ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.20,398 కోట్లకు పరిమితం చేయడంపై వైసీపీ ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరాన్ని చంద్రబాబునాయుడు ఏటీఎంలా వాడుకుంటున్నాడని, పోలవరం ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు చాలని, అప్పట్లో కేంద్రానికి లేఖలు రాసిన జగన్మోహన్ రెడ్డిని ఆ లేఖలే ఇరికించాయి. తాజాగా పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55 వేల కోట్లకు పెంచాలంటూ రాష్ట్ర మంత్రులు మూడు సార్లు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలసి వచ్చినా ఏ మాత్రం ఫలితం దక్కలేదు. ఏపీ సీఎం స్వయంగా ప్రధాని మోడీకి లేఖ రాసినా కదలిక రాలేదు. ఇక పోలవరం వ్యవహారం లేఖలతో తెగేలా లేదని, మరో వైపు ఏపీలో ప్రభుత్వ పరువు పోతోందని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరారని తెలుస్తోంది. గత నెలలో ఓసారి ఏపీ సీఎం ప్రధానిని కలిశారు. అయితే ఆయన ఎందుకు కలిసిందీ కనీసం మీడియాకు బ్రీఫింగ్ కూడా ఇవ్వలేదు. దీంతో మీడియాలో అనేక కథనాలు వండివార్చారు. తాజాగా ఏపీ సీఎం పోలవరం ప్రాజెక్టుపై ప్రధానితో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారనే సంకేతాలు మాత్రం ఇచ్చారు.
ఎలా సమర్థించుకుంటారు?
గతంలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం వ్యయాన్ని రూ.20 కోట్లకు తగ్గించాలని లేఖలు రాసిన నేతలు, మరల పోలవరం వ్యయాన్ని రూ.55 వేల కోట్లకు పెంచాలని కేంద్రాన్ని ఎలా అడుగుతారు. గతంలో వారిచ్చిన లేఖలు, వారి ముందు పెడితే ఏం సమాధానం చెబుతారు అనే అనుమానాలు రాకమానవు. పోలవరం ప్రాజెక్టు పేరుతో గతంలో చంద్రబాబునాయుడు దోపిడీ చేస్తున్నాడనే ఉద్దేశంతోనే లేఖలు రాశామని, అందులో ఎలాంటి దురుద్దేశం లేదని సమర్థించుకోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఏ విషయంలోనూ పేవర్గా చేసిన దాఖలాలు లేవు. పోలవరం అంచనాలు రూ.55 వేల కోట్లకు పెంచే విషయంలో ప్రధాని మోడీ స్పష్టమైన హామీ ఇస్తారన్న నమ్మకం లేదు. అయినా ఏపీ ప్రజలు పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహాన్ని కొంత మేర తగ్గించేందుకే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రధాని మోడీని కలవాలని నిర్ణయించారని సమాచారం. పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం కేంద్రంతో పోరాటం చేస్తోందని, చివరకు ప్రధానిని కూడా కలసి సమస్య వివరించామని చెప్పుకోవడానికి పనికివస్తుందనే మోడీ అపాయింట్ మెంట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
పోలవరం ప్రాజెక్టా, బ్యారేజీనా..
పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41 మీటర్లకు తగ్గిస్తే ముంపు భారీగా తగ్గడంతో పాటు పరిహారం, పునరావాసం ఖర్చులు రూ.26 వేల కోట్లు తగ్గుతాయని పోలవరం అథారిటీ అంచనా వేసింది. గత వారం హైదరాబాద్లో జరిగిన పోలవరం అథారిటీ సమావేశంలోనూ ఈ అంశాన్ని లేవనెత్తారని తెలుస్తోంది. ఇదే జరిగితే…అంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41 మీటర్లకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయితే మాత్రం ఏపీ ప్రజలకు తీరని అన్యాయం చేసినట్టే. 50 మీటర్ల ఎత్తుతో పోలవరం నిర్మిస్తే 196 టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యం కలుగుతుంది. ఈ ఎత్తును 41 మీటర్లకు తగ్గిస్తే నిల్వ సామర్థ్యం కేవలం 46 టీఎంసీలు మాత్రమే. అంటే పోలవరం ప్రాజెక్టును, పోలవరం బ్యారేజీగా మార్చే కుట్రకు బీజం పడినట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే తెలుగువారు మరోసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.