ఔను… అక్కడ అబ్బాయి… ఇక్కడ అమ్మాయే. జీవితాలు ఇలా తిరగబడుతున్నాయేంటి?. . ఎస్… అక్కడ సుశాంత్… ఇక్కడ శ్రావణి… ఒకరు బాలీవుడ్ నటుడు, ఇంకొకరు తెలుగు సీరియల్ నటి.
మొన్నీమధ్యే ‘సీ యూ సూన్’ అనే మలయాళ సినిమా వచ్చింది. ఓ డేటింగ్ యాప్ లో ఓ అమ్మాయి పరిచయం కావడం… ఆ అమ్మాయి కోసం ఆ అబ్బాయి చిక్కుల్లో ఇరుక్కోవడం… ఇదీ కథ. అంతేగా మరి… ఇదేమన్నా మన ‘ప్రేమలేఖలు’ సినిమాలాంటి కాలమా… ‘రాశాను ప్రేమ లేఖలెన్నో’ అని పాడుకోడానికి? ఇక విషయానికి వస్తే సుశాంత్, శ్రావణి లాంటి మరణాలు మనకు ఎలాంటి గుణపాఠాలూ నేర్పటం లేదన్నది మాత్రం అర్థమవుతోంది. బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మరణం… ప్రస్తుతానికి అతని ప్రియురాలు రియాను ఊచలు లెక్కించేలా చేసింది… ఆమె మీద ఇప్పుడు ఎవరికీ ఏ దయా లేదు. ఇక్కడ శ్రావణి కథలోనూ ప్రస్తుతానికి డొంక కదులుతోంది. ఇంకా ఎన్ని తీగలు లాగాల్సి ఉంటుందో.
మహాత్ముడు అలా అన్నాడెందుకో?
ఆడది అర్ధరాత్రి తిరగ గలిగినప్పుడే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టని మహాత్మా గాంధీ అన్నాడు. అసలు ఆడది అర్ధరాత్రి తిరగాల్సిన అవసరం ఏమిటని మాత్రం ఆరోజు ఆయన్ని ఎవరూ ఏమీ అడగలేదు. అసలు భద్రత ఎవరికి కావాలి… అమ్మాయికా? అబ్బాయికా? ఎవరు ఎవరిని ఎక్స్ ప్లాయిట్ చేస్తున్నారు.. సెక్స్ ప్లాయిట్ చేయిస్తున్నారు?… ఈ ప్రశ్నలను భేతాళుడు అడిగినా విక్రమార్కుడు సమాధానం చెప్పలేడు. ఆడది గడప దాటితే ఏంజరుగుతుందో మనకు ‘రామాయణం’ చెప్పలేదూ… అయినా అర్ధ రాత్రి పబ్బులకు వెళ్లడం మానుతున్నామా? ఒకప్పుడు ఆడమగా కలుసుకోడానికి ఏ దారీ ఉండేది కాదు… ఇప్పుడన్నీ దారులే. అబ్బాయి ఈ గ్రహం మీద ఉండి అమ్మాయి వేరే గ్రహం మీద ఉన్నా దగ్గర చేసే ఫెసిలిటీ వచ్చేసింది మరి.

సోషల్ గా నాలుగు మాటలు చెప్పాలన్నా కంఠశోషే…
ఈ ప్రేమ వ్యవహారాల గురించి ‘సోషల్’ గా నాలుగు మాటలు చెప్పాలి మరి. మానవ బంధాలన్నీ సోషల్ బంధాలే అయినప్పుడు…. వారి మధ్య అనుబంధానికి ఆస్కారమెక్కడుంటుంది చెప్పండి. మన ఫేసేమిటో ఎవరికీ తెలియకుండానే అమ్మాయి పడిపోతుంది… లేదా అబ్బాయి పడిపోతాడు. ఆ ఫేస్ బుక్ పరిచయంలో ఎవరు ఎంతగా బుక్కయిపోతారో అసలే తెలియదు. ఆమె చేసిన ట్వీటు ఆ క్షణంలో అతనికి ఎంతో స్వీటుగా ఉన్నట్టు అనిపించవచ్చు. అది ఎంత ఘాటో ఆ తర్వాతగానీ తెలియదు.
