బిహార్ రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. అక్కడ 243 సీట్లను జేడీయూ 122, బీజేపీ 121 గా పంచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కూటమితోనే సంబంధం లేకుండా తాము పోటీచేస్తామని.. రాం విలాస్ పాశ్వాన్ కు చెందిన ఎల్జేపీ ప్రకటించింది. ఇప్పుడు బీజేపీ నాయకులు, మాజీలు కొందరు పాశ్వాన్ పార్టీలో చేరిపోతున్నారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? బీజేపీలో టికెట్ దక్కకపోయినందువల్ల, పాశ్వాన్ పార్టీని ఆశ్రయిస్తున్నట్టుగా అది పైకి కనిపిస్తుంది గానీ.. వాస్తవంలో బీజేపీ సూచన మేరకే ‘ప్రస్తుతానికి’ ఇంకో పార్టీనుంచి రంగంలోకి దిగడానికి వారు ఇలా చేస్తున్నారని అనిపిస్తోంది.
అసలే.. సీఎం పీఠాన్ని చేజిక్కించుకోవడానికి… ఎల్జేపీని కూటమి బయటినుంచి పోటీచేయించేలా బీజేపీ వక్ర రాజకీయం నడుపుతోందని కొన్ని వాదనలు ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం బుధవారం- ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా.. సీఎం పీఠం మీద నితీశ్ కుమార్ మాత్రమే ఉంటారని ప్రకటించింది. ఆ రకంగా తాము ప్రజలకు క్లారిటీ ఇచ్చాం అనుకుంది. తద్వారా.. రాం విలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ దూకుడుకు అడ్డుకట్ట వేసినట్టు కూడా బిల్డప్ ఇచ్చింది.
ఈలోగా బీజేపీ నాయకుడు, సుదీర్ఘ కాలంగా ఆరెస్సెస్ కార్యకర్త కూడా అయిన రాజేంద్ర సింగ్ బీజేపీని వీడి, చిరాగ్ పాశ్వాన్ ను కలిసి ఎల్జేపీలో చేరారు. రాజేంద్ర సింగ్ దినారా నియోజకవర్గం నుంచి పోటీచేయాలని అనుకున్నారు. అయితే ఆ సీటును పొత్తుల్లో భాగంగా జేడీయూకు కేటాయించాల్సి రావడంతో.. ఆయన బీజేపీపై తిరుగుబాటు చేసి, ఎల్జేపీలో చేరారు. ఒక్కరోజు గడవకముందే.. అదే టెక్నిక్ మళ్లీ మరొకరు వాడారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉన్న బీజేపీ నాయకురాలు ఉషా విద్యార్థి, ఎల్జేపీలో చేరారు. ఆమె పాలిగంజ్ నియోజకవర్గం టికెట్ ఆశించారు. అయితే పొత్తుల్లో భాగంగా అది కూడా జేడీయూకు వెళ్లింది. బీజేపీలో ఇక అవకాశం లేదు గనుక.. ఆమె ఎల్జేపీలో చేరారు.
ఇప్పటికే, ఫలితాల తర్వాత.. బీజేపీ సీఎం పీఠం మీదికి రావడానికి తాము తోడ్పాటు అందిస్తామని చిరాగ్ పాశ్వాన్ ప్రకటించి కొన్ని అనుమానాలకు బీజం వేశారు. ఇప్పుడు బీజేపీ నాయకులు, మాజీలు.. తిరుగుబాటు అనే ముసుగులో ఎల్జేపీలో చేరి.. అక్కడినుంచి తిరిగి జేడీయూ మీదనే పోటీకి దిగడం అంటే.. దీనిని ఏమనుకోవాలి?
బీజేపీ తమ నేతలను ఎల్జేపీ టికెట్ మీద బరిలోకి దించి.. ఆయా ప్రాంతాల్లో జేడీయూను ఓడించి.. ఫలితాల సమయానికి ఏదో ఒకరీతిగా.. సీట్ల సంఖ్య పెంచుకోవాలని చూస్తోందని ఎవ్వరికైనా అర్థమవుతుంది. అదే సమయంలో.. అధికారానికి అవసరమైన కనీసమెజారిటీ కంటె… కొన్ని సీట్లు కూటమికి తక్కువ పడితే గనుక.. బీజేపీ సీఎం సీటుపై ఉండేట్లయితే మాత్రమే.. తాము మద్దతిస్తామంటూ.. ఎల్జేపీ, ఆ పార్టీలోని బీజేపీ కరడుకట్టిన నాయకులు పట్టుపట్టే అవకాశం ఉంది. అందుకే బీజేపీ వక్ర రాజకీయం నడిపిస్తున్నదని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.