చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాను రూపొందిస్తున్నాడు. దేవాలయ భూముల ఆక్రమణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. అవినీతిదారులపై తిరగబడే బాధ్యత కలిగిన పౌరుడి పాత్రలో చిరంజీవి కనిపించనున్నాడని చెబుతున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకు చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగు జరుపుకుంటోంది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో ప్లాన్ చేశారు.
ఈ మధ్యకాలంలో చిరంజీవి సినిమాలను చరణ్ తన సొంత బ్యానర్ పైనే నిర్మిస్తూ వస్తున్నాడు. ఆ సినిమాల షూటింగు సమయంలో తండ్రిని కలుసుకున్నట్టుగా ఉంటుందనీ .. సినిమా అవుట్ పుట్ కి సంబంధించిన విషయాలు తెలుసుకున్నట్టుగా ఉంటుందని ఆ సెట్స్ కి చరణ్ వెళుతూ ఉండటం జరుగుతూ వస్తోంది. అలాగే రీసెంట్ గా ఆయన ‘ఆచార్య’ సెట్స్ పై మెరిశాడు. ఉదయాన్నే ‘ఆచార్య’ సెట్స్ పైకి చేరుకున్న ఆయన, అక్కడ కొరటాల శివతో కబుర్లు చెబుతూ ‘చాయ్’ కొడుతూ కనిపించాడు. అందుకు సంబంధించిన ఫోటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
‘ఆచార్య’ సినిమా షూటింగు విశేషాలు .. ఇతర వ్యవహారాలను గురించి కొరటాల – చరణ్ కొంతసేపు కబుర్లు చెప్పుకున్నారట. ఈ సినిమాలో చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. అదే నిజమైతే ఆ పాత్ర ప్రస్తావన వచ్చే ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఎప్పటి నుంచో చరణ్ తో ఒక సినిమా చేయాలని కొరటాల అనుకుంటున్నాడు. గతంలో ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేయాలనుకుంటే, కొన్ని కారణాల వలన చర్చల దశలోనే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అప్పటి నుంచి ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ అయ్యారు. త్వరలో తామిద్దరం ఓ సినిమా చేయాలనే ప్రస్తావన మాటల మధ్యలో వచ్చే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అందులో వాస్తవముంటే అభిమానులకు అంతకన్నా కావాల్సిందేముంటుంది?