ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు ప్రస్తుతం YSRCPలో ఉన్నారు. YSRCP అంటే… యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. రంగనాథ రాజు గతంలో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అయితేనేం.. వరి ఒక సోమరిపోతు వ్యవసాయం అని వ్యాఖ్యానించారు.. బయట ఎక్కడో ఏదో సమావేశంలో మాట్లాడిన మాటలు కాదు.. రైతులకు అండగా నిలిచేందుకు, నూతన వంగడాలను తెచ్చేందుకు ఏర్పాటు చేసిన కృషి విజ్ఞానకేంద్రంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. పక్కనే వ్యవసాయ మంత్రి కన్నబాబు కూడా ఉన్నారు. అయినా మంత్రి మాత్రం ఎవరూ ఊహించని విధంగా వ్యాఖ్యానించారు.
వరి సాగుకు రైతులు కష్టపడాల్సిన అవసరం లేదంటూ..
‘సోమరి పోతు వ్యవసాయం ఏదైనా ఉందంటే అది వరి సాగే. రైతులు కష్టపడాల్సిన అవసరం లేదు. అధికారులు వదిలితే కాల్వల ద్వారా నీళ్లు వస్తాయి. ట్రాక్టర్ వాడికి బాబూ ఆకుమడి దున్ను… అంటే వచ్చి దున్నుతాడు.బస్తా విత్తనాలు తెచ్చి కూలీలకు డబ్బులు ఇస్తే విత్తనాలు, ఎరువులు చల్లుతున్నారు. ఊడ్పులకూ అంతే! బస్తాకు ఇంత అని ఇస్తే సరిపోతుంది అని వ్యాఖ్యానించారు. ఈ మాటలతో కిసాన్మేళాలో పాల్గొన్న రైతులు, అధికారులు అంతా విస్తుపోయారు. ఇక రంగనాథ రాజు వ్యవసాయం ఇంత ఈజీగా చేస్తారా.. మాకు తెలియదే అని సోషల్ మీడియాలో కామెంట్లూ వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా ఈ వ్యాఖ్యలు నష్టం కలిగిస్తాయనుకున్నారో లేక సదరు మంత్రి స్వయంగా పునరాలోచించుకున్నారో తెలియదు..కాని క్షమాపణ చెప్పారు. తాను రైతు సంక్షేమం కోసమే మాట్లాడానని, తన ఉద్దేశం రైతులకు మేలు చేయాలనే కోణమేనని, ప్రభుత్వ పథకాలను భూ యజమానులే అనుభవిస్తున్నారని, కౌలు రైతులకు అందడం లేదన్న ఉద్దేశంతోనే మాట్లాడానని చెప్పారు. ఆ ఆవేదనతోనే అలా మాట్లాడాను తప్ప రైతులను కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే ఆ మాట వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు.
జరగాల్సిన డామేజీ జరిగింది
ఇక క్షమాపణ చెప్పినా..ఈ పాటికే జరగాల్సిన డామేజీ జరిగిపోయింది. వైసీపీ మంత్రుల్లో కొందరు మాట్లాడే మాటలు ఇప్పటికే చర్చనీయాంశం కాగా.. రైతుల గురించి చేసిన వ్యాఖ్యలు కూడా అదే స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. రైతుగా, రైస్ మిల్లర్ల సంఘ అధ్యక్షుడిగా ఉండి, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పిలిచే గోదావరి జిల్లాలో ఈ వ్యాఖ్యలు చేయడం పెద్దదుమారాన్నే రేపింది. అందులోనూ రైతులకు కొత్త వంగడాలను పరిచయం చేసిన, దేశ వ్యాప్తంగా పేరొందిన కృషి విజ్ఞాన కేంద్రం రజతోత్సవంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు పార్టీకి గట్టి డామేజీనే చేశాయని చెప్పవచ్చు. ఇదే సమావేశంలో కౌలు రైతుల ఇబ్బందులను ప్రస్తావించినా.. వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగింది.
టీడీపీకి ఆయుధంగా మారితే..
ఇప్పటి వరకు వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్నారని దశాబ్దాలుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ, ఇప్పుడు వైసీపీ, టీఆర్ఎస్ల హయాంలోనూ కొందరు నాయకులు విమర్శిస్తున్నారు. ఆధారాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. మనసులో మాట పుస్తకాన్ని మాత్రం వైసీపీ ప్రస్తావిస్తుంది. కాని ఎక్కడా ఆధారాలు చూపలేదు. ఇప్పుడు టీడీపీకి మరో ఆయుధం దొరికింది. వీడియో రికార్డులో సహా వైసీపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు దొరికాయి. వైసీపీ ఉన్నంతకాలం సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ వెన్నంటే ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పటివరకు తామే రైతులకు మేలు చేసే విధానాలు ప్రవేశపెట్టామని చెప్పడంతోపాటు టీడీపీని, చంద్రబాబును ఇరకాటంలో పెట్టేందుకు చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని విమర్శించే వైసీపీ ఇప్పుడు డిఫెన్స్లో పడిందని చెప్పవచ్చు. ఇప్పటికే తుపాన్ల సమయంలో పరిహారం విషయంలో జగన్ మాటమార్చిన వీడియోలను విడుదల చేస్తున్న టీడీపీ..రానున్న కాలంలో సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలను వదిలిపెట్టకపోవచ్చు. మొత్తం మీద ఏపీలో మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయనకే కాదు.. పార్టీకి కూడా నష్టం కలిగించనున్నాయని చెప్పవచ్చు.
Must Read ;- టీకాకు రూ.35వేల కోట్లు వృథా అన్న వైసీపీ ఎంపీ.. తెలివితక్కువతనమని టీడీపీ కౌంటర్











