నిజమేనండోయ్.. ఇప్పుడంతా సర్వేల కాలమే నడుస్తున్నట్టుగా ఉంది. సీఎంగా తన పాలన రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. నిత్యం తనకు పనిచేసే సర్వే సంస్థతోనే తనపైనా, తన పార్టీపైనా జనాల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునేందుకు సర్వే చేయించుకున్నారట. ఈ విషయం వెలుగు చూసినంతనే జగన్ పాలనపై జనాభిప్రాయం ఇదేనంటూ సర్వేల మీద సర్వేలు వచ్చి పడుతున్నాయి. ఇలాంటి సర్వేల్లో సోమవారం నాడు వైసీపీ రెబల్ ఎంపీ, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా తాను చేయించిన సర్వే అంటూ ఓ సర్వేను బయటపెట్టేశారు. ఈ సర్వే వైసీపీని మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. రఘురామరాజు చేయించిన సర్వే ఫలితాలను ఆయన విడుదల చేయకున్నా.. అంతిమ ఫలితాలను మాత్రం వెల్లడించారు. ఈ సర్వేలో జగన్ పార్టీకి కనీసం 50 సీట్లు కూడా రావని తేలిపోయిందట. అయితే కుప్పంలో మాత్రం చంద్రబాబును ఢీకొట్టడం జగన్ చేత కాదని కూడా ఈ సర్వేలో తేలిందట.
సర్వేలో తేలిందేంటంటే..?
రఘురామ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. జగన్ నేతృత్వంలోని వైసీపీకి 50 సీట్ల కంటే తక్కువే వస్తాయట. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే.. కుప్పం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పుంగనూరు, తంబళ్లపల్లె ఎమ్మెల్యేలుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డిలు మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా గెలవరట. ఈ లెక్కన కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడించాల్సిందేనన్న జగన్ ప్లాన్ ఇప్పుడప్పుడే వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదని చెప్పాలి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే.. భీమవరం, కోవూరు, నిడదవోలు ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, తానేటి వనిత, శ్రీనివాస నాయుడులు మినహా ఏ ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా గెవలరట. ఇక నరసాపురం పార్లమెంటులో జగన్ కంటే తానే పాపులర్ అని చెప్పిన రఘురామ.. తన గెలుపు ఖాయమేనని చెప్పారు.
జగన్ పై యుద్ధమే
జగన్ పార్టీ టికెట్ పైనే ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టిన రఘురామరాజు.. తెలుగు మీడియంపై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో జగన్ తో ఓ సారి భేటీ అయిన ఆయన తన మనసులోని మాటను బయటపెట్టానని ఏదో అలా కవర్ చేసుకున్నారు గానీ.. ఆ తర్వాత విపక్షాల కంటే కూడా జగన్ పై రఘురామనే ఓ రేంజిలో విరుచుకుపడుతున్న వైనం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా తాను గెలిచిన పార్టీ అధినేత అని కూడా చూడకుండా ఏకంగా జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కలకలం రేపారు. ఇందుకు కక్షసాధింపు అన్నట్లుగా జగన్ సర్కారు తనను అరెస్ట్ చేయడంతో రఘురామ దాదాపుగా బరస్ట్ అయిపోయారు. ఈ క్రమంలో జగన్ సర్కారు తీసుకునే ప్రతి నిర్ణయంపైనా రఘురామ తనదైన శైలి ఘాటు వ్యాఖ్యలతో జగన్ అండ్ కోపై విరుచుకుపడుతున్నారు. మొత్తంగా తనకు ఎంపీ పదవి దక్కేలా చేసిన పార్టీనే ఘోరంగా ఓడిపోతుందని రఘురామ సర్వే తేల్చి చెప్పడం గమనార్హం.
Must Read ;- ఆ మంత్రుల సంఖ్య 9 నుంచి 11కి జంప్