వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హ*త్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసును పునర్విచారించాలని రిటైర్డ్ ఐపీఎస్ ఐబీ వెంకటేశ్వర రావు డిమాండ్ చేశారు. సోమవారం
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.మామిడాడలోని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. వారిని వెంటపెట్టుకుని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ను, జిల్లా ఎస్పీ బింధుమాధవ్ను కలిశారు.
వైసీపీ హయాంలో జరిగిన సుబ్రహ్మణం హ*త్య కేసులో జరిగినంత లోపభూయిష్టమైన దర్యాప్తును తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు వెంకటేశ్వర రావు. 2022 మే 20న జరిగిన ఈ హ*త్య కేసును అప్పటి జగన్ సర్కారు నీరుగార్చిందని మండిపడ్డారు. అత్యంత నీచమైన, అమానవీయమైన ఈ కేసులో ముఖ్యమైన నిందితుడిగా ఉన్న అనంతబాబును కాపాడేందుకు నాడు ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థలూ ఎన్నో అడ్డదారులు తొక్కాయని ఆరోపించారు.
ఈ కేసు విచారించిన అధికారులు వేసిన కాగితాలు, రాసిన పంచనామాలు చూస్తే ట్రైనింగ్లో ఉన్న పోలీసు అధికారికైనా అది తెలిసిపోతుందన్నారు వెంకటేశ్వర రావు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హ*త్య కేసులో పోలీసు వ్యవస్థ మొత్తాన్ని మేనేజ్ చేసింది ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అనుచరులు, నాయకులేనని ఆరోపించారు. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, వ్యాపార భాగస్వాములు చేస్తున్న బియ్యం దోపిడీ కేసులో ఇంతవరకు పురోగతి కనిపించడం లేదన్నారు. ఆ కేసును కూడా త్వరితగతిన విచారించాలన్నారు. సాక్ష్యాలను సేకరించి, రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారిన వారి నుంచి డబ్బంతా రాబట్టాలన్నారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి చట్ట ప్రకారం అందాల్సిన నష్టపరిహారం, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అందాల్సిన పింఛన్ సొమ్ము త్వరితగతిన అందేలా చూడాలని, హతుడు తమ్ముడికి ఉద్యోగం కల్పించాలని జిల్లా కలెక్టర్ను కోరారు.