తమిళనాడులో రానున్న కాలంలో రాజకీయ యుద్ధం మొదలు కానుందా..తొలిసారిగా సీఎం అయిన స్టాలిన్ కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ –అమిత్ షాలను ఢీ కొట్టేందుకు రెఢీ అయ్యారా అనే ప్రశ్న రాజకీయవర్గాల్లో తలెత్తుతోంది.ఇందుకు కారణం కూడా ఉంది.గతంలో అమిత్ షాని అరెస్టు చేసిన IPS అధికారి..ఇప్పుడు రాష్ట్ర DGPగా నియమిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కుందుస్వామి CBI IGగా ఉన్న సమయంలో..
తమిళనాడు కేడర్కు చెందిన పి.కుందుస్వామి గతంలో సీబీఐలో పని చేశారు.ఆయన CBI ఇన్స్పెక్టర్ జనరల్ (IG)గా ఉన్న సమయంలో అమిత్ షా గుజరాత్ హోం మంత్రిగా ఉన్నారు.అదే సమయంలో సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసులో సీబీఐ విచారణ జరిపింది.ఈ కేసులో పి.కుందుస్వామి, ఒరిస్సా కేడర్కు చెందిన సీబీఐలో డీఐడీ అమితాబ్ ఠాకూర్తో కలసి విచారణ జరిపి అమిత్ షా అరెస్టు చేశారు.తరువాతి కాలంలో అమిత్ షాపై నమోదైన అభియోగాలను న్యాయస్థానం కొట్టివేసింది.అయితే అప్పట్లో అమిత్ షాని అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనమైంది.ఇక 2007లో బ్రిటన్ యువతిపై అత్యాచారం,హత్య కేసు దర్యాప్తు చేసిన కుందుస్వామి.. గతంలో విద్యుదుత్పత్తి సంస్థ SNC-Lavalin పై నమోదైన ఆర్థిక కుంభకోణంపైనా విచారణాధికారిగా వ్యవహించారు.అప్పట్లో విద్యుత్తు శాఖ మంత్రిగా ఉన్న,ప్రస్తుతం కేరళ సీఎంగా ఉన్న పినరయి విజయన్పై కూడా ఆరోపణలు వచ్చాయి.
తమిళనాడు విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ చీఫ్గా, డీజీపీగా..
తాజాగా తమిళనాడు ప్రభుత్వం కుందుస్వామిని విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ చీఫ్గా,డీజీపీగా తమిళనాడు ప్రభుత్వం నియమించింది. డీఎంకే ఎన్నికల ప్రచారంలోనూ ఇటీవలి వరకు అధికారంలో ఉన్న AIADMK ప్రభుత్వంపై,సీఎం పళనిస్వామిపై పలు అవినీతి ఆరోపణలు చేసింది. తాము అధికారంలోకి వస్తే వాటిపై విచారణ చేయిస్తామని కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో కుందుస్వామి నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.అదే సమయంలో AIADMKతో BJP పొత్తు ఉన్న నేపథ్యంలోనూ బీజేపీకి పరోక్ష హెచ్చరికగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి
అమ్మ క్యాంటీన్లను కొనసాగిస్తామంటూ..
తొలిసారిగా సీఎం బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్ గతంలో రాష్ట్రంలో AIADMK ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్ లను కొనసాగిస్తామని ప్రకటించడంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అదే సమయంలో తాజాగా తీసుకున్న రాష్ట్రంలో AIADMK-BJP కూటమి అధికారంలో ఉన్న సమయంలో జరిగిన పథకాల అమలు,అవినీతి ఆరోపణలపై విచారణ జరపడం ఖాయంగా కనిపిస్తోంది.కుందుస్వామి నియామకంతోపాటు మరో అధికారికి కూడా కీలక బాధ్యతలు అప్పజెప్పింది. కోయంబత్తూరు పేలుళ్లకు కారణంగా ఆరోపణలు వచ్చిన అల్ ఉమ్మ సంస్థకి చెందిన ఇమామ్ అలీని, అతడి అనుచరులను పట్టుకోవడంలో సాహాసం ప్రదర్శించిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి షకీల్ అక్తర్ను క్రైం, సీఐడీ చీఫ్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలు కీలక కేసులను దర్యాప్తు చేసిన షకీల్ అహ్మద్కు Z కేటగిరీ భద్రత ఉంది.2014లో రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది.తాజా బదిలీలతో స్టాలిన్ ప్రభుత్వం దూకుడుగా వెళ్లనుందనే అంచనాలు మొదలయ్యాయి.కాగా తమిళనాడులో రానున్న కాలంలో పలువురు ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేయనున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
బీజేపీ అలెర్ట్..
ఓవైపు పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ నాయకులపై దాడులు పెరిగాయన్న ఆరోపణలున్నాయి.ఇందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది.ఎన్నికల సంఘం నియమించిన అధికారి డీజీపీగా ఉన్నారని,తమ ప్రమేయం లేదని చెబుతోంది.దీంతో పశ్చిమబెంగాల్లోని పలువురు నేతలకు ప్రత్యేక భద్రత కల్పించేందుకు కేంద్రం సిద్ధమైందన్న వార్తలు వస్తున్నాయి.అదే సమయంలో తమిళనాడులో జరుగుతున్న పరిణామాలపైనా బీజేపీ అలెర్ట్ అయిందని తెలుస్తోంది.తమ పార్టీకి చెందిన కీలక నేతలకు కొన్ని సూచనలు జారీ చేసినట్టు అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి.