పండుగలు.. పర్వదినాల్లో.. పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేయడం మన ఆచారం. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. తిరుమల తిరుపతి దేవస్థానం.. రథసప్తమి పర్వదినం రోజున.. స్పెషల్ మెనూ సిద్దం చేసింది. తిరుమల కొండ మీద భక్తులకు 14 రకాల వంటకాలతో అన్న ప్రాసదం పంపిణీ చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. శ్రీవారి సేవ కోసం వచ్చిన 3 వేల 700 మంది వాలంటీర్ల సాయంతో అన్న ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేశారు.
రథసప్తమి వేడుకల కోసం రెండున్నర లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారనే అంచనాతో దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1260 మంది పోలీసులు.. 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో భక్తులకు భద్రతా ఏర్పాట్లు చేశారు. రథసప్తమి రోజు తిరుమతి నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులు 2 వేల 300 ట్రిప్పులు తిరిగేలా షెడ్యూల్ రూపొందించారు. స్వామి వారి వాహన సేవలకు ముందు.. తిరు మాడ వీధుల్లో 56 కళా బృందాలతో భక్తులను ఆకట్టుకొనేలా సాంస్కృతిక కళా ప్రదర్శనలు నిర్వహిస్తారు.
రథసప్తమి రోజు ఏడు వాహన సేవలతో మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం 5 గంటల 30 నిముషాలకు సూర్యప్రభ వాహనంతో శ్రీవారి సేవలు ప్రారంభమవుతాయి. రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనసేవతో వాహనసేవలు ముగుస్తాయి. రథసప్తమి వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు తరలి వస్తున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని జనవరి 24 నుంచి 26 వరకు సర్వదర్శనం టికెట్ల జారీ రద్దు చేశారు.