టిప్ టాప్ గా తయారై టిక్ టాక్ లు చేస్తే చాలు ఏ అమ్మాయి పడిపోతుందో ఏ అబ్బాయి బోల్తాపడతాడో తెలియదు. ఇద్దరి మధ్యా జరిగే ఈ ‘షేర్’ ‘ఛాట్’ ల గురించి తల్లిదండ్రులు కూడా ప్రశ్నించరు. ఇదంతా మన ఫేటు అనుకోవాలసిందేనేమో. ఆత్రేయ మనసు మీద అంతగా మనసు పారేసుకున్నారుగానీ ఇప్పుడెవరికీ ఆ మనసుతో పనిలేదు… ఇక దాని గతి సంగతి దేవుడెరుగు. అమ్మాయి, అబ్బాయిల అలవాట్లు… దురలవాట్లతో పనిలేదు… డేటింగ్ యాప్ లు బోలెడు వచ్చేశాయి… మనిషి లైఫ్ లో గ్యాప్ పెంచేశాయి.
సెల్ దగ్గరికే వద్దాం…
మనిషి జాతకం చూడాలంటే జాతక చక్రంతో పనిలేదు. అతని సెల్ చూస్తే అతని జాతకం మొత్తం తెలిసిపోయే రోజులొచ్చాయి. దానికి సెల్ అని ఏ ముహూర్తాన పేరు పెట్టారోగాని చివరికి అతన్ని లేదా ఆమెని సెల్ కే పంపించేస్తోంది. మన కాల్స్ ను అవతలి వ్యక్తి రికార్డు చేస్తున్నారా? మన వాట్సాప్ డేటా స్క్రీన్ షాట్ లుగా మారిపోతోందా?… ఇలాంటివేవీ వారికి పట్టవు. అందులో డిలిట్ చేసేశాం కదా అనుకోవచ్చు. దానికీ ఓ బ్యాకప్ ఉంటుందని, అది మన జీవితానికి పేకప్ చెప్పేస్తుందని మాత్రం అర్థం కాదు.
సుశాంత్ కేసులో ఇదే జరిగింది. శ్రావణి కేసులోనూ అదే జరుగుతోంది. ఇక్కడ తప్పెవరిది.. అక్కడ అబ్బాయిదా… ఇక్కడ అమ్మాయిదా.. ఆలోచించించండి. ఎక్కడ హత్య లేదా ఆత్మహత్య జరిగినా సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కు మాత్రం చేతినిండా పనే. దర్యాప్తు కూడా సెల్ నుంచే ప్రారంభమవుతోంది. సుశాంత్ కేసులో వాట్సాప్ ఛాటే డ్రగ్స్ వ్యవహారాన్ని తిరగదోడింది. శ్రావణి కేసులోనూ ఆ టిక్ టాక్ పోరగాడు కాల్ రికార్డ్ డేటాతో నిండా దొరికిపోయాడు.

తల్లిదండ్రుల బాధ్యత ఎంత?
భారతీయ సంస్కృతి ఎటుపోతోందో అర్థంగావడం లేదు. ఎన్నో మరణాలు మరెన్నో దారుణాలు జరుగుతుంటే తల్లిదండ్రలు ఏమీపట్టనట్టే వ్యవహరిస్తున్నారా అనుకోవాల్సి వస్తోంది. పిల్లలు వారి మాట వినడం లేదా తల్లిదండ్రులే పిల్లల మాట వినాల్సి వస్తోందో ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సక్రమంగా కాపురాలు కాస్తా అక్రమ కాపురాలుగా మారుతున్నాయి. తప్పు వ్యవస్థదా వ్యక్తులదా అనే పంచాయితీలకు సమయం కాదిది.
ఒక్కసారి ఈ తరహా కేసు పోలీసుల చేతికి వెళితే ఒక్క డొంకే కాదు మరెన్నో డొంకలు కదిలినా ఎవరికీ తిక్క కుదరడం లేదు. అందుకే ఎక్కడో ఉన్న అబ్బాయిలు కూడా మరెక్కడో ఉన్న అమ్మాయిలతో చెట్టపట్టాలేసుకు తిరుగుతున్నారు. సుశాంత్, శ్రావణి లాంటి వారి కథలు మాత్రం ఎప్పటికీ కంచికి చేరలేవు. లవ్ బ్యూటిఫుల్లో, లైఫ్ బ్యూటిఫుల్లో అర్థమయ్యేసరికి సెల్ లోనే వారి జీవితం గడిచిపోతుంది.
– హేమసుందర్ పామర్తి











