ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలపై పోరు సాగించే క్రమంలో రాజకీయ నేతలపై పలు కేసులు నమోదువుతున్న విషయం తెలిసిందే. ఇవేమీ అంత పెద్ద కేసులు కూడా కావు. కోర్టులో దోషిగా తేలే అవకాశాలు కూడా చాలా తక్కువే. ఇందుకు ఉదాహరణగా తెలంగాణ ఉద్యమంలో ఆందోళనల్లో పాలుపంచుకుని ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డు తగిలారని చాలా మందిపై కేసులు నమోదయ్యాయి. వాటిలో మెజారిటీ కేసులు రద్దైపోయాయి. కొన్ని కేసులు ఇంకా కోర్టుల్లో ఉన్నా.. వాటితో ఆయా నేతలకు ఎలాంటి ఇబ్బంది లేదనే చెప్పాలి. అయితే క్రిమినల్ కేసుల్లో చిక్కుకునే నేతల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీహార్ సీఎంగా, కేంద్ర మంత్రిగా ఓ వెలుగు వెలిగిన లాలూ ప్రసాద్ యాదవ్ కు ఇప్పుడు ఏ గతి పట్టిందో.. క్రిమినల్ కేసుల్లో చిక్కుకునే నేతలకు ఆ తరహా పరిస్థితి నిత్యం పొంచి ఉందనే చెప్పాలి. ఈ కేసుల్లో దోషిగా తేలితే.. కోర్టు విధించే జైలు శిక్షతో వెనువెంటనే అనర్హత వేటు పడిపోతుంది. శిక్షా కాలం ముగించుకుని బయటకు వచ్చాక కూడా ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి ఉండదు. ప్రభుత్వ పదవీ చేపట్టేందుకు వీలు కాదు. అంటే.. రాజకీయ నేతలు చాలా జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులన్న మాట.
ఏడీఆర్ నివేదిక చెప్పిందిదే
అయినా ఇప్పుడు ఈ విషయాన్ని ఇంత దీర్ఘంగా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. తీవ్ర అభియోగాలతో కూడిన క్రిమినల్ కేసులు నమోదైన నేతలు ఏపీలో ఏకంగా 24 మంది ఉన్నారు. వీరిలో 22 మంది అధికార పార్టీ వైసీపీకి చెందిన వారే. ఇద్దరు మాత్రమే విపక్షం టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఈ జాబితాలో ఉన్నారు. ఈ సంచలన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా బయటపెట్టింది. 2019-21 మధ్య జరిగిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా వివరాలు సేకరించినట్లు ఏడీఆర్ చెప్పింది. సెక్షన్ 8 (1), (2), (3) ప్రకారం వీళ్ళ పై నమోదైన కేసులు రుజువైతే తీవ్రమైన శిక్ష పడటం ఖాయమని కూడా ఏడీఆర్ చెబుతోంది. ఈ కేసుల్లో ఒకసారి శిక్షపడితే వీరందరిపై అనర్హత వేటు పడుతుంది. శిక్షాకాలం మొదలైన రోజు నుంచి అనర్హత వేటు అమల్లోకి వచ్చేస్తుంది. అలాగే జైలు నుంచి విడుదలైన రోజు నుంచి అనర్హత వేటు మొదలవుతుందట. అంటే జైలునుండి విడుదలైన ఆరేళ్ళపాటు శిక్ష అనుభవించిన ప్రజా ప్రతినిధులు ఏ ఎన్నికల్లోను పోటీ చేయడానికి లేదు. అలాగే ఎలాంటి పదవులను అందుకోకూడదు.
జాబితాలో ఎవరెవరు?
ఏడీఆర్ విడుదల చేసిన జాబితాలో 24 మంది నేతలు ఉండగా.. వారిలో 24 మంది వైసీపీ నేతలే ఉన్నారు. వీరిలో నలుగురు ఎంపీలు మిథున్ రెడ్డి, మార్గాని భరత్, బెల్లాన చంద్రశేఖర్, ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు. ఇక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తో పాటు మరో 17 మంది ఎంఎల్ఏలు కూడా వైసీపీకి చెందిన వారే ఉన్నారు. అదే మాదిరిగా ఈ తరహా కేసులు నమోదైన టీడీపీ ఎమ్మెల్యేల్లో కరణం బలరామకృష్ణమూర్తి, వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. అయితే వీరిద్దరూ టీడీపీ టికెట్లపైనే ఎమ్మెల్యేలుగా గెలిచినా.. అసెంబ్లీ రికార్డుల ప్రకారం వీరిద్దరూ టీడీపీ ఎమ్మెల్యేల జాబితాలోనే ఉన్నా.. ఇద్దరూ వైసీపీకి మారిపోయారనే చెప్పాలి. అంటే. ఏడీఆర్ విడుదల చేసిన జాబితాలో ఉన్న మొత్తం 24 మంది కూడా వైసీపీకి చెందిన వారుగానే పరిగణించాలి. అంటే.. ఏ క్షణాన్నైనా అనర్హత వేటు పడే ప్రమాదం పొంచి ఉన్న ప్రజా ప్రతినిధులంతా వైసీపీ వాళ్లేనన్న మాట.
Must Read ;- వైసీపీని వీడి.. టీడీపీ వైపుగా దళితులు