కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన పంథాకు విరుద్ధంగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. జీడీపీ 23.9 శాతానికి పతనమై 40 సంవత్సరాల రికార్డు నెలకొల్పింది. దీనిపై రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియచేశారు. మోడీ మన దేశానికి తీసుకువచ్చిన విపత్తులు ఇవేనంటూ ఆయన వరుసగా ప్రశ్నలు సంధించారు. 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో 12 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని వారిని ఆదుకోవలసిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కేంద్రం తీసుకున్న చెత్త నిర్ణయాలతో జీడీపీ 23.9 శాతానికి దిగ జారిందని మండిపడ్డారు. కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్న రాష్ట్రాలను ఆదుకోవలసిన కేంద్రం బకాయిలు కూడా చెల్లించేందుకు సిద్ధం లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం రుణాలు తీసుకొని రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణాలను ఆర్బీఐ ద్వారా తీసుకుంటే రాష్ట్రాల మీద భారం పడుతుందని గుర్తు చేసిన రాహుల్ కేంద్రమే అసలు, వడ్డీ కట్టాలని సూచించారు. ప్రపంచంలో ఏ దేశంలో నమోదు కాని స్థాయిలో కరోనా కేసులు, మరణాలు ఇక్కడ సంభవిస్తుండటం చూస్తుంటే కరోనా కట్టడిలో కేంద్రం విఫలమైందని అర్థమవుతోందని వెల్లడించారు. సరిహద్దుల వద్ద తీవ్రత నెలకొనడం కూడా మోడీ సర్కార్ వైఖరనే విమర్శలు చేశారు.
కరోనా ‘గాడ్ ఆఫ్ యాక్ట్’ అంటూ పేర్కొన్న ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ పై కాంగ్రెస్ వర్గాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. చేతగాని తనాన్ని దేవుడి చర్య అంటూ చెప్పడమేంటని చిదంబరం ప్రశ్నించారు. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో చేసిన ట్వీట్ ను చిదంబరం తాజాగా పోస్ట్ చేసి ఎద్దేవా చేశారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడిందని, యువతకు ఉద్యోగాలు కావాలి. సమయాన్ని అనవసర రాజకీయ చర్యలకు కాకుండా ఆర్థికవ్యవస్థను బాగు చేసేందుకు కేటాయించాలని’ మోడీ అప్పట్లో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్నే ఈ రోజు చిదంబరం గుర్తు చేస్తూ తాను కూడా ఇప్పుడు ప్రధానికి చెప్పదలుచుకున్నది అదే అంటూ చురకలంటించారు.