నిజమే కదా. ఆవు చేనులో మేస్తూ ఉంటే.. దాని వెంటే వెళ్లిన దూడ గట్టున మేయదు కదా. ఆవు వెంటే దూడ కూడా చేనులోనే మేస్తుంది కదా. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ సందర్భంగా సోమవారం నాడు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇదే సీన్ కనిపించింది. జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ తో పాటు ఏ2 నిందితుడిగా ఉన్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి కూడా బెయిల్ పైనే ఉన్నారు కదా. జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ ఇదివరకే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సాయిరెడ్డి బెయిల్ ను కూడా రద్దు చేయాలంటూ రఘురామ పిటిషన్ వేశారు. దీనిపై ఇదివరకే సీబీఐ కోర్టు సాయిరెడ్డితో పాటు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. రఘురామ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
సాయిరెడ్డి ఏమంటారంటే..?
కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోని సాయిరెడ్డి గత విచారణ సందర్భంగా తనదైన శైలి వాదనను వినిపించారు. కోర్టు నుంచి నేరుగా తనకు నోటీసులు అందలేదని, పిటిషనర్ ద్వారా వచ్చిన నోటీసులకు తాను స్పందించేది లేదని తేల్చి చెప్పిన సాయిరెడ్డి.. అసలు రఘురామ లాయర్ల నుంచి నోటీసుల స్వీకరణకు కూడా సిద్ధపడలేదు. ఈ తరహా వైఖరిపై కోర్టు ఇదివరకే సాయిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చేసేది లేక సోమవారం నాడు సాయిరెడ్డి తన కౌంటర్ ను దాఖలు చేశారు. ఈ కౌంటర్లో గతంలో జగన్ ప్రస్తావించిన అంశాలనే సాయిరెడ్డి ప్రస్తావించారు. పిటిషనర్ పై సీబీఐతో పాటు క్రిమినల్ కేసులు ఉన్నాయని సాయిరెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా పబ్లిసిటీ స్టంట్ కోసమే పిటిషన్ దాఖలైందని కూడా సాయిరెడ్డి ఆరోపించారు. ఈ రెండు కారణాలను పరిగణలోకి తీసుకుని రఘురామ పిటిషన్ ను డిస్మిస్ చేయాలని ఆయన కోర్టును కోరారు. దీనితో పిటిషనర్ వాదనలను కోర్టు కోరగా.. అందుకు సమయం కావాలని పిటిషనర్ తరఫున న్యాయవాది కోరారు. దీంతో విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
ఇదంతా జగన్ చెప్పిందే కదా
సాయిరెడ్డి కౌంటర్ చూసిన వెంటనే గతంలో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ సందర్భంగా జగన్ కూడా ఇదే వాదనను వినిపించిన సంగతి తెలిసిందే. రఘురామపై సిబీఐ, క్రిమినల్ కేసులున్నాయని, పబ్లిసిటీ కోసమే ఆయన పిటిషన్ దాఖలు చేశారని జగన్ తన కౌంటర్ లో ఆరోపించారు. రాజకీయ కారణాలతో దాఖలు చేసిన సదరు పిటిషన్ ను డిస్మిస్ చేయాలని జగన్ కోర్టును కోరారు. అయితే కోర్టు జగన్ వాదనను తిరస్కరించి.. రఘురామ పిటిషన్ పై విచారణ చేపట్టింది. సీబీఐ కౌంటర్ దాఖలుకు చాలా సమయమే తీసుకోవడంతో ఈ పిటిషన్ పై కోర్టు ఇంకా తుది తీర్పు వెల్లడించలేదు. తదుపరి విచారణలో జగన్ బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. మరి జగన్ వాదనలతోనే సాగుతున్న సాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణ ఎంతకాలం సాగుతుందో చూడాలి.