మిసెస్ శ్రీలంక పోటీల్లో విజేత ప్రకటన విషయంలో జరిగిన ఘటన ప్రపంచవ్యాప్తంగా విమర్శలపాలైంది. తొలుత ఒకరిని విజేతగా ప్రకటించి కిరీటం అలంకరింపజేయగా కొన్ని క్షణాలకు మాజీ మిసెస్ శ్రీలంక వచ్చి ఆ కిరీటాన్ని విజేత తలపై నుంచి తొలగించి రన్నరప్ తలపై అలంకరించడం వివాదాస్పదమైంది. దీంతో విజేత దారుణ అవమానంగా భావించి వేదికపై నుంచి వెళ్లిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన మిసెస్ శ్రీలంక నిర్వాహకులను కూడా విమర్శల పాల్జేసింది. ఇదంతా లైవ్లోనే జరగడంతో శ్రీలంకతోపాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వీక్షించారు.
బలవంతంగా కిరీటాన్ని తొలగించిన కరోలిన్
ఆదివారం రాత్రి కొలంబోలోని కొలంబోస్ నేలం పౌక్నా థియేటర్లో మిసెస్ శ్రీలంక అందాల పోటీల ఫైనల్ వేడుకలు జరిగాయి. ఈ పోటీల్లో పలు జడ్జిలతోపాటు 2019 మిసెస్ శ్రీలంక విజేత కరోలిన్ జూరీ కూడా సభ్యురాలే. ఈ పోటీల్లో తొలుత పుష్పిక డిసిల్వాను విజేతగా ప్రకటించారు. ఆమెకు కిరీటం అలంకరింప జేశారు. అయితే వెంటనే కరోలిన్ వచ్చి ఆ కిరిటాన్ని బలవంతంగా తొలగించి అందరినీ షాక్ కి గురిచేశారు. తొలగించిన కిరీటాన్ని రన్నరప్ గా నిలిచిన మరో మహిళతో ధరింపజేశారు. దీంతో దారుణ అవమానంగా భావించిన పుష్పిక డిసిల్వా వేదికపై నుంచి వెళ్లిపోయారు. చివరికి కిరీటంలో ఆమె జుట్టు ఇరుక్కున్నా..బలవంతంగా తీసేయడం వీడియోల్లో కనిపించింది. ఈ ఘటనపై కరొలినా జూరీని పోలీసులు అరెస్టు చేశారు. నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదుతో కరోలినా జూరీతో పాటు ఆమె సహాయకురాలైన చౌలా మన్మేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. తరువాత కరోలినా బెయిల్ పై విడుదలయ్యారు. ఈ అంశంపై పుష్పిక డిసిల్వా మాట్లాడుతూ..కరోలినా బహిరంగ క్షమాపణలు చెపితే తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటానని ప్రకటించారు. అదే సమయంలో ఈ ఘటనలో ఆమెను క్షమిస్తానని, కాని మర్చిపోనని వ్యాఖ్యానించారు.
కారణం ఇదీ..
మిసెస్ శ్రీలంకలో వివాహితులైన మహిళలకు అందాల పోటీలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఆదివారం ఫైనల్ వేడుకలు జరిగాయి. ఐదుగురు ఫైనల్ పోటీల్లో పాల్గొనగా పుష్పిక డిసిల్వాను విజేతగా నిర్వాహకులు ప్రకటించారు. మిగతావారిని రన్నరప్ ఫస్ట్ ,సెకండ్గా ప్రకటించారు. 2019లో మిసెస్ శ్రీలంక కిరీటాన్ని దక్కించుకున్న కరోలినా జూరీ సంప్రదాయం ప్రకారం.. మిసెస్ శ్రీలంక కిరీటాన్ని 2020 విజేతకు అలంకరించాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే ఆవిడ డిసిల్వాకు కిరీటాన్ని అలంకరించారు. అయితే కొన్ని సెకన్లకే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విజేతగా నిలిచాను అనే ఆనందంలో ఉన్న పుష్పిక డిసిల్వా తలపై ఉన్న కిరీటాన్ని కరోలినా జూరీ తీసేందుకు యత్నించింది. మిగతావారు వారిస్తున్నా..బలవంతంగా తొలగించింది. ఈ ఘటనతో అక్కడున్నవారితోపాటు పోటీలను తిలకిస్తున్నవారు షాక్కు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోగానే కరొలినా..ఆ కిరీటాన్ని రన్నరప్ తలకు అలంకరించారు.
విడాకులు తీసుకున్నారంటూ..
కాగా పుష్పిక తల నుంచి కిరీటం ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే అంశంపై కరోలినా జూరీ మాట్లాడుతూ.. ఈ పోటీలు వివాహితులైన మహిళలకే అని.. విడాకులు తీసుకున్న వారికి కాదని వ్యాఖ్యానించారు. పుష్పిక విడాకులు తీసుకున్నారని తెలిసినందునే ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. కాగా జూరీ చెప్పిన అంశానికి పుష్పిక కౌంటర్ ఇచ్చారు. తాను విడాకులు తీసుకున్నట్లు ఆధారాలుంటే చూపించాలని డిమాండ్ చేశారు. తన భర్తతో దూరంగా ఉంటున్నానని, విడాకులు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ఇంత దారుణంగా అవమానించిన జూరీని వదిలిపెట్టనని, న్యాయపరమైన అంశాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఒక మహిళ తలపై ఉన్న కిరీటాన్ని బలవంతంగా తొలగించే మరో మహిళ ఎన్నటికీ నిజమైన రాణి అనిపించుకోదని ట్వీట్ చేశారు.
ఈ గౌరవం ఒంటరి తల్లులకు అంకితం
ఇక ఈ వివాదంపై మిసెస్ శ్రీలంక పోటీల నిర్వాహక సంస్థ..మిసెస్ శ్రీలంక వరల్డ్ సంస్థ నేషనల్ డైరక్టర్ చందీమల్ జయసింఘే మాట్లాడుతూ ఈ ఘటన అనూహ్యంగా జరిగిందని వ్యాఖ్యానించారు. దురదృష్టకరమైన ఈ ఘటన నిర్వాహకులను, అభిమానులను, వీక్షకులను నిరాశకు గురిచేసిందన్నారు. నిబంధనల ప్రకారం..తొలుత విజేతగా ప్రకటించిన పుష్పిక డిసిల్వాకే కిరీటం దక్కుతుందన్నారు. ఈ వివాదం ఇంతటితో సద్దుమణగాలని కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. తరువాత పుష్పిక డిసిల్వాకు కిరీటాన్ని అందించినట్లు తెలిపారు. మరోసారి కిరీటాన్ని అందుకున్న పుష్పిక డిసిల్వా మాట్లాడుతూ తనకు దక్కిన ఈ గౌరవం ఒంటరి తల్లులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించింది.
https://www.nbcnews.com/video/mrs-sri-lanka-pageant-ends-in-controversy-arrest-after-mrs-world-removes-crown-109909574002