వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ స్కామ్లో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు విచారణలో కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజ్ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించింది. అత్యధికంగా లిక్కర్ సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ కెసిరెడ్డి ప్రతి నెలా రూ.50-60 కోట్ల ముడుపులు వసూలు చేసి. ఆ మొత్తాన్ని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, విజయసాయిరెడ్డిలతో పాటు బాలాజీ అనే మరో వ్యక్తికి అందజేసేవారని సిట్ దర్యాప్తులో గుర్తించింది.
2019-24 మధ్య ఇలా ఏకంగా రూ.3,200 కోట్ల ముడుపులు వసూలు చేసినట్లు నిర్ధారించింది. ఈ మొత్తం కుట్ర రూపకల్పన, ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణలో నాటి సీఎం జగన్కు ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కెసిరెడ్డి కీలకపాత్ర పోషించారని తేల్చింది. ఎంపీ మిథున్రెడ్డి, విజయసాయిరెడ్డి, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్రెడ్డి, అప్పటి సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, ఏపీఎస్బీసీఎల్ నాటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి డి.సత్యప్రసాద్తో పాటు బాలాజీ అనే వ్యక్తితో కలిసి ఆయన ఇదంతా చేశారని వెల్లడించింది. ప్రభుత్వమే దుకాణాలు నడిపేలా నూతన మద్యం విధానాన్ని రూపొందించే బాధ్యతను నాటి సీఎం జగన్మోహన్రెడ్డే తనకు అప్పగించారని రాజ్ కెసిరెడ్డి తమ విచారణలో చెప్పారని సిట్ తెలిపింది..
జగనే సూత్రధారి –
ప్రభుత్వానికి మరింత ఆదాయం రావటమే కాక పార్టీ ఫండ్ కింద వైసీపీకి భారీగా నిధులు సమకూరేందుకు వీలుగా ఈ మద్యం విధానం ఉండేలా చూడాలని జగన్ తనకు నిర్దేశించినట్లు రాజ్ కెసిరెడ్డి చెప్పారని స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు (A-1) అయిన రాజ్ కెసిరెడ్డిని సోమవారం సాయంత్రం సిట్ అరెస్టు చేసింది. మంగళవారం మధ్యాహ్నం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించడంతో మంగళవారం సాయంత్రం ఆయన్ను విజయవాడలోని ACB స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు.
ఈ కేసులో ఇప్పటి వరకూ తమ దర్యాప్తులో తేలిన అంశాలతో పాటు రాజ్ కెసిరెడ్డి ప్రమేయం తదితర అంశాలను సిట్ రిమాండ్ రిపోర్టులో పొందుపరిచి, కోర్టుకు సమర్పించింది. ఆయనకు రిమాండు విధించాలని కోరింది. ముడుపుల వసూళ్లకు వీలుగా మద్యం విధానం రూపకల్పనలో జరిగిన కుట్ర, దాని అమలు, ముడుపుల వసూళ్లకు అనుసరించిన విధానం, ఆ ముడుపుల సొమ్మును వైట్లోకి మార్చేందుకు ఏయే రూపాల్లోకి, ఎక్కడెక్కడికి ఎలా మళ్లించారు? దీని కోసం డొల్ల కంపెనీల ఏర్పాటు, హవాలా లావాదేవీలు ఎలా నిర్వహించారు? ప్రభుత్వ ఖజానాకు ఎలా నష్టం కలిగించారు? అందులో ఎవరెవరి పాత్ర ఏంటి? తదితర అంశాలన్నింటినీ సిట్ రిమాండు రిపోర్టులో పేర్కొంది.
నెలకు రూ.50-60 కోట్లు ముడుపులు వస్తాయని లెక్కలు
వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించేలా నూతన మద్యం విధానాన్ని తీసుకొస్తూ 2019 ఆగస్టు 16న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. తర్వాత వైకాపా పెద్దలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న IRTS అధికారి వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్పై తీసుకొచ్చి APSBCL ఎండీగా, బెవరేజెస్ అండ్ డిస్టిలరీస్ కమిషనర్గా కీలక బాధ్యతల్ని అప్పగించారు. తద్వారా కొనుగోలు, విక్రయాల్లోనే కాకుండా డిస్టిలరీలు, లేబుల్ రిజిస్ట్రేషన్ సహా మొత్తం అన్నీ తమ నియంత్రణలో పెట్టుకున్నారు. ఆ తర్వాత ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న డి.సత్యప్రసాద్.. ఎంపీ మిథున్రెడ్డిని తిరుపతిలో కలిశారు. తమతో కలిసి తాను చెప్పినట్లు చేస్తే 2023లో కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా ఇప్పిస్తానంటూ మిథున్రెడ్డి ఆయనకు హామీ ఇచ్చారు. మద్యం విక్రయాలకు సంబంధించిన వివరాలు తీసుకుని వాసుదేవరెడ్డితోపాటు హైదరాబాద్లోని విజయసాయిరెడ్డి నివాసానికి రావాలని సూచించారు.
