భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో.. రహానే కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటున్నాడు. క్లాసిక్ సెంచరీతో మెప్పించాడు. ఆట ముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. అడిలైడ్ అపజయాన్ని అల్లంత దూరాన పెడుతూ బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు దూసుకెళుతోంది. బౌలర్ల ధాటికి ఆసీస్ కుప్పకూలింది. టీమిండియా మాత్రం సరైన సమయంలో మంచి ప్రతిభ చూపుతోంది. సొంతగడ్డపై ఆసీస్ ను ముప్పు తిప్పలు పెడుతోంది. మన బ్యాట్స్ మెన్ ధాటికి ఆస్ట్రేలియా బౌలింగ్ తేలిపోతోంది. రహానె కెప్టెన్ ఇన్నింగ్స్ తో మెరిపించడం శుభ పరిణామం.
రహానె కెప్టెన్ ఇన్నింగ్స్..
బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. టీమిండియా తొలి ఇన్నింగ్సులో ఐదు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో కెప్టెన్ అజింక్యా రహానె(104 నాటౌట్) అత్యున్నతమైన ఆటతీరు కనబర్చాడు. టెస్టుల్లో అతనికిది 12వ సెంచరీకాగా, కెప్టెన్గా తొలి సెంచరీ. తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన అజింక్య రహానె తొలి రోజు జట్టును నడిపించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి.
నాలుగు స్వదేశీ.. ఎనిమిది విదేశీ..
బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత సారథి రహానె తీరును క్రికెట్ ప్రేమికులు తెగ పొగిడేస్తున్నారు. జట్టును నడిపించిన తీరుతోపాటు అతనూ బాధ్యతాయుతంగా ఆడిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రహానె సెంచరీతో అందరి అంచనాలను పదిలం చేశాడు. రహానె మొత్తం 12 శతకాలు చేయగా… ఇందులో నాలుగు స్వదేశంలో చేయగా.. ఎనిమిది విదేశీ గడ్డపై సాధించాడు.
ఆధిక్యంలో టీమిండియా..
36/1 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ (45), చతేశ్వర పుజారా (17) లను ప్యాట్ కమిన్స్ ఔట్ చేయగా.. క్రీజులో నిలదొక్కుకున్న హనుమ విహారీని(66 బంతుల్లో 21) లయన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో టీమిండియా 116 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పంత్.. రహానేతో కలిసి కొంచెం సేపు ఆస్ట్రేలియా బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కానీ, దూకుడైన షాట్ ఆడబోయి 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ బాట పట్టాడు. టీమ్ఇండియా రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 277/5 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రహానే 104, జడేజా 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 195 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. బుమ్రా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు.
శుభ్మన్ గిల్ శుభారంభం..
బాక్సింగ్ డే మ్యాచ్ తో టెస్టు అరంగేట్రం చేసిన భారత ఆటగాడు శుభ్మన్ గిల్ అదరగొట్టాడు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ మ్యాచ్లో 45 పరుగులు చేసి కొద్దిలో అర్ధ శతకం చేజార్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఘనత సాధించాడు. ఆసీస్ జట్టుపై టెస్టు అరంగేట్రంలోనే ఎక్కువ పరుగులు చేసిన మూడో భారత బ్యాట్స్మన్గా నిలిచాడు. ఇతడి కంటే ముందు మయాంక్ అగర్వాల్ (2018లో 76 పరుగులు), మాజీ క్రికెటర్ దత్తు ఫడ్కర్ (51) ఉన్నారు.