(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
మున్సిపల్ ఎన్నికల పోలింగ్నకు రెండు రోజుల ముందు కేంద్రంలోని బీజేపీ బాంబు లాంటి లేఖ విడుదల చేయడంతో వైసీపీ నేతల్లో అసహనం పెరిగిపోయింది. ఈ ప్రభావం మహా విశాఖ గ్రేటర్ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళన ఆ నేతల్లో నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో నూరు శాతం పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం జరిగిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని, అవసరమైనప్పుడు సాయం కోరతామని స్పష్టం చేశామని, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేయడంతో ప్రజల్లో వైసిపి వ్యవహారశైలిపై అనుమానం మొదలైంది. దాని ప్రభావం బుధవారం పోలింగ్లో చూపుతుందని మెజారిటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మెజారిటీ సీట్లు గెలిచి తీరుతామన్న ధీమాతో ఉన్న అధికార పార్టీకి బీజేపీ షాక్ లాంటి వార్త వినిపించింది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ వైజాగ్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేపట్టినప్పటికీ అంచనాలు తారుమారు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు వలంటీర్లకు, సెక్రటరియేట్ సిబ్బందికి రూ.ఐదు వేల చొప్పున పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచారానికి వారి సేవలు వినియోగించుకున్నారు. ఈ దశలో స్టీల్ ప్లాంట్ అంశం వారి పాలిట శాపంగా మారుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ ప్రజల, ఉద్యోగుల మనోభావాలతో ఆడుకుందని ఓటర్లు భావిస్తుండటంతో అధికార పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి.
పోరాటం కొనసాగుతుంది..
మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన మంత్రులు కన్నబాబు, శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డి, విశాఖపట్నం ఎంపీ ఎం బి వి సత్యనారాయణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన ఎంతో నిరాశపరిచిందని అన్నారు. అఖిల పక్షాలు, ట్రేడ్ యూనియన్ నేతలతో కలిసి త్వరలోనే ప్రధానిని కలిసి సెంటిమెంట్ను వివరిస్తామని చెప్పారు. అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తామన్నారు. స్టేట్ ప్లాంట్ ప్రైవేటీకరణ సాధ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని విజయసాయి రెడ్డి అన్నారు. రాజీనామాలు చేసి సాధించేది ఏమీ ఉండదని, పార్లమెంటులో గొంతు వినిపించాలంటే పదవిలో కొనసాగాలని అన్నారు.
టూరిజం శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్లో రాష్ట్ర ప్రభుత్వాని ఎటువంటి సంబంధం లేదని కేంద్రం చెప్పడం సరికాదన్నారు. భూములు సదుపాయాలు కల్పించకుండానే కేంద్రం పరిశ్రమ పెట్టగలదా? అని ప్రశ్నించారు. గతంలో మాదిరిగానే భవిష్యత్తులోనూ ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు సబ్బం హరి స్థానికత అంశంపై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, చంద్రబాబుకి రాష్ట్రంలో ఇల్లు ఉందా? అని ప్రశ్నించారు. ముందుగా ఆ పార్టీకి రాజీనామా చేసి అప్పుడు మాట్లాడాలని హితవు పలికారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, ఈ విషయమై కేంద్రాన్ని నిలదీయాల్సిన బాధ్యత ఆయనపై లేదా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురించి మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు.
మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పండుగ చేసుకునే బ్యాచ్ రాష్ట్రంలో ఉందని, అది చంద్రబాబు అండ్ కో అని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారణమవుతున్న బీజేపీ ఎక్కడా కనిపించడం లేదన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అని ప్రశ్నించారు. విశాఖపట్నం ఎంపీ సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు పడ్డాయని అన్నారు. ఎన్నో ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇప్పటివరకు సొంత గనులు ఎందుకు సాధించలేకపోయారు అని ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ప్రశ్నలపై అసహనం..
ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అసహనంగా బదులిచ్చారు. ప్రత్యేక హోదా కోసం గతంలో పార్లమెంట్ ఆవరణలో తాను నిరసన తెలిపిన తొలి వ్యక్తి అని చెప్పుకొచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. మరి అదే స్థాయిలో ఇప్పుడు కూడా చేస్తారా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. రాజీనామాల అంశంపై స్పందిస్తూ, అది సరైన నిర్ణయం కాదని, రాజీనామాలు చేస్తే పార్లమెంటులో ఇక్కడి వాదన ఎవరు వినిపిస్తారని పాత పాటనే వల్లె వేశారు. మరి సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో రాజీనామాలు చేయాలని అప్పటి అధికార పార్టీ తెలుగుదేశాన్ని ఎందుకు డిమాండ్ చేశారని ప్రశ్నిస్తే.. డొంక తిరుగుడు సమాధానం ఇచ్చారు. అడిగే ప్రశ్నలు సరిగా లేవని, స్పష్టంగా అడగడం నేర్చుకోవాలని మీడియాకు క్లాస్ పీకారు. అసత్య కథనాలు ప్రచురించే సంస్థలు అంటూ అసహనం వ్యక్తం చేశారు.
మరో విలేకరి.. ఒకవేళ ప్రధానమంత్రి మోదీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే తరువాత ఏం చేస్తారని ప్రశ్నించారు. గతంలో కూడా పలుమార్లు ఇవ్వలేదు కదా అని అడిగినందుకు… ఎంపీకి చిర్రెత్తుకొచ్చింది. “ మీ చంద్రబాబుకి గతంలో పలుమార్లు అపాయింట్మెంట్ దొరకని మాట వాస్తవమే.. కానీ మాకు ముఖ్యమైన అన్ని సందర్భాల్లోనూ అపాయింట్మెంట్ లభించింది” అని సెలవిచ్చారు. అంతేకాకుండా ఊహాజనితమైన ప్రశ్నలు ఎలా అడుగుతారు? ఈ ప్రశ్నలు సరిగా లేవని ఆయన వ్యాఖ్యానించారు.
జగన్ ఇచ్చిన హామీ ఊహాజనితం కాదా?
విశాఖపట్నం విమానాశ్రయంలో ట్రేడ్ యూనియన్ నాయకులతో సమావేశమైన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఊహాజనితం కాదా? వైసీపీ నేతలు విస్మరించిన విషయాన్ని కొందరు గుర్తు చేసుకున్నారు. తాను కేంద్రానికి లేఖ రాసి పది రోజులు అయ్యిందని, అనుకూలంగానే సమాధానం వస్తుందని ముఖ్యమంత్రి ట్రేడ్ యూనియన్ నాయకులకు చెప్పుకొచ్చారు. కానీ అలా జరగలేదు సరికదా పరిస్థితి పూర్తిగా తారుమారైంది. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని జగన్ చేసిన వ్యాఖ్యలు ఊహాజనితం కాదా ? తాను చేస్తే సంసారం.. ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అంటే ఇదేనేమో!











