పోలవరం ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 2014లో యూపీఏ 2 ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. కానీ తెలంగాణలోని ఐదు మండలాలను ఏపీలో విలీనం చేయడం మాత్రం మరచిపోయింది. 2014లో విభజన తరవాత ఏపీలో మొదటిసారి టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐదుమండలాలను విలీనం చేస్తేనే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని కేంద్రాన్ని హెచ్చరించడంతో కేంద్రం దిగివచ్చి హుటాహుటిన తెలంగాణలోని ఐదు మండలాలను ఏపీలో విలీనం చేశారు. దీంతో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతమంతా ఏపీలో విలీనమైంది. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగాయని అందరూ భావించారు. టీడీపీ ప్రభుత్వం పోలవరం పనులు కూడా పరుగులు పెట్టించింది. 71 శాతం ప్రధాన ప్రాజెక్టు పనులు పూర్తి చేయించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతోనే రివర్స్ టెండరింగ్ పేరుతో ఏడాది పాటు పనులు నిలిపేశారు. తాజాగా పోలవరం అంచనా వ్యయాన్ని కేంద్రం రూ.20,398 కోట్లకు కుదించడంతో ఇక ఏపీ ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గించే కుట్రకు తెరలేపిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇస్తారా?
తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కు స్నేహహస్తం అందించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటోన్న నిర్ణయాలు అనేక అనుమానాలకు తావిస్తోంది. నవంబరు 11వ తేదీన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పోలవరం ఎత్తు 41 మీటర్లకు తగ్గిస్తున్నట్టు అధికారికంగా ఎక్కడా చెప్పకపోయినా, అసలు పోలవరం ప్రాజెక్టు 41 మీటర్లే అన్న విధంగా సమీక్ష జరిగింది. 41 మీటర్లకు తగ్గించి పోలవరం ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచనకు ఏపీ ప్రభుత్వం వచ్చినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక పోలవరం ఎత్తు 45 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గిస్తే ముంపు కూడా 80 శాతం తగ్గిపోతుంది. దీంతో తెలంగాణ నుంచి ఏపీలో విలీనం చేసిన ఐదు మండలాల్లో ముంపు 80 శాతంపైగా తగ్గుతుంది. ఇలా పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి మరలా ఐదు మండలాలను తెలంగాణకు గిఫ్ట్ గా ఇస్తారా అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఆ మండలాలు వదిలేసుకుంటారా?
పోలవరం ఎత్తు తగ్గిస్తే తెలంగాణ నుంచి తీసుకున్న ఐదు మండలాలతోపాటు, సీలేరు ప్రాజెక్టును తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసే అవకాశం ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలోని కుకునూరు, వేలేరుపాడు, తూర్పుగోదావరి జిల్లాలోని కోనవరం, చింతూరు, వర రామచంద్రాపురం మండలాలను రాష్ట్రాల పునర్విభజన తరవాత ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేశారు. ఇక పోలవరం ఎత్తు తగ్గిస్తే ఆ మండలాలపై ఏపీ పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. కేవలం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పట్టుపట్టి ఆ మండలాలు ఏపీలో కలిపేలా పోరాటం చేసి సఫలం అయ్యారు. పోలవరం ప్రాజెక్టు ఏపీలో, ముంపు ప్రాంతం తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తికాదని కేంద్రాన్ని ఒప్పించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఐదు మండలాలను ఏపీలో విలీనం చేయించారు. తాజాగా ఏపీలోని వైసీపీ అధినేత తీరు చూస్తుంటే పోలవరం ఎత్తు తగ్గించి ఐదు మండలాలను తెలంగాణకు గిఫ్ట్ గా ఇచ్చేలా ఉన్నాడని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం తగ్గినా ఊరుకునేది లేదని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా పోలవరం ప్రాజెక్టు చుట్టూ ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయనడంలో సందేహం లేదు.