2019 అక్టోబరు 13న హైదరాబాద్లోని విజయసాయిరెడ్డి నివాసంలో సమావేశానికి హాజరుకాగా.. అక్కడ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, కెసిరెడ్డి రాజశేఖర్రెడ్డి, ఆయన తోడల్లుడు అవినాష్రెడ్డి అలియాస్ సుమిత్ ఉన్నారు. అంతకు ముందు సంవత్సరాల్లో జరిగిన మద్యం విక్రయాల డేటా విశ్లేషించిన విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి నెలకు రూ.50-60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసేందుకు అవకాశముందని లెక్క కట్టి, అందుకనుగుణంగా ప్రణాళిక రూపొందించారు. వాసుదేవరెడ్డితో కలిసి పనిచేయాలని విజయసాయిరెడ్డి కూడా సత్యప్రసాద్కు సూచించారు. కన్ఫర్డ్ IASగా పదోన్నతి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
2019లో ఎక్సైజ్ శాఖ సీటెల్ సాఫ్ట్వేర్ వినియోగించేది. రిటైల్ దుకాణాలు, ఏపీఎస్బీసీఎల్ ప్రధాన కార్యాలయం, డిస్టిలరీలను ఈ సాఫ్ట్వేర్ అనుసంధానించేది. ఆటోమేటెడ్ రిటైల్ షాప్ సేల్స్, ఇండెంటింగ్, స్టాక్ మెయింటనెన్స్, స్పేస్ మేనేజ్మెంట్, ఏపీఎస్బీసీఎల్ ఎంఐఎస్ డేటా జనరేషన్, ఆర్డర్ ఫర్ సప్లై దాఖలు తదితర అంశాల్లో ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా ఉండేది. ఐతే సీటెల్ సాఫ్ట్వేర్ తొలగించి మాన్యువల్గా మద్యం సరఫరా ఆర్డర్లు జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. సేల్స్ ఎంట్రీలను జీఆర్ఓలు సి-టెల్ ప్లాట్ఫాంలో నమోదు చేసే విధానానికి స్వస్తి చెప్పి, ఏపీటీ ఆన్లైన్ ప్లాట్ఫాంను తెరపైకి తెచ్చారు. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో మొత్తం మద్యం వ్యాపారం, ఉత్పత్తి, విక్రయాల్ని వారి గుప్పిట్లో పెట్టుకున్నారు.
మిథున్ రెడ్డి ఆదేశాలు –
2019 డిసెంబరులో మిథున్రెడ్డి ఆదేశాల మేరకు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లు జూబ్లీహిల్స్లోని శరత్చంద్ర హాస్పిటల్ వీధిలో ఉన్న ఓ ప్రైవేటు భవనంలో కెసిరెడ్డి రాజశేఖర్రెడ్డిని కలిశారు. కొందరు లిక్కర్ సరఫరా కంపెనీల ప్రతినిధులు తనను కలిశారని, ముడుపులు ఇవ్వటానికి అంగీకరించారని వారిని మాత్రమే ప్రోత్సహించాలని రాజ్ కెసిరెడ్డి సూచించారు. రాజ్ కెసిరెడ్డి తోడల్లుడు అవినాష్రెడ్డి అలియాస్ సుమిత్, సజ్జల శ్రీధర్రెడ్డి కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నారు. తనకు తెలియకుండా ఏ ఒక్క సరఫరాదారునూ ప్రోత్సహించొద్దని రాజ్ కెసిరెడ్డి వారికి నిర్దేశించారు. బేసిక్ ప్రైస్ ఆధారంగా ముడుపులు ఎంత వసూలు చేయాలనేది ఆ సమావేశంలో నిర్ణయించారు. ఆ తర్వాత నుంచి తమ ప్లాన్ ప్రకారం.. సత్యప్రసాద్ తన పర్సనల్ నంబరుతో మద్యం డిపో మేనేజర్లతో రోజూ వాట్సప్ కాల్లో మాట్లాడేవారు. ఏ బ్రాండ్లకు ఎక్కువగా ఇండెంట్ పెట్టాలి, ఏవి తక్కువ పెట్టాలి, ఏవి అసలు పెట్టకూడదు అనేది నిర్ణయించేవారు. ముసాయిదా ఇండెంట్ ప్రణాళిక రాజ్ కెసిరెడ్డి నుంచి వచ్చేది. ప్రకాశ్ ద్వారా ఏయే కంపెనీలైతే ముడుపులు ఇచ్చేవో వారికే ఇండెంట్లు జారీ చేసేవారు.
