ఎన్నైనా తిట్టుకోండి.. ఎంతైనా కొట్టుకోండి. మీలో మీరు కొట్టుకొని చావాలే తప్పించి.. బయటోడికి మాత్రం అవకాశం ఇవ్వొద్దన్న మాట గతంలో వినిపించేది. ఇప్పుడు రాజకీయం రంగు.. రుచి.. వాసన.. లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు ప్రత్యర్థి మీద విమర్శలు.. ఆరోపణలు చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేవారు. తాము వేసే నిందలకు.. పూసే ఆరోపణల బురదకు.. సామాన్యుల ప్రయోజనాలు దెబ్బ తినకూడదన్న ముందుచూపు నేతల్లో కనిపించేది.
సామాన్యుల మేలు మరుస్తున్నారు
మారుతున్న కాలంతో పాటు రాజకీయ ప్రయోజనాల ముందు సామాన్యులకు కలిగే మేలు గురించి ఆలోచించటం మానేస్తున్నారు. ఎంతసేపటికి చేతికి అధికారం ఉండాలే తప్పించి మరింకేమీ అక్కర్లేదన్న భావన అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటి కల్చర్ను ప్రోత్సహిస్తే ఏం జరుగుతుందన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా ఏపీ రాజకీయాల్ని చెప్పక తప్పదు. తన రాజకీయ ప్రత్యర్థిని బద్నాం చేసేందుకు ఆరోపణల కత్తి దూసిన జగన్.. ఇప్పుడు అదే కత్తి కోట్లాది మంది ఆంధ్రుల ప్రయోజనాల్ని భారీగా దెబ్బ తీసేలా మారిందని చెప్పక తప్పదు. ఏపీ భవితను మార్చేసే శక్తి ఉన్న ప్రాజెక్టుగా పోలవరాన్ని అభివర్ణించేవారు. ప్రాజెక్టు పూర్తయితే ఏపీ ప్రజలు మరింత శక్తివంతులు అ వుతారని, లక్షలాది మంది రైతులకు ప్రయోజనకరంగా మారుతుందన్న విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు.
ప్రాజెక్టు చుట్టూ రాజకీయాలు
అలాంటప్పడు ఆ ప్రాజెక్టు చుట్టూ రాజకీయాల్ని తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా ఈ ప్రాజెక్టుతో రాజకీయ ప్రయోజనాన్ని ఆశించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనుకా ముందు చూసుకోకుండా చేసిన వ్యాఖ్యలు, ఆరోపణల విలువ రూ.25వేల కోట్లా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెరిగిన అంశంపై కేంద్రంలోని మోడీ సర్కారుపై మిత్రపక్షంగా ఒత్తిడి చేసే వారు. అయితే, పెరిగిన వ్యయాన్ని అవినీతి ఆరోపణల మరక అంటించటం ద్వారా రాజకీయ ఆటకు జగన్ తెర తీశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక నాటి మాటలు ఇప్పుడు ఏపీకి శాపాలుగా మారాయి. పోలవరం ప్రాజెక్టు తొలి అంచనా వ్యయం రూ.29వేల కోట్లు మాత్రమే. సుదీర్ఘకాలం పెండింగ్లో ఉండి, విభజన నేపథ్యంలో జాతీయ ప్రాజెక్టు హోదాను సొంతం చేసుకుంది. దీంతో ఈ ప్రాజెక్టు ఖర్చు మొత్తం బాధ్యత కేంద్రానిదే.
అన్న మాటలకు కట్టుబడగలరా?
ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచుతూ చేసిన నిర్ణయంఫై నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. బాబు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు సంధించారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారంటూ తప్పు పట్టారు. అంతేకాదు, పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వకుంటే మనమే కట్టుకోలేమా? అన్న పెద్ద మాటల్ని కూడా ఆయన వాడారు. ప్రాజెక్టు నిధుల కోసం కేంద్రం వద్ద ఎందుకు మోకరిల్లాలని ప్రశ్నించిన ఆయన.. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తాను గతంలో అన్న మాటలకు కట్టుబడగలరా? అన్నది ప్రశ్న. ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు భారాన్ని మోసే కనీస శక్తి కూడా లేదన్నది తెలిసిందే. ఇలాంటి సమయంలోనే కేంద్రం పోలవరం ప్రాజెక్టు అంచనాల్ని ఫైనల్ చేయటం, తొలి దశలోని అంచనాలకే తాము కట్టుబడి ఉంటామని, తర్వాత పెరిగిందని చెబుతున్న భారాన్ని తాము మోయలేమన్న విషయాన్నితేల్చేశాయి. దీంతో కేంద్రం వైఖరి ముఖ్యమంత్రి జగన్కు ఏ మాత్రం మింగుడుపడని పరిస్థితి.
అలా అని పెరిగిన వ్యయంపై గట్టిగా మాట్లాడాలంటే గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలు.. తొందరపాటుతో సంధించిన ఆరోపణాస్త్రాలు ఇప్పుడు ఆయన్ను ఇరకాటంలో పడేశాయి. పోలవరం నిధుల్ని దబాయించి మరీ కేంద్రం నుంచి తెచ్చుకునే సీన్ లేకపోవటం, ఒకవేళ ఆ ప్రయత్నం చేస్తే , గతంలో మీరే అన్నారు కదా? అన్న ప్రశ్న వస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇదంతా చూస్తే దూకుడు రాజకీయాలకు ఏపీ ప్రజలు భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తోందన్న భావన కలుగక మానదు. నాడు అదే పనిగా చంద్రబాబును ఉద్దేశించి అంచనాలు పెంపులో కాసుల కక్కుర్తి ఉందన్న జగన్ మాట.. నేడు ఏపీ రాష్ట్ర ప్రయోజనాల్ని దారుణంగా దెబ్బ తీస్తోందని చెప్పక తప్పదు.