మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అనుయాయులకు లబ్ధి చూకూర్చే విధంగా అసైన్డ్ భూములు కూడా కొనుగోలు చేయవచ్చంటూ అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదుతో తమకు సంబంధం లేదని కందా పావని, ఈపూరి సుబ్బమ్మ, అద్దేపల్లి సాంబశివరావు సంచలన విషయాలు బయట పెట్టారు. వీటికి సంబంధించిన వీడియోలను టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర మీడియా ముందు పెట్టారు. ఈ వీడియోల్లో కేసు తాము పెట్టలేదని వారు స్పష్టంగా చెప్పారు.
అసలు విషయం చెప్పకుండా సంతకాలు తీసుకున్నారు
విచారణ పేరుతో తమ వద్దకు కొంత మంది వచ్చారని, భూమి అమ్మారా అని నిర్థారించుకుంటున్నామంటూ సంతకాలు తీసుకున్నారని కందా పావని చెప్పారు. ఆమె చెప్పిన మాటల వీడియోను దూళిపాళ నరేంద్ర విడుదల చేశారు. తాను ఓసీ అని కూడా ఆమె చెప్పారు. ఈ విషయం మీడియాలో వచ్చే వరకు తమ వద్ద సంతకాలు ఎందుకు తీసుకున్నారో కూడా తెలియలేదన్నారు. ఇలా చంద్రబాబుపైన కేసు పెడతారని తెలిస్తే సంతకాలు చేసేవారిమి కాదని వారు స్పష్టం చేశారు. సీఐడీ అధికారులు వచ్చి మీరు పొలం అమ్మారా అని అడిగారని అద్దేపల్లి సాంబశివరావు తెలిపారు. మా భూమి అమ్మామని చెప్పానన్నారు. నా వద్ద నుంచి బలవంతంగా లాక్కున్నారని తాను ఎక్కడా చెప్పలేదని సాంబశివరావు చెప్పిన మాటల వీడియోను నరేంద్ర మీడియా ముందు పెట్టారు. దీంతో చంద్రబాబుపై సీఐడీ కేసు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.