2020 జనవరిలో సంక్రాంతి తర్వాత..రాజ్ కెసిరెడ్డి ఓ సమావేశం నిర్వహించారు. అందులో సత్యప్రసాద్, సజ్జల శ్రీధర్రెడ్డి, అవినాష్రెడ్డి, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. పాత బ్రాండ్లు ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. OFSకు కొన్ని నిబంధనలు ఉన్నాయని వాసుదేవరెడ్డి చెప్పగా.. ఆయన నుంచి ఆ అధికారాలు తీసేసి సత్యప్రసాద్కు అప్పగించారు. అప్పటి నుంచి రాజ్ కెసిరెడ్డి, అవినాష్రెడ్డిల నుంచి సత్యప్రసాద్ నేరుగా ఆదేశాలు తీసుకుని.. ఎవరికి ఎంత మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వాలో డిపో మేనేజర్లకు ఆదేశాలిచ్చేవారు.
కిక్బ్యాక్స్ గురించి కంపెనీలతో చర్చ –
ప్రతి నెలా 27-30 లక్షల కేసుల ఐఎంఎల్, 7-10 లక్షల కేసుల బీరు విక్రయించేవారు. తొలుత రాజ్ కెసిరెడ్డి, ముప్పిడి అవినాష్రెడ్డి, వాసుదేవరెడ్డి, సజ్జల శ్రీధర్రెడ్డి మద్యం సరఫరా కంపెనీలతో ముడుపుల అంశంపై చర్చించేవారు. రెండో దశలో విజయవాడలోని మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీలతో చర్చించే బాధ్యతను వాసుదేవరెడ్డి చూసేవారు. హైదరాబాద్లోని కంపెనీల బాధ్యతల్ని కొన్నాళ్లపాటు అవినాష్రెడ్డి, ఆ తర్వాత చాణక్య అలియాస్ ప్రకాశ్ చూసేవారు. వారు చర్చలు జరిపే సమయంలో లిక్కర్ బేసిక్ ప్రైస్ను పరిగణనలోకి తీసుకునేవారు. సదరన్ బ్లూ, 9 హార్సెస్, ఆంధ్ర గోల్డ్, హెచ్డీ విస్కీ వంటి చీప్ లిక్కర్ బ్రాండ్లకు ఒక్కో కేసుకు రూ.150 చొప్పున ముడుపులు వసూలు చేసేవారు. దారూహౌస్, రాయల్ ప్యాలెస్, బ్రిలియంట్ బ్లెండ్ వంటి వాటికి ఒక్కో కేసుకు రూ.200 చొప్పున వసూలు చేసేవారు. మ్యాన్షన్ హౌస్, రాయల్ స్టాగ్లకు రూ.350 చొప్పున, టీచర్స్, 100 పైపర్స్ వంటి వాటికి ఒక్కో కేసుకు రూ.600 చొప్పున వసూలు చేశారు.
ముడుపుల సొమ్ము షెల్ కంపెనీలు, స్థిరాస్తి సంస్థల ఖాతాల్లోకి!
డిస్టిలరీలు, సప్లయర్లకు ప్రతి ఐదో రోజు బూనేటి ప్రకాశ్ అలియాస్ చాణక్య ఫోన్లు చేసేవారు. దర్యాప్తు సంస్థలకు దొరక్కుండా ఉండేందుకు వీపీఎన్, వీఓఐపీ సర్వీసులు, వర్చువల్ నంబర్లు, ఇంటర్నేషనల్ లైన్స్, వాట్సప్, సిగ్నల్ వంటి యాప్లు ఉపయోగించి ఫోన్లు చేసేవారు. ఆ వారంలో విక్రయాలకు సంబంధించి ఇవ్వాల్సిన ముడుపుల మొత్తాన్ని ముందుగా సూచించిన ప్రాంతంలో అందజేయాలని చెప్పేవారు. ఏపీఎస్బీసీఎల్ నుంచి తమకు పేమెంట్లు అందిన వెంటనే డిస్టిలరీలు, సప్లయర్లు వాటిని నగదు రూపంలోకి మార్చి మద్యం సిండికేట్కి పంపించేవారు. దర్యాప్తు సంస్థల దృష్టి మళ్లించేందుకు దానికి అనేక అక్రమ మార్గాలు అనుసరించేవారు.
