టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతోపాటు స్వతంత్రులుకూడా ఈసారి బరిలోకి దిగడంతో పోరు హోరాహోరీగానే నడుస్తోందని చెప్పవచ్చు. అయితే తమ అభ్యర్థుల గెలుపు లాంఛనమే అని టీఆర్ఎస్ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. ఎవరికీ గెలుపు అంత ఈజీకాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రత్యేకంగా జిల్లాలవారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. వారితోపాటు ఎమ్మెల్యేలుకూడా కచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేలా టార్గెట్ లూ ఫిక్స్ అయ్యాయి. గతంలో ఎప్పుడూ ఇంత ఒత్తిడి లేదని ఆ పార్టీలోని నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారంటే..టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.
పోటీ ఇదా..
నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గంలో తుది లెక్కల ప్రకారం 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ నియోజకవర్గంలో 93 మంది ఉన్నారు. మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనుండగా మార్చి 17న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి.
అభ్యర్థుల తుది లెక్క..
హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి పీవీ కుమార్తె సురభి వాణీదేవి, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఫ్రొపెసర్ నాగేశ్వర్ తోపాటు పలువురు స్వతంత్రులు బరిలో ఉన్నారు. ఆర్ ఎల్ డీ నుంచి పోటీపడిన కపిలవాయి దిలీప్ కుమార్ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. బీజేపీలో చేరారు. ఇక ఖమ్మం-నల్గొండ-వరంగల్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్తో పాటు టీజేఎస్ అభ్యర్థిగా కోదండరాం, జయసారధి రెడ్డి, తీన్మార్ మల్లన్న, ప్రేమేందర్ రెడ్డి, రాణిరుద్రమ దేవితోపాటు పలువరు స్వతంత్రులు బరిలో ఉన్నారు.
టీఆర్ఎస్ లో మంత్రులకు బాధ్యతలు..
గతంలో ఎన్నడూ లేని విధంగా పోటీ ఉండడం, దుబ్బాక, జీహెచ్ఎంసీల్లో టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బల నేపథ్యంలో టీఆర్ఎస్ ఈ సారి గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడిస్తే.. ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో డిఫెన్స్ లో పడుతుందని, ఒత్తిడి పెరుగుతుందని ఇతర పార్టీలు భావిస్తున్నాయి. అదే సమయంలో గత ఎన్నికలతో పోల్చితే ఓయూ, కేయూల్లోని కొందరు విద్యార్థులు, నిరుద్యోగులు పెద్దయెత్తున ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేయడం టీఆర్ఎస్ కు మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు. మొన్నటికి మొన్న కేటీఆర్ ఉద్యాగాల లెక్క చెప్పడం, వెంటనే కాంగ్రెస్ తోపాటు పలు పార్టీలు విరుచకుపడడంతో, స్లైడ్ లతో సహా ఉద్యోగాల లెక్కలు చెప్పే ప్రయత్నం చేయడం టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే అంశాలే. 2015-16తో పోల్చితే అప్పుడున్నంత సెంటిమెంట్, టీఆర్ఎస్ సానుకూల వాతావరణం ఇప్పుడు లేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది.
కనీసం పట్టునిలుపుకుని..
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఖమ్మం-వరంగల్-నల్గొండనుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కు చెందినవారు కాగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ లో బీజేపీనుంచి రామచంద్రరావు సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఈ పార్టీలు పట్టు నిలుపుకోవాలంటే ఒక్కటైనా గెలవడం తప్పనిసరి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి గెలిచినా.. ఆ పార్టీకి జీవాయువుగా ఆ గెలుపు ఉపయోపడుతుంది. సిట్టింగ్ స్థానాలు కోల్పోతే ఏపార్టీకైనా అది రానున్నకాలంలో నష్టం కలిగించే అంశమే. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ అలర్ట్ అయింది.
రోజూ సమావేశాలు..దిశా నిర్దేశం
ఈ రెండుస్థానాల్లో ఎలాగైనా గెలవాలని సీఎం కేసీఆర్ తమ పార్టీ నేతలకుదిశానిర్దేశం చేశారు. బీజేపీ చేతిలో ఉన్న హైదరాబాద్ సీటును గెలిచితీరాలని చెప్పినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే ముగ్గురు మంత్రులకు జిల్లాలవారీగా అప్పజెప్పారు. రంగారెడ్డికి మంత్రి హరీష్ రావు, హైదరాబాద్ కు గంగుల కమలాకర్, మహబూబ్ నగర్ కు మంత్రి ప్రశాంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఖమ్మం స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు దాదాపు ఖాయమని, బీజేపీ సిట్టింగ్ స్థానమైన హైదరాబాద్ లోనూ విజయం సాధించాలని ఆదేశించినట్లు సమాచారం. అదే సమయంలో ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జిలకు, పార్లమెంట్ స్థానాల పరిశీలకులకు కూడా స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్టు నాయకులు చెబుతున్నారు. పార్టీకి, పార్టీ ప్రకటించిన అభ్యర్థిని మద్దతుగా నిలవకుంటే రానున్న కాలంలో పార్టీనుంచి కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలూ జారీ చేసినట్టు తెలుస్తోంది.
కేటీఆర్ తప్పించి..
కాగా ఇటీవలివరకు ఈ బాధ్యతలు కేటీఆర్ చూస్తుండగా..తాజాగా ముగ్గురు మంత్రులకు అప్పగించడంపైనా పార్టీల్లో చర్చ నడుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్ల కేటీఆర్ అంతా తానై నడిపించినా ఫలితాలు నిరాశాజనకంగానే వచ్చాయి. అదేసమయంలో పార్టీ కార్యకలాపాలు, వరంగల్-నల్గొండ-ఖమ్మం నియోజకవర్గ బాధ్యతలూ చూసుకోవాల్సి ఉండడంతో కేటీఆర్ పై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని మరో అంశం ప్రచారంలో ఉంది. ట్రబుల్ షూటర్ గా హరీష్ కు పేరుందని, అయితే దుబ్బాకలో ఆ బ్రాండ్ నేమ్ కొంత దెబ్బతిందని, ఇప్పుడు కచ్చితంగా గెలిస్తేనే హరీష్ కు పూర్వవైభవం వస్తుందనే చర్చకూడా నడుస్తోంది. ఇదే విషయంపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. ఓడిపోతామని తెలిసే వారసుడు కేటీఆర్ని ఇన్చార్జిగా తప్పించారని ఆయన అన్నారు. మొత్తంమీద ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో పార్టీలు హోరాహోరీగా తలపడుతుండడం సాధారణ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది.