కరువు వచ్చినప్పుడే నీటి విలువ తెలుస్తుంది. నీటి పారుదల ప్రాజెక్టుల ప్రాధాన్యం అందరికీ గుర్తుకొస్తుంది. కానీ విజన్ ఉన్న నాయకుడు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎంతో ముందుగానే.. ప్రాజెక్టులు పూర్తి చేసే ప్రణాళిక సిద్దం చేస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు అలాంటి ప్లాన్తో పని చేయడం వల్లనే.. ఈ ఎల్ నినో సీజన్లో రాష్ట్రంలో కొత్త సాగు నీటి పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి. బాబుగారు చేస్తున్న జలయజ్ఞం ఫలితంగా వెలిగొండ ప్రాజెక్టుతో పాటు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి.
సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి.. ఎంతో ఆర్భాటంగా.. భారీ ప్రచారంతో.. జలయజ్ఞం పేరుతో అనేక నీటి పారుదల ప్రాజెక్టులు ప్రారంభించారు. పోలవరం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వరకు ప్రతి పథకానికి మొబిలేజేషన్ అడ్వాన్సుల పేరుతో కాంట్రాక్టర్లకు వందలు, వేల కోట్లు కట్టబెట్టి.. కమిషన్లు కొట్టేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అన్ని నిధులు కేటాయించినా.. వైఎస్సార్ హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు పనిలోనూ పురోగతి కనిపించడం లేదు. మట్టి పనులు చేసి ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకోవడంతో పాటు తవ్విన మట్టిన అమ్ముకొని.. డబుల్ బెనిఫిట్ పొందారు. అందుకే వైఎస్సార్ చెప్పిన జలయజ్ఞానికి.. ధనయజ్ఞం అనే పేరు స్థిర పడిపోయింది.
2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు.. సీఎం చంద్రబాబు.. పోలవరం, హంద్రీనీవా, వెలుగొండ వంటి అనేక ముఖ్యమైన ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత సాగు నీటి రంగంలో పనులన్నీ అటకెక్కాయి. కనీసం ప్రాజెక్టుల నిర్వహణ కూడా పట్టించుకోకపోవడంతో గుండ్లకమ్మ, అన్నమయ్య వంటి ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయి. పోలవరం కట్టడం మా తరం కాదని వైసీపీ మంత్రి మీడియా ముందే చేతులెత్తేశారు. వెలుగొండ పనులన్నీ ఎక్కడివక్కడే వదిలేసి.. ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసిన జగన్ జనాల చెవుల్లో పూలు పెట్టాను అనుకున్నారు. కానీ తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాలతో ప్రజలు ఫూల్స్ కాదని స్పష్టమైంది.
మొదట్లో భారీ ప్రకటనలు.. తర్వాత ఫేక్ ప్రచారాలతో.. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన వైఎస్ అండ్ సన్స్.. అసలు నైజం జనానికి అర్ధం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. మరోవైపు సీఎం చంద్రబాబు పనిమీదే దృష్టి పెట్టి.. రాత్రి పగలు కష్టపడి.. అధికారులను కష్టపెట్టి ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ ఒక్కొక్కటే పూర్తి చేస్తూ.. అసలైన జలయజ్ఞం అంటే ఎలా ఉంటుందో చేతల్లో చేసి చూపిస్తున్నారు. ఈ కరువు కాలంలో బాబుగారి జలయజ్ఞం ఫలితాలు అందుబాటులోకి రావడం రాష్ట్ర ప్రజలకు వరంగా మారుతోంది.











