(విజయవాడ నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందంటారు. అయితే కావొచ్చు గానీ నేడు ఉల్లి కోసేప్పుడు కాకుండా కొనేప్పుడే కంట కన్నీరు వస్తోంది. కిలో ఉల్లి ధర రూ.120 తాకింది. దీంతో సామాన్యులు ఉల్లిగడ్డలు కొనడం మానేశారు. కిలో రూ.40 దాటగానే హోటళ్లలో ఉల్లి ముక్కలు అడగవద్దని బోర్డులు పెట్టేశారు. అసలు ఉల్లి ధరలు పెరగడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? డిమాండ్ కు సరిపడా పంట దిగుబడులు ఉన్నా ఉల్లి ధరలు ఎందుకు కొండెక్కి కూర్చున్నాయి? పండిన పంటంతా ఎటుపోతోంది? ఉల్లి ధరలు ఆకాశానికి తాకడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు ఏమైనా సంబంధం ఉందా? వివరాలు లియోన్యూస్ పాఠకుల కోసం…
భారీగా సరుకు వస్తున్నా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి
డిమాండ్ కు తగ్గ సప్లయ్ లేకపోతే ఏ వస్తువు ధర అయినా పెరుగుతుంది. ఇది ఆర్థికశాస్త్రం చెప్పే సూత్రం. కానీ మార్కెట్లో ఉల్లి దిగుబడులు గణనీయంగా వచ్చాయి. కానీ ఉల్లి ధరలు మాత్రం దూసుకుపోతున్నాయి. ఇక్కడ ఆర్థిక సూత్రాలు పనిచేయడం లేదా? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది వర్షాలు బాగా కురిశాయి. ఖరీఫ్ ఉల్లి దిగుబడులు గణనీయంగా వచ్చాయి. కర్నూలు ఉల్లి మార్కెట్ కు రోజుకు 400 లారీల సరకు వస్తోంది. అటు మహారాష్ట్ర నాందేడ్ మార్కెట్ కు కూడా రోజుకు 700 లారీల సరకు వస్తోంది. ఆయా మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.40 మించడం లేదు. కానీ వినియోగదారుడుకి చేరేసరికి కిలో ఉల్లి రూ.100 దాటుతోంది. మధ్యలో ఏ జరుగుతుందో ఈజీగానే అర్థం చేసుకోవచ్చు.
ఉల్లి పంట దిగుబడి రాలేదని కార్పొరేట్ శక్తుల విషప్రచారం
ఈ ఏడాది ఎక్కువ వర్షాలు కురిసి ఉల్లి పంట పోయిందని విష ప్రచారం చేస్తున్నారు. ఖరీఫ్లో ఉల్లి పంట వర్షాధారంగానే పండుతుంది. రబీలో నీటి సదుపాయం ఉన్న రైతులు ఉల్లి సాగు చేస్తారు. ఖరీఫ్ ఉల్లి దిగుబడులు కూడా గణనీయంగానే వచ్చాయి. ఎకరాకు సగటున వంద క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రైతుకు కిలోకు రూ.40 ధర దక్కుతోంది. వ్యవసాయ మార్కెట్లలో కొన్ని కార్పొరేట్ శక్తులు పెద్ద ఎత్తున ఉల్లి కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయచట్టాలు పెద్ద ఎత్తున సరుకు నిల్వ చేసుకునేందుకు అనుమతించాయి. ఈ చట్టాలను ఆసరాగా చేసుకుని రిటెయిల్ చెయిన్ మార్కెట్లు నిర్వహిస్తున్న బడా వ్యాపారులు, ఆన్ లైన్ వ్యాపారాలు నిర్వహించే కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున ఉల్లి కొనుగోలు చేస్తున్నాయి.
ఖరీఫ్ పంట మరో నెల రోజులు వచ్చే అవకాశం ఉంది. ఆ తరవాత మరో 4 నెలల వరకు మార్కెట్ యార్డులకు సరకు రాదు. రబీ పంట ఏప్రిల్ మాసంలో మార్కెట్లకు చేరుతుంది. ఇప్పుడే భారీగా ఉల్లి కొనుగోలు చేసి కార్పొరేట్ శక్తులు నిల్వ చేస్తున్నాయని తెలుస్తోంది. భారీగా సరకు నిల్వ చేసి ధరలు పెంచి విండ్ ఫాల్ లాభాలు దండుకునేందుకు
బడా పారిశ్రామిక వేత్తలు ఎత్తులు అమలు చేస్తున్నారు. అందుకే ఉల్లి ధర నెల రోజుల్లోనే కిలోకు రూ.40 నుంచి రూ.100 దాటిపోయింది.
ఏపీ ప్రభుత్వం కిలో రూ.40కి, తెలంగాణ ప్రభుత్వం కిలో రూ.35
మార్కెట్లో దూసుకుపోతున్న ఉల్లి ధరలకు బ్రేకులు వేసేందుకు ఏపీ ప్రభుత్వం కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లిగడ్డలు కొనుగోలు చేసి, లాభనష్టాలు లేకుండా అదే ధరకు రైతు బజార్లలో విక్రయించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి కొంత నష్టం భరించి అయినా సరే కిలో ఉల్లి రూ.35కు సరఫరా చేస్తోంది. కానీ ప్రయివేటు వ్యాపారులు మాత్రం వినియోగదారులను దోచుకుంటున్నారు. కిలో ఉల్లి రూ.100 నుంచి రూ.120 దాకా అమ్ముతున్నారు. అయినా కొత్తగా వచ్చిన చట్టాలతో వ్యాపారుల వద్ద పెద్ద ఎత్తున నిల్వ ఉన్న ఉల్లిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బయటకు తీయలేకపోతున్నాయని తెలుస్తోంది.
కేంద్రం ఆఫర్ కిలో రూ.26
కేంద్ర ప్రభుత్వం ఉల్లి దిగుమతులపై ఆంక్షలు ఎత్తి వేసింది. కిలో ఉల్లి గడ్డలు రూ.26కు సరఫరా చేయాలని నిర్ణయించింది. సరకు కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలకు ఉల్లి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కానీ బ్లాక్ మార్కెట్ ను అదుపు చేసే చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. కొత్త వ్యవసాయ చట్టాలు ఎంత పని చేశాయో ఇప్పటికే అర్థం అవుతోంది. హర్యానా, పంజాబ్ రైతులు కేంద్రం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించారు.
అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసిందని అటు కాంగ్రెస్, ఇటు వామపక్షాలు గగ్గోలు పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ఒక్క ఉల్లిగడ్డకే కాదు. అనేక నిత్వాసరాల ధరలు గడచిన నెల రోజుల్లోనే 23 శాతం పెరిగాయి. ఈ ధరలు ఇప్పట్లో దిగివస్తాయన్న నమ్మకం లేదు. ఎందుకంటే కొత్తగా కేంద్రం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలు కల్పించిన వెలుసుబాటును కార్పొరేట్ శక్తులు క్యాష్ చేసుకుంటున్నాయి. అలాంటి వారికి లాభాలే తప్ప వినియోగదారుల అవస్థలు వారికి పట్టవు.