విజయవాడ నుంచి నిత్యం అమరావతి వెళ్లే ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాజధాని ప్రాంతానికి కీలకమైన సీడ్ యాక్సెస్ రహదారి త్వరలోనే అందుబాటులోకి రానుంది. కూటమి ప్రభుత్వ వచ్చాక రాజధాని పనులను పరుగులు పెట్టించడంతో.. నిత్యం వేలాది మంది అమరావతికి వెళ్తున్నారు. వీరితో పాటు రాష్ట్ర సచివాలయం, హైకోర్టు, సీఆర్డీఏ వంటి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కోసం వెళ్లే వారూ పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత.. కృష్ణా నది గట్టు మీదుగా కరకట్టపై నిర్మించిన రోడ్డు మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. ఈ రోడ్డు చిన్నగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
ప్రకాశం బ్యారేజీ మీదుగా మంగళగిరి వెళ్లే మార్గంలో.. కరకట్ట దాటిన తర్వాత కొద్ది దూరంలోనే.. సీడ్ యాక్సెస్ రోడ్డుని.. మెయిన్ రోడ్డుతో అనుసంధానిస్తున్నారు. ఈ రోడ్డు పనులు చాలా వరకు పూర్తయ్యాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు సిటీకి తాగునీటిని తీసుకెళ్లే గుంటూరు ఛానల్ కాలువపై వంతెన నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. జనవరి నెలాఖరు నాటికి గుంటూరు ఛానల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పూర్తవుతుంది. వంతెన అందుబాటులోకి రాగానే.. సీడ్ యాక్సెస్ రహదారి మీదుగా రకపోకలను అనుమతించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
రాజధాని పనులతో ఇప్పటికే అమరావతి వైపు ట్రాఫిక్ పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల భవనాలతో పాటు ప్రైవేటు సంస్థలు నిర్మాణాలను ప్రారంభిస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి అమరావతి పనులు మరింత వేగవంతం అవుతాయి. రాజధాని ప్రాంతంలో రోజుకి 50 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ముందు ముందు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక నిర్మాణ సామాగ్రి.. ఇతర సరుకులతో రాజధాని వైపు వచ్చే లారీలు, ట్రక్కుల సంఖ్య భారీగా పెరగుతుంది. పనులు పూర్తి స్థాయిలో ఊపందుకొనే సమయానికి సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఫిబ్రవరి నాటికి సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.











