వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని ఎవరికిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ తమిళనాడు బీజేపీ నేత అన్నామలైకి ఇస్తారంటూ ప్రచారం జరిగింది. తాజాగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర పరిపాలన వ్యవహారాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును అమిత్ షాకు వివరించారు. ఈ సమయంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానం విషయంలోనూ ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఈ స్థానాన్ని బీజేపీకి వదిలేస్తారని ప్రచారం జరుగుతున్నా..ఈ విషయాన్ని ఇప్పటివరకూ టీడీపీ అధికారికంగా ధృవీకరించలేదు.
అయితే, చంద్రబాబు కంటే ముందు అమిత్ షాను కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి, MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగలు కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో SC వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ఆయన్ను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు కృష్ణమాదిగ చెప్పారు. అనంతరం ఆయన దిల్లీలో ముఖ్యమంత్రి అధికార నివాసం జన్పథ్కు వచ్చి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు జరగబోయే రాజ్యసభ స్థానం ఎన్నికకు బీజేపీ నాయకత్వం తమిళనాడు భాజపా మాజీ అధ్యక్షుడు అన్నామలై, మంద కృష్ణమాదిగ పేర్లను ప్రతిపాదిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అటు టీడీపీ, ఇటు బీజేపీ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటన చేయలేదు.