మహారాష్ట్రలో అధికార పార్టీ శివసేన ప్రతీకార చర్యలకు ఉపక్రమించిందంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. బాలీవుడ్ యంగ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపూత్ ఆత్మహత్య కేసులో సీఎం ఉద్దవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే పాత్ర ఉందంటూ నటి కంగనా రనౌత్ విమర్శలు చేసింది. ఈ విమర్శలతో ఆమెపై మహా ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ముంబైలో అడుగుపెట్టవద్దని ఆ పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు బేఖాతరు చేసిన కంగనా ముంబైలోకి అడుగుపెట్టింది. దీంతో ఆమెపై వేరే రూపంలో మహా సర్కార్ చర్యలకు దిగింది. ఆమె ఇల్లు నిబంధనల ప్రకారం లేదంటూ బృహన్ ముంబై అధికారులు కూల్చారు. దీనిపై కంగనా న్యాయస్థానాలకు ఫిర్యాదు చేయడం..ఆ కేసుపై కోర్టులు విచారణ జరుపుతున్నారు.
నేషన్ వాంట్స్ టూ నో
సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య నుంచి మొదలుపెట్టి ప్రముఖ ఛానల్ రిపబ్లిక్ వరుస కథనాలను ప్రసారం చేసింది. బీజేపీకి మద్దతు దారుడిగా పేరు ఉన్న అర్నాబ్ గోస్వామి కావాలనే ఇలా చేస్తున్నాడని మహా సర్కార్ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు ప్రచారం జరిగాయి. ఈ నేపథ్యంలో డిజాస్టర్ యాక్ట్ కింద ఆయనపై కేసులు నమోదు చేసి ముంబైకి రమన్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన అర్నాబ్ ముంబైకి రాలేదు. దీంతో ఎలాగైనా అర్నాబ్ ను కేసులో ఇరికించాలని మహా సర్కార్ ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చాయి. జరుగుతున్న ప్రచారం మేరకు మహా సర్కార్ అర్నాబ్ కు చెందిన రిపబ్లిక్ ఛానెల్ పై ఓ పెద్ద కేసును నమోదు చేసింది.
‘బార్క్ రేటింగ్ మీటర్లను రిపబ్లిక్ ఛానల్ మానిప్యులేట్ చేస్తుందని ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలో 2 వేలకు పైగా స్టేషన్ లలో రిపబ్లిక్ ఛానల్ బార్క్ రేటింగ్ మీటర్లను మానిప్యులేట్ చేసిందని కేసు నమోదయింది. ఈ కేసులో తమ ముందు హాజరుకమ్మని ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రతీకార చర్యలలో భాగంగా శివసేన ఇలా చేస్తుందని విమర్శలు వస్తున్నాయి.
కొసమెరుపు: కొన్ని రోజుల కిందట తెలుగు ఛానెల్స్ లో కూడా ఈ దందా బయటికి వచ్చింది. బార్క్ రేటింగ్స్ లో ముందంజలో ఉంటే యాడ్స్ ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో పలు తెలుగు ఛానెల్స్ కూడా ఈ మోసానికి పాల్పడినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బార్క్ సంస్థ కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. ఈ ఛానెళ్ల దందాకు సహకరిస్తున్న తమ ఉద్యోగులపై కూడా వేటు వేసింది. అంతే కాకుండా పక్కాగా బార్క్ రేటింగ్స్ ను నమోదు చేసింది. దీంతో అప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న ఓ తెలుగు ఛానల్ ఐదవ స్థానానికి పడిపోయింది.