1. డిస్టిలరీలు ఆ డబ్బును బంగారం లేదా బులియన్ ఖాతాల్లోకి బదలాయించేవి. రూ.వందల కోట్ల బంగారం, నగదు ముడుపులుగా చెల్లించేవి.
2. మద్యం సిండికేట్ సభ్యుల సన్నిహితులు, మిత్రులకు చెందిన స్థిరాస్తి కంపెనీలు, ఇతర వ్యాపార సంస్థల ఖాతాల్లోకి డబ్బు పంపించేవి.
3. ముంబయి, దిల్లీల్లోని ఆర్గనైజ్డ్ హవాలా నెట్వర్క్ల ద్వారా లిక్కర్ సిండికేట్ సభ్యులకు చెందిన షెల్ కంపెనీల్లోకి డబ్బు పంపేవి. భారత్ లేదా విదేశాల్లోని కంపెనీల ఖాతాల్లోకి ఆ డబ్బు వెళ్లేది. ఈ నెట్వర్క్ ఆర్గనైజర్లకు, గత వైకాపా ప్రభుత్వంలోని రాజకీయ నాయకులకు ఉన్న సంబంధాలేంటన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది.
4. ఈఎన్ఏ, ఖాళీ సీసాలు, మూతలు, కార్టన్లు (అట్టపెట్టెలు) వంటి ముడి సరకు సరఫరాదారులకు వాటి వాస్తవ ధర కంటే 3-5 రెట్లు అధికంగా చెల్లించేవారు. అదనపు మొత్తాన్ని సప్లయర్లు నగదు రూపంలో వెనక్కి ఇచ్చేవారు. దాన్ని చట్టబద్ధమైన లావాదేవీగా చూపిస్తూ ఆ ముసుగులో ముడుపులు పొందేందుకు మద్యం సిండికేట్ వేసిన ఎత్తుగడ ఇది.
5. బ్రాండ్ ప్రమోషన్ పేరుతో కొంత డబ్బును నకిలీ ఖాతాలు, షెల్, సూట్కేస్ కంపెనీల్లోకి పంపించేవారు. దుస్తులు, బంగారు నాణేలు, గిఫ్ట్ హ్యాంపర్లు వంటివి కొన్నట్లు చూపించేవారు. దానికైన ఖర్చుగా నకిలీ ఇన్వాయిస్లు జారీ చేసేవారు. కానీ ఎప్పుడూ ఆ డబ్బు కొన్న పాపాన పోలేదు. దుస్తులు, బంగారు నాణేల వంటివి సరఫరా చేసే సంస్థలు.. మద్యం డిస్టిలరీలు, సప్లయర్లు తమ ఖాతాలకు బదిలీ చేసిన డబ్బులో కమీషన్ మినహాయించుకుని మిగతా మొత్తాన్ని నగదు రూపంలో వెనక్కు ఇచ్చేవి.
5 రోజులకోసారి కిక్ బ్యాక్స్
వైసీపీ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వ్యక్తుల ప్రాపకంతో కొందరు మద్యం సిండికేట్గా ఏర్పడి…తమ అనుచరులు, విశ్వాసపాత్రుల్ని బెవరేజెస్ కార్పొరేషన్లో నియమించుకుని అక్రమాలు సాగించారు. ఏపీఎస్బీసీఎల్లో పనిచేసిన ప్రభుత్వ అధికారులు, ఇతరులు అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారు. వారందరూ సెక్షన్ 7, 7ఏ, 8, 13(1)(బి), 13(2) కింద శిక్షార్హులు. మద్యం ముడుపుల కుంభకోణానికి ప్రధాన సూత్రధారి, అమలు చేసిందీ ముఖ్యమంత్రి జగన్కు ఐటీ సలహాదారుగా పనిచేసిన కెసిరెడ్డి రాజశేఖర్రెడ్డి. పేరొందిన బ్రాండ్ల మద్యం సరఫరాను నిలిపేసి, ముడుపులిచ్చిన సప్లయర్ల బ్రాండ్లకే అనుమతివ్వడంలో కెసిరెడ్డి రాజశేఖర్రెడ్డితో పాటు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, మిథున్రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల శ్రీధర్రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, అప్పటి సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, బాలాజీలు కీలకంగా వ్యవహరించారు. ఓఎఫ్ఎస్ల జారీని రాజ్ కెసిరెడ్డి తన నియంత్రణలో పెట్టుకునేవారు. ఐదు రోజులకోసారి ఎంత మొత్తం ముడుపులు రావాలో లెక్క వేసి.. బూనేటి చాణక్య, దిలీప్, కిరణ్ తదితరుల ద్వారా వసూలు చేసేవారు.
