తెలంగాణ రాజకీయాల్లో ఈటల పేరు మార్మోగుతోంది. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా మెలిగే రాజేందర్పై భూ కుంభకోణం ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. అనూహ్యంగా అతడిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో రాజేందర్ కుటుంబం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈటల సతీమణి జమున, కుమారుడు నితిన్ హైకోర్టును ఆశ్రయించారు.
బలవంతపు చర్యలను అడ్డుకోండి..
జమున హేచరీస్ భూముల్లో అధికారులు చట్ట విరుద్ధంగా సర్వేలు చేశారని ఈటల కుటుంబ సభ్యులు హైకోర్టుకు విన్నవించారు. అనైతికంగా బోర్డులు ఏర్పాటు చేశారని, తక్షణమే వాటిని తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. తమ భూముల్లో అధికారులు జోక్యం చేసుకోకుండా చూడాలని, తమపై బలవంతపు చర్యలు తీసుకోకుండా డీజీపీ, విజిలెన్స్ డీజీ, మెదక్ కలెక్టర్ను ఆదేశించాలని విన్నవించారు.