వైఎస్ విజయమ్మ.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణిగా తెలుగు ప్రజల్లో ఓ రేంజి గౌరవం కలిగిన మహిళా నేత కిందే లెక్క. రాజకీయాల్లో అంతగా యాక్టివ్ గా లేకున్నా.. కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన వైఎస్సార్సీపీకి గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతున్న ఆమె తన భర్త మరణానంతరం పులివెందుల నియోజకవర్గం నుంచి ఓ దఫా ఎమ్మెల్యేగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత జగన్ పులివెందులకు షిఫ్ట్ కాగా.. కడప పార్లమెంటుకు బదులుగా విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన ఆమె ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఇక ఆమె ఎన్నికల్లో పోటీనే చేయలేదు. అయితే ఇటీవలే కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రారంభించిన వైఎస్సార్టీపీకి కూడా గౌరవాధ్యక్షురాలిగానే కొనసాగుతున్నట్లుగానే కనిపిస్తున్నారు. అధికారికంగా ఈ మాట వినబడకపోయినా.. విజయమ్మ వ్యవహారం చూస్తుంటే.. వైఎస్సార్టీపీని బలోపేతం చేసేందుకు ఆమె శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో కూతురు పార్టీకి మరింత దన్ను లభించే దిశగా తన భర్త 12వ వర్థంతిని పురస్కరించుకుని గురువారం నాడు హైదరాబాద్ లో ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తన భర్తతో కలిసి నడిచిన దాదాపుగా 300 మంది కీలక నేతలకు ఆమె ఆహ్వానం పంపారు. ఈ ఆహ్వానానికి పెద్దగా స్పందన లభించదన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఆ నేతలంతా చెల్లాచెదురు
వైఎస్సార్ జీవించి ఉండగా.. ఆయన అడుగుల్లో అడుగులు వేసిన వారు లెక్కలేనంత మంది ఉన్నారు. వైఎస్సార్ అకాల మరణం, ఆ తర్వాత తెలుగు నేల విభజన, హీన స్థితిలోకి కాంగ్రెస్ జారిపోవడం.. వంటి వరుస పరిణామాలతో ఆ నేతలంతా ఇప్పుడు చెల్లాచెదురు అయ్యారనే చెప్పాలి. కొందరు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా.. చాలా మంది నేతలు వైసీపీలోకి చేరిపోయారు. తెలంగాణలో టీఆర్ఎస్ లో చేరిపోయారు. టీడీపీలోనూ కొందరు కీలక నేతలున్నారు. వీరందరినీ ఆహ్వానిస్తూ విజయమ్మ లేఖలు పంపడమే కాకుండా వారికి స్వయంగా ఫోన్ చేసి మరీ సమావేశానికి ఆహ్వానిస్తున్నారట.కేవీపీ రామచంద్రరావు, డి.శ్రీనివాస్, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి నేతలు ఈ భేటీకి హాజరైనా.. ఈ తరహా నేతలంతా ఇప్పుడు వృద్ధ నేతలుగా మారిపోయారు. వీరి రాక వల్ల విజయమ్మకు గానీ, ఆమె ద్వారా షర్మిలకు గానీ ఒరిగేదేమీ లేదనే చెప్పాలి. కొండా సురేఖ దంపతులు, కోమటిరెడ్డి బ్రదర్స్, జీవన్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, జేసీ బ్రదర్స్, జక్కంపూడి రాజా, సామినేని ఉదయభాను.. తదితర నేతలంతా ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. వీరెవరూ ఈ సమావేశానికి వచ్చే ఛాన్సేలేదు. వైఎస్ కు అత్యంత సన్నిహితుడు రఘువీరారెడ్డి ఇప్పుడు ఏకంగా రాజకీయాలే వదిలేశారు. దీంతో ఈయన కూడా ఈ భేటీకి హాజరయ్యే అవకాశమే లేదు.
కష్టాలు కొనితెచ్చుకున్నట్టేగా
వైఎస్సార్ బతికున్న కాలానికి, ఇప్పటి రాజకీలకు అసలు పొంతనే లేదని చెప్పాలి. నాడు యమా యాక్టివ్ గా ఉన్న నేతలు ఇప్పుడు వృద్ద నేతలుగా మారితే.. వైఎస్ చలవతో రాజకీయాల్లోకి వచ్చిన వారు యమా యాక్టివ్ గా ఉన్నారు. అంతేకాకుండా తమ రాజకీయ భవిష్యత్తు కోసం వీరంతా వేర్వేరు పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఏపీకి చెందిన నేతలతో విజయమ్మకు పెద్దగా పని లేకున్నా.. తెలంగాణకు చెందిన వైఎస్ అనుచరులతోనే ఆమెకు అవసరం ఎక్కువ. కూతురు పార్టీని బలోపేతం చేసేందుకు అదే మార్గం కదా. మరి తెలంగాణలో ఇప్పుడు వైసీపీ లేదు. కాంగ్రెస్ లో అంతా వైఎస్ వైరివర్గమే చక్రం తిప్పుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి నేతలు ఇంకా వైఎస్ అడుగుజాడల్లోనే నడుస్తున్నామని చెబుతున్నా.. ఈ భేటీకి హాజరైతే వారిపై కాంగ్రెస్ అధిష్ఠానం కన్నెర్రజేసే ప్రమాదం లేకపోలేదు. ఇక కొండా దంపతులు ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్లో కీలకంగా మారుతున్నారు. ఈ క్రమంలో వారు కూడా ఈ భేటీకి హాజరయ్యే అవకాశమే లేదని చెప్పాలి. ఇలా వైఎస్ కు అత్యంత సన్నిహితులుగానే పేరున్న వీరే విజయమ్మ ఆహ్వానాన్ని మన్నించలేకపోతే..క చోటామోటా నేతలు ఎలా వస్తారు. ఈ లెక్కన వైఎస్ విజయమ్మ సమావేశానికి కీలక నేతలంతా డుమ్మా కొట్టడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.