ఏపీ రాజధానిని అమరావతినుంచి విశాఖకు తరలిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వెళ్తున్న ప్రధాని నరేంద్రమోడీకి తెలుగువారైన రామభక్తులు ఒక వెరైటీ విజ్ఞప్తి చేస్తున్నారు. ‘‘అయ్యా తమరు దయచేసి తమ చేతుల మీదుగా రామాలయానికి శంకుస్థాపన చేయకండి’’ అనేది వారి విజ్ఞప్తి. ఇంతకీ ఎందుకలా విన్నవించుకుంటున్నట్టు…?
2015 అక్టోబరు 22న ఏపీ రాజధానిగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీనుంచి వచ్చారు. శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి కూడా కానుకగా ఇచ్చారు. అంతకు మించి.. రాష్ట్రప్రభుత్వం నుంచి ఎన్ని రకాల విజ్ఞప్తులు వెళ్లినప్పటికీ.. రాజధాని నిర్మాణం కోసం ఎలాంటి ప్రత్యేకమైన మద్దతు ఇవ్వకుండా.. చేతులు బిగించుకుని కూర్చున్నారు. దాంతో అమరావతిలో రాజధాని నిర్మాణాలు మందగమనంలోనే సాగాయి.
2019లో రాష్ట్రంలో అధికారం చేతులు మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కారు.. రాజధానిని విశాఖకు తరలించాలని నిర్ణయం తీసుకుంది. కాకపోతే దీనికి ‘రాజధాని వికేంద్రీకరణ’ అని పేరు పెట్టారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ మాత్రమే విశాఖకు వెళ్తుందని, అమరావతిలో శాసన రాజధాని కొనసాగుతుందని, చీఫ్ జస్టిస్ ఉండే హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు కావాలని నిర్ణయించారు. ఆ రకంగా అమరావతిలో రాజధాని ఆశలకు పూర్తిగా గండిపడింది.
తెలుగుదేశం మండలిలో ఉన్న మెజారిటీని వాడుకుని, సాంకేతికంగా ఈ నిర్ణయాన్ని అడ్డుకుంది. జగన్ సర్కారు కూడా.. అలా సాంకేతిక అంశాలను వాడుకుంటూ గవర్నరు ద్వారా బిల్లును ఆమోదింపజేసుకుంది.
మోడీకి లింక్ ఏంటి…
రాష్ట్రప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటోంటే.. దాన్ని అడ్డుకోకుండా మౌనం పాటిస్తున్నందుకు అమరావతి ప్రాంత ప్రజలందరికీ మోడీ సర్కారు మీద ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. మోడీ స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతి నగరం.. దిక్కులేకుండా పోయిన నేపథ్యంలో.. ఆయన హస్తవాసి చెడ్డదన్నట్టుగా వారు ఒక ప్రచారం ప్రారంభించారు. ‘‘అయ్యా మోడీగారు.. అయోధ్యలో రామాలయం పూర్తి కావాలని మాకందరికీ కోరికగా ఉంది. దయచేసి తమ చేతులతో శంకుస్థాపన చేయకండి..’’ అంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టుల్ని వైరల్ చేస్తున్నారు. హిందూ శ్రేయస్సును కోరుకుంటూ.. రామాలయం పూర్తి కావాలనేదే లక్ష్యం అయితే.. ఆయన చేతుల్తో శంకుస్థాపన చేయవద్దని ‘రామభక్తు’ల పేరిట పోస్టులు వెల్లువలా వెళ్తున్నాయి.
ఇలాంటి పోస్టులు వైరల్ కావడం అనేది ప్రధాని నరేంద్ర మోడీ దాకా వెళ్తుందని అనుకోలేం గానీ.. ఏపీలో ఉండే భాజపా నాయకులు… కళ్లు తెరచి.. తమ పార్టీ నాయకుడి హస్తవాసికే కళంకంగా మారుతోందని గ్రహించి.. ఏమైనా చురుగ్గా కదులుతారేమో చూడాలి.