స్టార్ హీరోలంతా రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల విషయం ఏమిటి? ఈ విషయంలో కొంత గందరగోళం ఉంది. నిజానికి ‘సర్కారు వారి పాట’ కన్నా ముందే వంశీ పైడిపల్లి సినిమా చేయాల్సి ఉన్నా ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి పరశురామ్ కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పోనీ ఆ తర్వాత సినిమా అయినా వంశీకి చేస్తారా అంటే ఆ మాటే ఎక్కడా వినిపించడం లేదు. ఒకే హీరోని నమ్ముకుని డైరెక్టర్ ఉంటే ఎలా ఉంటుందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. అసలు కరోనా పుణ్యమా అని చాలా మంది డైరెక్టర్లు కాళ్లు ముందేసుకుని కూర్చున్నారు.
ఎప్పుడు షూటింగులు ఉంటాయో తెలియదు, ఎప్పుడు లాక్ డౌన్ ప్రకటిస్తారో తెలియదు, చేస్తున్న సినిమాని వదిలి ఆ హీరో ఎప్పుడు బయటపడతారో తెలియదు. ఇలాంటి అయోమయ వాతావరణం సినీ పరిశ్రమలో నెలకొని ఉంది. ‘సర్కారు వారి పాట’ను జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్కి జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలన్నది సంకల్పం. అది నెరవేరుతుందా లేదా అన్నది కరోనా చెప్పాలి.
ఈ సినిమా షూటింగ్ పూర్తయితే మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రూపొందాలి. కానీ మహేష్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దానికి కారణం లేకపోలేదు. రాజమౌళి ట్రిపుల్ ఆర్ దసరా పూర్తవుతుందా లేదా అన్న సందేహం ఒకటి. మహేష్ తో చేయబోయే సినిమాకి కథ రెడీ కావాలి. రాజమౌళి లాంటి దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు కనీసం ఆరు నెలల సమయం తీసుకునే అవకాశం ఉంది. అందువల్ల మహేష్ మరో సినిమాని ఒప్పుకున్నట్టు తెలిసింది. మహిళా దర్శకురాలు సుధా కొంగరకు మహేష్ ఓకే చెప్పినట్టు సమాచారం.
అలాగే లైన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరి సినిమాని మహేష్ చేయబోతున్నారో తెలియాలి. మహేష్ మీదే ఆశలు పెట్టుకుని ఉన్న వంశీ పైడిపల్లి పరిస్థితి ఏమిటన్నది మరో సందేహం. సత్తా ఉన్న డైరెక్టర్లు ఎక్కువ మంది ఉండటం, స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు తక్కువ ఉండటం వల్ల వారి దయాదాక్షిణ్యాల మీదే దర్శకులు ఆధారపడాల్సి వస్తోంది.
Must Read ;- పెర్సనల్ స్టైలిస్ట్ కి కరోనా పాజిటివ్ .. స్వీయ నిర్బంధంలో మహేశ్ బాబు ఫ్యామిలీ