లంచాల కోసం రియల్ టైమ్ డేటా
కిక్బ్యాక్స్ కోసం నిరంతరం తనకు సమాచారమొచ్చేలా రాజ్ కెసిరెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. విజయసాయిరెడ్డి సిఫార్సు ఆధారంగా..డేటా ఎంట్రీ ఆపరేటర్ అనూషను MIS సెక్షన్లో నియమించారు. MIS సెక్షన్ నుంచి విక్రయాల డేటా తీసుకుని, రాజ్ కెసిరెడ్డి బృందానికి అందజేయటం ఆమె బాధ్యత. ఆ విక్రయాల డేటా ద్వారా ఏ డిస్టిలరీ ఎంత ముడుపులు చెల్లించాలో పట్టిక రూపొందించి సైఫ్ అనే వ్యక్తి రాజ్ కెసిరెడ్డికి పంపించేవారు. అది ఆయన అవినాష్రెడ్డికి చేర్చేవారు. కిరణ్కుమార్రెడ్డి, దిలీప్, ఖురేషీ, ఛిష్టి మరికొందరితో కలిసి ముడుపులు వసూళ్లు చేసేవారు. హైదరాబాద్లోని నానక్రామ్గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-12, ఎమ్మెల్యే కాలనీ, బంజారాహిల్స్, ఖాజాగూడ సహా అనేకచోట్ల ఈ వసూళ్లకు పాల్పడేవారు. తమ ఉనికి చిక్కకుండా VPN/ఇంటర్నేషనల్ నంబర్ల ద్వారా మాట్లాడేవారు. సిగ్నల్ వంటి యాప్లు వినియోగించేవారు.
వసూళ్ల సొమ్మును అవినాష్రెడ్డి, ప్రకాశ్ ద్వారా రాజ్ కెసిరెడ్డికి అందజేసేవారు. అదాన్, లీలా కంపెనీలకు విపరీతంగా ఆర్డర్లు ఇచ్చారు. విశాఖ డిస్టిలరీస్, పీఎంకే డిస్టిలరీస్, ఎస్పీవై డిస్టిలరీస్ను ఆధీనంలో పెట్టుకుని ఈ బ్రాండ్లు తయారు చేసేవారు. అదే సమయంలో పాపులర్ బ్రాండ్లు… మార్కెట్లోకి రాకుండా నిరోధించారు. సుప్రీం బ్లెండ్ విస్కీ, బ్రిలియంట్ బ్లెండ్ విస్కీ, దారూ హౌస్ బ్రాందీ, మాన్షనల్ తిలక్ నగర్ డిస్టిలరీకి ప్రాధాన్యమిచ్చారు. పెన్నార్ రికార్డ్, మెక్డొవెల్ వంటి వాటిని అణగదొక్కారు. ఒకే తరహా పేర్లతో రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చారు.
ఈ కుంభకోణంలోని కుట్రదారులు తరచూ సమావేశమయ్యేవారు. ఏ బ్రాండ్లకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి, వేటికి తక్కువ ప్రాధాన్యమివ్వాలనేదానిపై చర్చించేవారు. విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, వాసుదేవరెడ్డి, ధనుంజయరెడ్డిలు ఈ సమావేశాల్లో పాల్గొనేవారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో ఎక్కువసార్లు, అప్పుడప్పుడూ విజయవాడలోని యలమంచిలి హైట్స్ మూడో అంతస్తులో ఈ సమావేశాలు జరిగేవి. 2022 జూన్ నుంచి 2024 మార్చి వరకూ డిస్టిలరీకి అదనంగా రూ.200 కోట్లు ఇచ్చారు. దాని వల్ల అనుచిత లబ్ధి కలిగించారు. ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్, లీలా డిస్టిలరీస్, అంబర్ స్పిరిట్స్, అదాన్ డిస్టిలరీస్, తిలక్నగర్ సెంటినీ, మోహన్, ఎస్ఎన్జే కంపెనీలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. వాసుదేవరెడ్డి ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ డిస్టిలరీలకు అధికంగా చెల్లించారు