది. కేఎల్ రాహుల్, మాయంక్ అగర్వాల్, మ్యాక్స్వెల్, నికోలస్ పూరన్, జోర్డాన్, షమీ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు టీమ్లో ఉన్నారు. అందరూ ఫామ్లోనే ఉన్నారు. ఓ భారీ విజయం పంజాబ్ దశను మారుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. హైదరాబాద్తో మ్యాచ్లో క్రిస్ గేల్కు స్థానం కల్పించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. గేల్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ రాత మారుస్తాడేమో చూడాలి.
బలహీనతలు
ఎంత మంది స్టార్ ఆటగాళ్లున్నా అందరూ కలిసికట్టుగా రాణించలేకపోవడమే పంజాబ్ ప్రధాన సమస్యగా మారుతోంది. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొలేక కీలక సమయాల్లో చేతులెత్తేస్తోంది. కేఎల్ రాహుల్ మీదే టీమ్ ఎక్కువగా ఆధారపడుతోంది. క్రిస్ జోర్డాన్, హర్పీత్ బ్రార్ వరుసగా విఫలమవుతున్నారు. అలాగే చివరి ఓవర్లలో భారీగా పరుగులు ఇచ్చేస్తుండడం పంజాబ్ వైఫల్యానికి మరో కారణం. ముంబైతో జరిగిన మ్యాచ్లో చివరి ఆరు ఓవర్లలో పంజాబ్ బౌలర్లు ఏకంగా 104 పరుగలు ఇచ్చేశారు. ఇక, చెన్నైతో జరిగిన మ్యాచ్లో ఒక్క విక్కెట్టు కూడా తీయలేకపోయారు. బౌలింగ్ విభాగం గాడిన పడకపోతే పంజాబ్కు మరిన్ని అపజయాలు తప్పవు.
పంజాబ్ టీమ్ (అంచనా)
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, మన్దీప్ సింగ్, నికోలస్ పూరన్, మ్యాక్స్వెల్, సర్ఫరాజ్ ఖాన్, క్రిస్ జోర్డాన్/క్రిస్ గేల్, మురుగన్ అశ్విన్, రవి భిష్ణోయ్, షమీ, కాట్రెల్.
మ్యాచ్ ఫేవరెట్
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు పంజాబ్పై హైదరాబాద్ టీమ్దే ఆధిపత్యం. ఇప్పటివరకు రెండు టీమ్ల మధ్య 14 మ్యాచ్లు జరిగితే హైదరాబాద్ 10సార్లు గెలుపొందింది. పంజాబ్ కేవలం 4 విజయాలను మాత్రమే తన ఖాతాలో వేసుకుంది. ఈ సారి కూడా పంజాబ్ కంటే హైదరాబాద్ టీమే బలంగా ఉంది. అయితే వరుస పరాజయాలతో సతమతమవుతున్న పంజాబ్ టీమ్ ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని కృత నిశ్చయంతో ఉంది. భువి లేని హైదరాబాద్ బౌలింగ్ విభాగంపై ఎటాక్ చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. మరి, ఏమి జరుగుతుందో చూడాలి.











