(విజయవాడ నుంచి లియోన్యూస ప్రతినిధి)
విజయవాడలో జరిగిన అగ్ని ప్రమాదానికి గుంటూరులో ఉండే ఆస్పత్రి శాఖకు ఎంత మేరకు సంబంధం ఉంటుంది? జనాలకు ఇలాంటి లాజిక్ కనిపిస్తుంది గానీ.. దర్యాప్తు అధికార్లకు మాత్రం.. సమగ్ర దర్యాప్తుకు అదే దారి అనిపిస్తోంది. రమేష్ హాస్పిటల్ ప్రాంగణంలోనే ప్రమాదం జరిగి ఉంటే గనుక.. వారిని పూర్తిగా బాధ్యుల్ని చేయడం ఎవ్వరూ తప్పుపట్టరు. హోటల్లోని తాత్కాలిక కోవిడ్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగితే.. హాస్పిటల్ యాజమాన్యం పరారయ్యే పరిస్థితి సృష్టింపబడడం.. రాజకీయ కోణాలనే విశదపరుస్తోంది.
విజయవాడలో స్వర్ణా ప్యాలెస్ హోటల్ తెలియని వారుండరు. గత వారం ఆ హోటల్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో అందులో చికిత్స పొందుతున్న 40 మంది రోగుల్లో 10 మంది చనిపోయారు. అయితే ఆ హోటల్లో తాత్కాలికంగా రమేష్ హాస్పటల్ కోవిడ్ కేర్ సెంటర్గా మార్చింది. ప్రభుత్వం ఇందుకు అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇలాంటివి ఒక్క విజయవాడలోనే 29 సెంటర్లు నడుస్తున్నాయి. అయితే హఠాత్తుగా ఉన్నట్టుండి గత వారం స్వర్ణా ప్యాలెస్ లో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అగ్నికి ఆహుతి అయ్యాయి. ఆ సమయంలో 40 మంది రోగులు, మరో పది మంది ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. 10 మంది స్పాట్లో చనిపోయారు. దీనిపై ప్రభుత్వ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వర్ణా ప్యాలెస్ తగలబడిందనేది ప్రాధమిక అంచనా. ఇక్కడినుంచి రాజకీయాలకు బీజం పడింది
స్వర్ణా ప్యాలెస్ హోటల్లో కోవిడ్ సెంటర్ నడుపుతోంది రమేష్ హాస్పటల్స్. ఈ సంస్థ టీడీపీ సానుభూతి పరుడు ప్రముఖ డాక్టర్ రమేష్ కు చెందినవి. ఆ ప్రముఖ డాక్టర్ ప్రతి ఎలక్షన్ లో టీడీపీ అధినాయకత్వానికి పెద్ద ఎత్తున ఫండింగ్ చేస్తున్నాడని వైసీపీ నేతలు ఆరాతీశారు. ఎలాగైనా రమేష్ హాస్పటల్ యాజమాన్యంపై ఆ పార్టీకి దుగ్ధ ఉంది. అవకాశం కోసం ఎదురు చూస్తూవచ్చారు. వారికి అగ్ని ప్రమాదం రూపంలో అవకాశం అందివచ్చింది. ఇంకేముంది ఇక వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు.
రమేష్ హాస్పటల్ యాజమాన్యానికి విజయవాడలో రెండు ఆస్పత్రులతోపాటు ఏపీలో మరో నాలుగు ప్రధాన జిల్లా కేంద్రాల్లో ఆస్పత్రులు ఉన్నాయి. ఏటా 600 కోట్ల టర్నోవర్తో ఇవి నడుస్తున్నాయి. ఈ ఆస్పత్రుల యజమాని రమేష్ టీడీపీ సానుభూతిపరుడు. పార్టీలో పదవులు లేకపోయినా, ఎలక్షన్ సమయానికి టీడీపీ అధినాయకత్వానికి పెద్ద ఎత్తున ఫండింగ్ చేస్తున్నారని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎలాగైనా రమేష్ హాస్పటల్స్ ను మూసివేయించాలని నిర్ణయించారు. అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి పత్రిక సాక్షిలో పెద్ద ఎత్తున ప్రతికూల కథనాలు రాయించారు. ప్రయివేటు ఆస్పత్రులు ఎక్కడైనా వ్యాపార కోణంలోనే నడుస్తున్నాయి. ఒక్క రమేష్ హాస్పటల్ మాత్రమే ప్రజలను పీల్చి పిప్పి చేస్తుందని సాక్షిలో ప్రధానంగా ప్రచురించి జనాలను నమ్మించాలని చూశారు. ఇందులో వారు ఎంత వరకు సఫలీకృతం అవుతారో కాలమే తేల్చనుంది.
ఇక రమేష్ హాస్పటల్ గుంటూరు బ్రాంచి సీఈవోగా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు మమత పనిచేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే విజయవాడ స్వర్ణా ప్యాలెస్ ప్రమాదానికి గుంటూరు రమేష్ హాస్పటల్ కు ఎలాంటి సంబంధిం లేదు. కనీసం అక్కడ నుంచి ఒక్క కరోనా రోగిని కూడా స్వర్ణా ప్యాలెస్ కు పంపలేదు. అయినా వైసీపీ నేతలు వదల్లేదు. ఎప్పటి నుంచి రాయపాటిపై గుర్రుగా ఉన్న సీఎం అవకాశం కోసం ఎదురు చూశారు. అగ్నిప్రమాదం రూపంలో అవకాశం అందిపుచ్చుకున్నారు. రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు కూడా టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. అందుకే వైసీపీ నేతలు గుంటూరు రమేష్ హాస్పటల్ ను కూడా వదల్లేదు.
సాధ్యమైనతం త్వరలో అగ్ని ప్రమాదానికి రమేష్ హాస్పటల్ బాధ్యత వహించేలా రిపోర్టు రానుందని సమాచారం. ఆ తరవాత రమేష్ హాస్పటల్స్ ను నోటీసులు జారీచేసి మూసివేయించాలనేది వైసీపీ నేతల ఆలోచనగా తెలుస్తోంది. లేదా రాయపాటి ప్యామిలీ వైసీపీలో చేరితే కథ సుఖాంతం అయ్యే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.